ETV Bharat / state

'శ్రీవారిని దర్శించుకునే ముందు జగన్ డిక్లరేషన్​పై సంతకం చేయాలి'

author img

By

Published : Sep 23, 2020, 3:20 PM IST

Updated : Sep 23, 2020, 5:05 PM IST

Kalava Srinivasulu Advise to cm jagan over declaration
కాలవ శ్రీనివాసులు

సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్​పై సంతకం చేసి.. అందరి మనోభావాలు గౌరవిస్తామని నిరూపించుకోవాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు హిందువులకు ఆవేదన కలిగిస్తుంటే... మంత్రుల మాటలు ఆగ్రహం తెప్పించేవిగా ఉంటున్నాయని కాలవ ఆక్షేపించారు.

కాలవ శ్రీనివాసులు

రాష్ట్రంలో గత వంద రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వానికి హైందవ సంస్కృతీ, సాంప్రదాయలను పరిరక్షించే ఉద్దేశమే లేనట్టుందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో హిందువులు ఆవేదనతో ఉంటే... మంత్రులు అగ్గికి ఆజ్యం పోసే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. రథాలను కాల్చేస్తున్నా.. ఏమవుతుందన్న అహంకారంతో మంత్రులు మాట్లాడుతున్నారని కాలవ మండిపడ్డారు. ఇలాంటి పరిణామాల మధ్య ముఖ్యమంత్రి జగన్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే ముందు డిక్లరేషన్​పై సంతకం చేసి.. అందరి మనోభావాలు గౌరవిస్తామని నిరూపించుకోవాలని హితవు పలికారు. డిక్లరేషన్​పై సంతకం చేయించుకోవాల్సిన బాధ్యత తితిదే ఈవోపై ఉందన్నారు. అందుకే దీనిపై తాము తితిదేకు లేఖ రాస్తున్నట్లు శ్రీనివాసులు వివరించారు.

తిరుమలలో డిక్లరేషన్‌పై సీఎం జగన్‌ సంతకం చేయాల్సిందేనని మాజీమంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. ఎవరైనా సంప్రదాయాలను గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మౌనానికి కారణమేంటని ప్రశ్నించారు. మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్న దేవినేని ఉమ... భక్తుల మనోభావాలను కించపరిచేలా మంత్రులు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హిందూధర్మ పరిరక్షణకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉంటే తిరుమలలో డిక్లరేషన్​పై సంతకంచేసి స్వామివారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఆనంద సూర్య డిమాండ్ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఔన్నత్యం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలతో కొండపైకి వెెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇస్తూ సంతకం పెట్టాల్సిన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలని రాజప్ప డిమాండ్ చేశారు.

సీఎం జగన్ హిందూ మతాన్ని గౌరవించాలని మాజీఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పేర్కొన్నారు. తితిదే సంప్రదాయాలను పట్టించుకోకుండా, డిక్లరేషన్ లేకుండా అన్యమతస్థులు తిరుమలకు వెళ్లడాన్ని నిరసిస్తూ జగ్గయ్యపేట పట్టణంలో కొత్తవెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్యాలయానికి లేఖలు పంపారు. హిందువులు కాకపోయినా ఏ మతస్తులు అయినా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆయన మీద విశ్వాసం, నమ్మకం ఉంటే చాలని.. ప్రతి ఒక్కరూ దర్శించుకునేలా అనాది నుంచి ఉన్న డిక్లరేషన్ ఫారంను నింపడానికి ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.

ఇదీ చదవండీ... ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి రావొద్దు: పరిపూర్ణానంద

Last Updated :Sep 23, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.