ETV Bharat / state

ARREST: అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్​.. భారీగా వాహనాలు స్వాధీనం

author img

By

Published : Aug 3, 2021, 4:38 PM IST

Updated : Aug 3, 2021, 6:41 PM IST

Bike thieves
బైక్ దొంగలు

జల్సాలకు అలవాటు పడి సులభ మార్గంలో సొమ్ము సంపాదించాలనుకున్నారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడ్డారు. ఓ ప్రాంతంలోని 11 మంది ముఠా 107 వాహనాలను దొంగిలిస్తే.. మరో ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఏకంగా 109 వాహనాలను చోరీ చేశారు. వీరందరిని అరెస్ట్ చేసిన చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే అంతర్ రాష్ట్ర ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన ద్విచక్ర వాహనాల దొంగతనాలను ఛేదించడానికి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పదకొండు మంది సభ్యులు ఉన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ముఠా బైక్​లను ఇంటి బయట పార్కింగ్ చేసి ఉన్నప్పుడు, షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద పార్క్ చేసినపుడు తస్కరించేవారని వివరించారు. ఈ వాహనాలను తక్కువ ధరకు విక్రయించేవారని తెలిపారు.

వీరంతా చెడు వ్యసనాలకు బానిసై.. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో ద్విచక్ర వాహనాల దొంగతనం చేసేవారని ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ముఠా సభ్యులు వినోద్ కుమార్, సీజీ రాజీ, రవి చంద్ర, సతీష్ కుమార్, వెంకటేశ్వర్లు, సుబ్రమణ్యం, జయచంద్ర, మురళి, కుమరేసన్, జ్యోతి, యుగంధర్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోనూ..

జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు దొంగలు అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అతి చాకచక్యంగా చోరీలకు పాల్పడి.. సొంతగ్రామంలోనే ద్విచక్ర వాహనాలను విక్రయించారు. ఎట్టకేలకు పోలీసులు ఆ ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 109 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 55 లక్షల విలువ గల ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 86 ద్విచక్ర వాహనాలపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. మిగతా బైక్​ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

నిందితులు ఉభయ గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చోరీలకు పాల్పడ్డారు. ఈ వాహనాలను సొంత గ్రామమైన యాదవోలులోనే విక్రయించారు. వీరు విక్రయిస్తున్న ద్విచక్ర వాహనాలు చోరీ చేసినవి అని తెలిసినా.. తక్కువ ధరకు వస్తాయని కొందరు వాటిని కొనుగోలు చేశారు. బైక్ లను కొనుగోలు చేసిన 12 మందిపైన కూడా కేసు నమోదు చేశారు. పార్కింగ్ చేసిన వాహనాలను నకిలీ తాళంతో తీయడం.. లేదంటే బలవంతంగా హ్యాండిల్ ను బ్రేక్ చేయడం వంటి విధానాలతో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

బైక్ దొంగలు

ఇదీ చదవండీ.. Sajjala: ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలుసు: సజ్జల

Last Updated :Aug 3, 2021, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.