ETV Bharat / state

natural farming: మనోడి పొలం చూసేందుకు.. తమిళ బృందమే తరలొచ్చింది!

author img

By

Published : Nov 15, 2021, 7:14 AM IST

anand
anand

వ్యవసాయంపై మక్కువతో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా(Diploma in Agriculture Polytechnic College) చేశాడు ఓ యువకుడు. కల్తీ లేని తిండి గింజల ఉత్పత్తే లక్ష్యంగా ప్రకృతి సేద్యాన్ని చేపట్టాడు. దేశీయ వరి రకాలను సాగు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడే చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన ఆనంద్.

అతని వయసు 20 ఏళ్లు. వ్యవసాయంపై మక్కువతో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా(Diploma in Agriculture Polytechnic College) చేశాడు. ఉద్యోగం వద్దని పుడమి బాటపట్టాడు. కల్తీ లేని తిండి గింజల ఉత్పత్తే లక్ష్యంగా ప్రకృతి సేద్యాన్ని(natural farming) చేపట్టాడు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాడు. తమిళనాడు ఐఏఎస్‌ అధికారుల బృందం మన్ననలు సైతం పొందాడు. అతడే చిత్తూరు జిల్లా(chittoor district) వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లెకు చెందిన చెంగల్రాయుడు, సుజాతల కుమారుడు ఆనంద్‌(20). చదువు ముగిసిన వెంటనే తమకున్న మూడు ఎకరాల పొలంలో ప్రకృతి సాగుకు ఉపక్రమించాడు. సాధారణ రకాలు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే బైరొడ్లు (ఎరుపు రంగు బియ్యం), పంచరత్న (ఎరుపు), కృష్ణవ్రీహి (నలుపు) వరి రకాల సాగు చేపట్టాడు. ఒక్కో రకానికి ఒక ఎకరం చొప్పున పొలం సిద్ధం చేసుకుని, తొలుత నవధాన్యాలు వేసి, మొలకెత్తిన తర్వాత భూమిలో కలియదున్నాడు. ఎకరానికి నాలుగు లోడ్ల పశువుల పేడను వేశాడు. నాలుగు నెలల పంటకాలం లక్ష్యంతో ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి పెట్టాడు. నాట్లు వేసిన 45 రోజుల తర్వాత దేశీయ ఆవు పెరుగుతో చేసిన పుల్లటి మజ్జిగను చల్లాడు. 65 రోజుల తర్వాత దశపత్ర కషాయం (దేశీయ ఆవుల మూత్రంలో పదిరకాల ఆకులను ఉడికించి) పిచికారీ చేశాడు. ఫలితంగా బైరొడ్ల రకం వరి పైరు ఏకంగా 8.5 అడుగులు ఎత్తు పెరిగింది. మంచి కంకులతో ఎకరానికి 35 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో ఎర్రరకం బియ్యం కిలో రూ.120, నల్లరకం రూ.300 ధర పలుకుతున్నాయి. తక్కువ పెట్టుబడితోనే మూడు రెట్ల ఆదాయం వచ్చిందని ఆనంద్‌ సంతోషం వ్యక్తంచేశాడు. ఈ వివరాలు తెలుసుకుని తమిళనాడు రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ అన్నాదొరై, ఆరుగురు ఐఏఎస్‌ అధికారులతో కలిసి ఇటీవల ఆనంద్‌ పొలాన్ని పరిశీలించారు. సాగు విధానాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా వరి కర్రలు నేలవాలకపోవడం ఆశ్చర్యంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

పైరును పరిశీలిస్తున్న తమిళనాడు ఐఏఎస్‌ అధికారుల బృందం

మరిన్ని కొత్త రకాలను సాగు చేస్తా

ప్రకృతి సేద్యం కారణంగానే వరి కాండం బలంగా వచ్చింది. అందుకే గాలివానలను సైతం తట్టుకుని నిలబడింది. బైరొడ్లు, పంచరత్న, కృష్ణవ్రీహి రకాల బియ్యంతో ప్రజల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చక్కెర, గుండె వ్యాధిగ్రస్థులకు మేలు జరుగుతుంది. మున్ముందు మరిన్ని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పండించడమే నా లక్ష్యం. -ఆనంద్‌, యువ రైతు, అయ్యవారిపల్లె

ఇదీ చదవండి

SZC meeting: దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.