తిరుపతి అభివృద్ధిపై వైకాపాకు ఎలాంటి స్పష్టత లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. అక్రమాలు, దోపిడీలు, దందాలు వైకాపా అజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఆలయంలోనూ అన్యమతస్తులే ఉంటున్నారని సోము ధ్వజమెత్తారు.
'తిరుమలలో క్రిస్మస్ శుభాకాంక్షలు'
తిరుమలలో మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారని భాజపా రథసారథి గుర్తు చేశారు. చర్చికి వెళ్లి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.
'ఆ దాడిని ఖండిస్తున్నాం'
తిరుపతిలో తెదేపా అధినేత చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనను ఖండిస్తున్నట్లు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన సోము.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబుపై జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. ఇదే సందర్భంలో తెదేపా హయాంలో అమిత్ షాపై జరిగిన దాడిని గుర్తు చేస్తున్నామన్నారు.
నిధుల మళ్లింపు..
పోలవరం నిధులను వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
'వేళాకోలం ఏమిటి'
వైకాపా ప్రభుత్వం దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతోందని పార్టీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవ్ధర్ మండిపడ్డారు. తిరుమల శ్రీవారి నామాన్ని పెట్టుకుంటే వైకాపా మంత్రి దాన్ని వేళాకోళం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : తెలుగు ప్రజలకు జస్టిస్ ఎన్వీ రమణ ఉగాది శుభాకాంక్షలు