ETV Bharat / state

Crime News in AP: అంతిమయాత్రకు వచ్చి అనంతలోకాలకు.. విద్యుత్​షాక్​తో ముగ్గురు మృతి

author img

By

Published : Jun 16, 2023, 10:12 PM IST

shock
shock

Todays Crime News: చనిపోయిన వ్యక్తి అంతిమ యాత్రలో పాల్గొనేెందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె గ్రామంలో జరిగింది. అనంతపురం నగరంలో కబ్జాదారుల బెదిరింపులకు ఓ వ్యాపారి బలయ్యాడు.

Todays Crime News: విద్యుదాఘాతంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె గ్రామంలో తంబిగానిపల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియలలో భాగంగా రాణి మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. శ్మశానవాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్‌ తీగలకు పాడె తగిలడంతో విద్యుదాఘాతంతో తిరుపతి, రవీంద్రన్‌, మునప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోస్టుమార్టం కోసం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ముగ్గురి శవాలను తరలించారు.

అనంతపురం నగరంలో కబ్జాదారుల బెదిరింపులకు ఓ వ్యాపారి బలయ్యాడు. రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జారాయుళ్లకు వత్తాసు పలకడంతో తీవ్ర మనోవేదన చెంది తుమ్మల వంశీ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా చిన్నపలకలపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ 30 ఏళ్ల కిందట అనంతపురానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. అయితే 20 ఏళ్ల కిందట అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామ సమీపంలో 5.68 ఎకరాల భూమి కొన్నాడు. ఈ భూమి కోసం తిమ్మాపురం బుల్లెట్ బాబు, తిమ్మాపురం సర్దార్, దూదేకుల కాసిం అనే ముగ్గురు కబ్జారాయుళ్లు, రూరల్ మండల ఆర్ఐ విష్ణు బెదిరిస్తున్నారని సూసైడ్ నోట్ లో తుమ్మల వంశీ రాశారు. 20 ఏళ్ల కిందట భూమి కొని, తన భార్య సుభాషిని పేరుపై రిజిస్టర్ చేయించానని పాస్​బుక్, సర్వే నెంబర్ తో ఆన్లైన్​లో కూడా తన భార్య పేరుపైనే ఉందని సూసైడ్ నోట్​లో రాశాడు. అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని మృతుడి భార్య సుభాషిణి కన్నీటిపర్యంతమయింది. ఘటన స్థలానికి ఒకటవ పట్టణ పోలీసులు వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కాకర్ల సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. నలుగురు యువకులు తిరువూరు నుంచి సినిమా చూసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఎ.కొండూరు మండలం అట్లప్రగడకు చెందిన పల్లెపోగు అశోక్ (22), మేడిపల్లి రవీంద్ర (19) మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం నుండి లక్కవరం వెళ్లే మార్గంలోని ఎర్ర కాలువలో ఓ వ్యక్తి గల్లంతైనట్లు తెలుస్తోంది. లక్కవరం గ్రామానికి చెందిన దల్లి దుర్గారెడ్డి గురువారం ధాన్యానికి సంబంధించిన సొమ్మును జంగారెడ్డిగూడెంలోని బ్యాంకు నుండి విత్​డ్రా చేసేందుకు వెళ్ళి తిరిగి ఇంటికి చేరలేదని స్ధానికులు తెలిపారు. అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో దుర్గరెడ్డి అన్నయ్య శ్యామ్ మరుసటి రోజు ఉదయం అదే మార్గం గుండా వెళ్లి చూడగా.. ఎర్ర కాలువ పక్కన దుర్గారెడ్డి ద్విచక్ర వాహనం, చెప్పులు ఉండటం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించానని శ్యామ్ చెప్పారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టామని.. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం ధనుంజయుడు కాలువ వద్దకు చేరుకుని దుర్గారెడ్డి బంధువులు, స్థానికుల వద్ద నుండి వివరాలు సేకరించినట్టు వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ దుర్గారెడ్డి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక వాహనాన్ని, చెప్పులను ఎక్కడ వదిలి ఎటైనా వెళ్లిపోయాడా తెలియాల్సి ఉందని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.