ETV Bharat / state

అరాచక పాలన.. అడుగడుగునా దోపిడీ

author img

By

Published : Apr 9, 2021, 5:19 AM IST

మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు
మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

అరాచక పాలన, అడుగడుగునా దోపిడీ లక్ష్యంగా వైకాపా పాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైకాపాను ఓడించి, జగన్‌కు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని చంద్రబాబు శ్రీకాళహస్తి నుంచి గురువారం ప్రారంభించారు. పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. బేరివారి మండపం వద్ద బహిరంగ సభలో, ఉదయం తిరుమలలోనూ మాట్లాడారు.

అరాచక పాలన, అడుగడుగునా దోపిడీ లక్ష్యంగా వైకాపా పాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైకాపాను ఓడించి, జగన్‌కు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని చంద్రబాబు శ్రీకాళహస్తి నుంచి గురువారం ప్రారంభించారు. పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. బేరివారి మండపం వద్ద బహిరంగ సభలో, ఉదయం తిరుమలలోనూ మాట్లాడారు. తిరుమలలో ఇటీవల ఒకరిని ప్రధాన అర్చకులుగా నియమించారని, ఆయన మా ఇంట్లో పింక్‌ డైమండ్‌ ఉందని గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ధైర్యం ఉంటే వచ్చి చూసుకోవచ్చని తాను ఆనాడే చెప్పానన్నారు. నాడు తితిదేపైనే పరువు నష్టం దావా వేసిన ఆ వ్యక్తి, ఇప్పుడు పింక్‌ డైమండ్‌ పోలేదని కేసును వెనక్కి తీసుకుంటానంటున్నారని తెలిపారు. ఆ వ్యక్తి ఇప్పుడు జగన్‌ను దేవుడికంటే గొప్పవాడని కీర్తించడం, మహావిష్ణువుతో పోల్చడం బాధ కలిగిస్తోందన్నారు. ఎన్నో అపవిత్ర కార్యక్రమాలు చేసిన అలాంటి వ్యక్తిని తిరిగి తితిదేలో నియమించడం సరికాదని చంద్రబాబు ఆక్షేపించారు.
గోరంత చేసి.. కొండంత దోచారు
‘దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. జగన్‌ విద్యుత్తు ఛార్జీలు, ఆర్టీసీ, ఆస్తి పన్నులు పెంచారు. లబ్ధిదారులకు రూ.10 వేలు ఇచ్చి రూ.లక్ష దోచుకుంటున్నారు. ఏపీˆ ఫైబర్‌నెట్‌ రూ.149కి ఇస్తే ఇప్పుడు రూ.400 చేశారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు లేవు. ఇంజినీరింగ్‌ కళాశాలలు మూసేస్తున్నారు. చదువుకోవాలంటే వేరే రాష్ట్రం వెళ్లాల్సిన పరిస్థితి. రెండేళ్లుగా రాష్ట్రంలో ఏ పనీ జరగలేదు. వైకాపా ప్రభుత్వం చేసింది గోరంత.. దోచుకుంది కొండంత. అమ్మ ఒడికి రూ.15వేలు ఇస్తున్నారు.. మద్యం ధరలు పెంచి నాన్న జేబులో నుంచి రూ.30 వేలు దోచుకుంటున్నారు’ అన్నారు. ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, అయినా వారికి భయపడే సమస్య లేదన్నారు. రాష్ట్రాన్ని, తిరుపతి పవిత్రతను కాపాడేందుకు తాను వచ్చానన్నారు. మాకెందుకులే అని ప్రజలు ఇళ్లల్లో కూర్చుంటే కొంపలు మునుగుతాయన్నారు.

ప్రజల గుండెల్లో తెదేపా ఉంది
‘ఎన్నికల్లో 5 లక్షల ఆధిక్యం వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు తెదేపానే ఉండదని మాట్లాడుతున్నారు. ప్రజల గుండెల్లో తెదేపా ఉంది. వాలంటీర్లు, పోలీసులు, రౌడీలకు భయపడి తగ్గితే నష్టపోతాం. ఎన్నికల్లో రూ.2వేలో, రూ.5 వేలో ఇచ్చి రూ.వేల కోట్ల డబ్బు సంపాదిస్తారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా నేను, నా కుటుంబం ఇలా చేయలేదు. ప్రజలు, రాష్ట్రం కోసం బతుకుతున్నాం. నాడు నేను పెట్టుబడుల కోసం విదేశాలు తిరిగితే నేడు అప్పుల కోసం పంపిస్తున్నారు. అభివృద్ధి లేనిది అప్పు ఎవరిస్తారు? ఇప్పటివరకు ఉద్యోగులకు జీతాలు రాలేదు, పింఛన్లు అందలేదు. రాష్ట్రం దివాలా తీసింది. జగన్‌ కంపెనీవాళ్లు మాత్రమే కోటీశ్వరులు అవుతున్నారు. ప్రజల ఆస్తులను దోచుకుంటూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.
ప్రజలు మాట్లాడాలి..
ప్రత్యేక హోదా తెస్తామని, వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని నాడు ప్రగల్భాలు పలికిన జగన్‌.. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నా నోరు మెదపట్లేదు. ప్రజా రాజధానిని సర్వనాశనం చేశారు. ప్రజలు నిలదీయాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప సీˆ్టల్‌ ప్లాంటుకు నాడు మేం శంకుస్థాపన చేస్తే మళ్లీ చేశారని, దివాలా కంపెనీలను తెచ్చి డబ్బులు దండుకున్నారని విమర్శించారు.
బాబాయిని ఎవరు చంపారు?
‘సీఎం బాబాయి వివేకానందరెడ్డి చనిపోయి రెండేళ్లయింది. ఎవరు హత్య చేశారో వాళ్లకు తెలుసు. చెల్లెలు అడుగుతున్నా పెదవి విప్పడం లేదు. పుంగనూరులో ప్రగల్భాలు పలుకుతున్న నేతలు నేను తలచుకుంటే 22 ఏళ్లపాటు ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్లా? తెదేపా వచ్చాక వారు ఎక్కడుంటారో తెలుసుకోవాలి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్ని వర్గాలను దోచుకుంటున్నారు. ఇసుకను దొంగతనంగా తమిళనాడుకు తరలించడంలో ఆయన హస్తం ఉందని పలువురు చెబుతున్నారు’ అని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌కు అభినందనలు
‘ఇటీవల కేసీˆఆర్‌ మాట్లాడిన దానికి అభినందిస్తున్నా. ఒకప్పుడు రాష్ట్రంలో ఎకరా అమ్మితే తెలంగాణలో రెండెకరాలు కొనేవారు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే రాష్ట్రంలో రెండెకరాలు కొనవచ్చని కేసీఆర్‌ అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడ అర ఎకరం అమ్మి, ఇక్కడ 10 ఎకరాలు కొనవచ్చు’ అని చంద్రబాబు విమర్శించారు.
తిరుమల.. రాష్ట్రానికి గొప్ప సంపద
గురువారం ఉదయం తిరుమల వచ్చిన చంద్రబాబు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల క్షేత్రం రాష్ట్రానికి ఉన్న గొప్ప సంపదని, దాని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
* సాధారణంగా రాష్ట్రంలోని అధికారపక్షంతోపాటు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో శ్రీవారి ఆలయానికి వచ్చినవారిని రంగనాయకుల మండపం వద్ద తితిదే సమాచారశాఖ ఫొటోలు తీసి మీడియాకు విడుదల చేస్తుంది. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తితిదే సమాచార శాఖ కనీసం ఫొటో కవరేజీని కూడా ఇవ్వలేదని తెదేపా నాయకులు ఆక్షేపించారు.

ఇదీ చదవండి: మళ్లీ లాక్‌డౌన్‌ రానివ్వొద్దు : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.