ETV Bharat / state

అధికారంలోకి రాగానే వైకాపా కంటే మెరుగైన సంక్షేమ పథకాలు

author img

By

Published : Aug 27, 2022, 8:28 AM IST

అధికారంలోకి రాగానే నవరత్నాలకు మించిన సంక్షేమ పథకాల్ని అందిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో మూడోరోజు పర్యటించిన ఆయన, వైకాపా కోతల ప్రభుత్వమని, పింఛన్లు, రేషన్‌ కార్డులు తీసేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ మాదిరి నియంతలా పాలిస్తున్న జగన్‌ ప్రభుత్వంపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Chandrababu Naidu kuppam Tour
చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన

Chandrababu Naidu Kuppam Tour: సీఎం జగన్, వైకాపా నాయకులు ఇంటికో సైకోను తయారు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ మాదిరి సీఎం జగన్ పోలీసుల్ని అడ్డుపెట్టుకుని నియంతలా వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు కృష్ణదాసనపల్లె, యానాదిపల్లి, జరుగు, గుడ్లనాయనపల్లి, గుడుపల్లె మండలం ఓఎన్‌కొత్తూరు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. తండ్రి వైఎస్‌ను అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు కొట్టేశారని ఆరోపించారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారి ఆకలి తీరుస్తుంటే. వాటిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. వైకాపా వాళ్ల అరాచకాల్ని పోలీసులు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని, పోలీసుల్ని దారిలో పెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

వినాయకచవితి పందిళ్ల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా మైనార్టీలకు అందించిన సంక్షేమ పథకాల్ని ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. సీఎం జగన్‌ ప్రజల పాణాల్ని పణంగా పెట్టి మద్యంపై 25 వేల కోట్లు అప్పులు తెచ్చారని చంద్రబాబు విమర్శించారు. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తుందని, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాల్ని తెలుగుదేశం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.

గురువారం అన్నక్యాంటీన్‌ విధ్వంసంతో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ భరత్ నివాసం వైపుగా చంద్రబాబు వెళ్లాల్సిన రావడంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద 200 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుడిపల్లె మండలం కొత్తూరు సభలో పాల్గొన్న చంద్రబాబు.. మూడు రోజుల పర్యటన ముగియడంతో అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు.

చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన

మరోవైపు కుప్పంలో చంద్రబాబు పర్యటన ముగిసిన వెంటనే,గురువారం తెదేపా నిరసన ర్యాలీలో పాల్గొన్న 33 మంది తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్సీ జి. శ్రీనివాసులు, కుప్పం కౌన్సిలర్‌ జాకీర్‌తో పాటు శాంతిపురం మండలానికి చెందిన నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరు తరలించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.