తూర్పుగోదావరి జిల్లా మన్యంలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ.. దేవీపట్నం మండలంలో ఆరు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద తగ్గిన తర్వాత గ్రామాల్లో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దేవీపట్నంతో పాటు తొయ్యేరు, వీరవరం, అగ్రహారం, పోశమ్మగండి, పూడిపల్లి, చినరమణయ్యపేట, ఏనుగులగూడెం తదితర గ్రామాలన్నీ ఇంకా ముంపులోనే ఉన్నాయి. మరో రెండు రోజులు వరద ఉద్ధృతి పూర్తిగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముంపు బాధితులకు 5లీటర్ల కిరోసిన్, 25కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అదనంగా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 5వేల చొప్పున ప్రకటించారు. ఇళ్లు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అధికారులు తెలిపారు. వరద నష్టాలపై అధికారులకు నివేదికలు తయారుచేస్తున్నారు.
అయితే తమ గ్రామాల్లో అంతంతమాత్రంగానే సహాయం అందిందని అగ్రహారం, ఏనుగులగూడెం గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగేందుకు కనీసం బోట్లు సైతం ఏర్పాట్లు చేయకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి అంధకారంలోనే ఉంటున్నామని వారు వాపోతున్నారు.