రెండేళ్లలో రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని.. సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజురోజుకూ ప్రజల్లో తెదేపాకు ఆదరణ పెరుగుతోందని, చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని అన్నారు. కార్యకర్తలు ఇదే ఉత్సాహం కొనసాగించాలని కోరారు.
ఎన్టీఆర్ దార్శనికుడని, నేటితరం నాయకులు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. మాజీమంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు ఆనందబాబు మాట్లాడుతూ ఎన్నో హిట్ చిత్రాలను ప్రజలకు అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు చేతులమీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో 360 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: