ETV Bharat / state

RAINS IN AP: మరోసారి భారీ వర్షాలు.. చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

author img

By

Published : Nov 29, 2021, 4:18 AM IST

Heavy Rains in AP
రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు

Heavy Rains in AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడన ప్రభావంతో మరింత పెద్ద వానలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.

Rains in Andhra pradesh: రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. రాయలసీమ జిల్లాలను మరోసారి భారీ వానలు ముంచెత్తాయి. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వానలు కురిశాయి. కడపలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. గత వరద నుంచి జిల్లావాసులు కోలుకోక ముందే మళ్లీ అల్పపీడనం ఏర్పడటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెరువులన్నీ నిండిపోయి ఉండటంతో...వరదలకు తెగిపోయే ప్రమాదముందని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప శివారులోని ఊటుకూరు చెరువు తెగిందని వదంతులు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టమట్టి కాస్త జరగడంతో ఇసుక బస్తాలతో పటిష్టం చేశారు. జమ్మలమడుగు ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి.


చిల్లకూరులో అత్యధిక వర్షపాతం

నెల్లూరు జిల్లా చిల్లకూరులో అత్యధికంగా 15.4 సెంటీమీటర్ల వర్షపాతం(highest rainfall in Chillakur in Nellore district) నమోదైంది. చిత్తూరు జిల్లాను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాళహస్తి మండలం కండ్రిగుంట చెరువుకు గండి పడింది. చిన్న చెరువు కావడంతో కొంతమేర పంటల నష్టం వాటిల్లింది తప్ప ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. రాయల చెరువు కట్ట పనులను కలెక్టర్‌ హరినారాయణన్‌తోపాటు జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న పరిశీలించారు. చంద్రగిరి మండలంలోని కల్యాణి డ్యాం నీటిమట్టాన్ని సైతం వారు పరిశీలించారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రెండు కనుమ దారులను ఆదివారం రాత్రి పదిగంటలకే తితిదే మూసివేసింది. చిత్తూరు జిల్లాలోని కాళంగి, అరణియార్‌ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. శ్రీకాళహస్తి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోంచి రాళ్లు జారిపడుతుండటంతోరాకపోకలను నియంత్రించారు.

ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. రోజంతా రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపించింది.

ఇదీ చదవండి..

AP Employees Unions future action for PRC: జగన్ సర్కారుపై ఉద్యోగ సంఘాల ఉద్యమం.. షెడ్యూల్ ప్రకటించిన నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.