ETV Bharat / state

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: తెదేపా

author img

By

Published : Jul 5, 2021, 5:40 PM IST

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెదేపా నేతలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రైతుల పట్ల పోరాటాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. ఆ మేరకు అధికారులకు వినతి పత్రం అందించారు.

tdp protests
తెదేపా నిరసనలు

రైతుల సమస్యలను పరిష్కరించాలని తెదేపా నాయకులు అనంతపురం జిల్లాలో నిరసనలు చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

కళ్యాణ దుర్గంలో...

కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తెదేపా నేతలు ర్యాలీ నిర్వహించారు. అతివృష్టి, అనావృష్టి వంటి కారణాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్ట పరిహారం అందించాలని తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

కదిరిలో...

రైతుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య తీరును నిరసిస్తూ కదిరి నియోజక వర్గంలోని తనకల్లు,గాండ్లపెంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం నాయకులు ధర్నా చేపట్టారు. అన్నదాతకు పెట్టుబడి రాయితీ, పంటల బీమా చెల్లింపు విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.

హిందూపురంలో...

ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూపురంలోని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

మడకశిరలో...

మడకశిర పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేతలు నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.

రాయదుర్గంలో...

రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 2018 -19 ఒక సంవత్సరంలో ఇన్​పుట్ సబ్సిడీ 6.32 లక్షల మంది రైతులకు రూ.932 కోట్లు ఇవ్వాలని... 2019 -20 సంవత్సరంలో నష్టపోయిన రైతులు రూ.2,500 కోట్లు పరిహారం చెల్లించాలని తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

నార్పలలో...

రైతుల సమస్యలను పరిష్కరించాలని నార్పల మండలంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. తెదేపా అమలు చేసిన డ్రిప్ రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో రైతుల గురించి పట్టించుకునే వారే కరవయ్యారని ఆరోపించారు. అనంతరం నార్పల తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు.. తెదేపా నేతల పట్ల వైఖరి సరిగా లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.