ETV Bharat / state

పంట పోయింది.. కంటతడి మిగిలింది

author img

By

Published : Nov 9, 2020, 7:55 AM IST

అనంతపురం జిల్లాలో సుమారు 4లక్షల హెక్టార్లలో 1500 కోట్ల రూపాయల్లో పంట దిగుబడికి నష్టంవాటిల్లిందని ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. వేరుసెనగ పంటనష్టంపై కేంద్రం బృందానికి జిల్లా యంత్రాంగం తెలపనుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇతర పంటలతో పాటు వేరుసెనగ కూడా పోయింది. సాయం అందించి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

crops were destroyed due to incessant rains
పంట పోయింది.. కంటతడి మిగిలింది

చేతికొచ్చే పంటంతా తడిసిపోయింది.. రైతు కంట కన్నీరే మిగిలింది. లాభాల మాట దేవుడెరుగు.. పెట్టుబడి డబ్బులే దక్కని పరిస్థితి నెలకొంది. అతివృష్టి, అనావృష్టి వెంటాడుతూ అన్నదాతను మరింత అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయి. ఈసారి భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో ప్రధాన పంట అయిన వేరుసెనగ, సాధారణ విస్తీర్ణం కన్నా అత్యధికంగా సాగయింది. సుమారు 12 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరానికి రెండు, మూడు బస్తాలు కూడా రాలేదు. వేరుసెనగ రైతు కోలుకోలేని దుస్థితి నెలకొంది. సెప్టెంబరు, ఆక్టోబరు నెలల్లో భారీ వర్షాలు కురువడంతో తొలగించిన వేరుసెనగ పంటంతా తడిసిపోయింది. కనీసం పశుగ్రాసం కూడా దక్కని పరిస్థితి. దిగుబడి తగ్గిందని పంటకోత ప్రయోగాలూ వెల్లడించాయి. వర్షాలకు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు పంట నీట మునిగి, కొట్టుకుని పోయింది.

  • 13,050 హెక్టార్ల నష్టం

జిల్లాలో సెప్టెంబరు, ఆక్టోబరులో కురిసిన భారీ వర్షానికి 13,050 హెక్టార్లలో రూ.20 కోట్ల వరకు పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. నివేదికను ప్రభుత్వానికి పంపగా, క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని జిల్లాకు పంపనున్నారు. అందులో ప్రధానంగా వేరుసెనగ పంట 9,828 హెక్టార్లలో రూ.14 కోట్లు, పత్తి 2,501 హెక్టార్లలో రూ.3.7 కోట్లు, వరి 422 హెక్టార్లలో రూ.70 లక్షలు, మొక్కజొన్న 102 హెక్టార్లలో రూ.12 లక్షలు దెబ్బతిన్నాయి.

  • వేరుసెనగ రైతుకు కోలుకోలేని దెబ్బ

గత ఏడాది తొలకరిలో వర్షాలు అనుకూలించడంతో ఖరీఫ్‌లో జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో సాగైంది. జూన్‌, జులైలో అత్యధింగా వర్షాలు కురిశాయి. ఆ నెలల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి. కాని పూత, కాయ లేదు. మొక్కకు రెండు, మూడు కాయలు మాత్రమే ఉన్నాయి. ఎకరానికి రెండు, మూడు బస్తాలు కూడా దిగుబడి రాని పరిస్థితి. పంటకోత ప్రయోగాల ద్వారా హెక్టారు 1100 కిలోలు దిగుబడి రావాల్సి ఉండగా 400-500 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చిందని ముఖ్య ప్రణాళికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. దాన్ని బట్టి జిల్లాలో వేరుసెనగ సుమారు రూ.1500 కోట్ల నష్టంవాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా.

  • కొనేదెవరు..?

జిల్లాలో తడిసిన వేరుసెనగ కాయలు నల్లగా మారాయి. ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,275 మద్ధతు ధర ప్రకటించింది. గింజ బరువు 70 శాతం ఉండాలి. తేమ 8 శాతం లోపు ఉండాలని ప్రభుత్వ నిబంధన. కాయలు రంగు మారడం, గింజ బరువు శాతం తక్కువగాను తేమ శాతం ఎక్కువగా ఉండటంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడంలేదు. అరకొరగా పండిన పంటను ఎవరూ కొనడంలేదని రైతులు వాపోతున్నారు. ఇటీవల మార్కెటింగ్‌శాఖ ప్రధాన కార్యదర్శి మధుసూధన్‌రెడ్డి జిల్లాలో పర్యటించి, వేరుసెనగ పంటను పరిశీలించారు. ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు వేడుకున్నారు.

  • కనిపించని కొనుగోలు కేంద్రాల జాడ

వేరుసెనగ పంట తొలగింపు ప్రక్రియ పూర్తవుతున్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల జాడ లేకుండాపోయింది. దీంతో రైతులు వాటిని నిల్వ ఉంచేందుకు ఇబ్బంది పడుతున్నారు. రైతులు తమ గ్రామాల్లోనూ, బళ్లారి లాంటి మార్కెట్‌లలో దళారులు, కమీషన్‌ ఏజెంట్ల సాయంతో వాటిని అమ్మేస్తున్నారు. అందరూ రైతులు అదే దారిలో సాగక ముందే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

నేడు కేంద్ర బృందం పర్యటన

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సోమవారం కేంద్ర బృందం జిల్లా పర్యటనకు రానుంది. ఉదయం హెలికాప్టర్‌లో వజ్రకరూరు మండలానికి చేరుకుంటారని చెప్పారు. 11.30- 12.00 గంటల మధ్య వజ్రకరూరులో చిత్రప్రదర్శన తిలకిస్తారు. అదే మండలంలోని రాగులపాడు, వజ్రకరూరు, గూళ్యపాల్యం, గుంతకల్లు మండలం నక్కలదొడ్డి, పాతకొత్తచెరువు గ్రామాల్లో పంటలను పరిశీలిస్తారు. వేరుసెనగ నూర్పిడి, పశువుల మేతను పరిశీలిస్తారు. ఆయా ప్రాంతాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన పర్యటన మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని, 3.30 గంటలకు వజ్రకరూరు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్తారని పర్యటన షెడ్యుల్‌లో పేర్కొన్నారు.

మహిళా రైతు సరస్వతి స్వగ్రామం ఉరవకొండ మండలం మోపిడి. నాలుగు ఎకరాల్లో వచ్చిన వేరుసెనగ దిగుబడి ఇది. అంటే ఎకరానికి మూడు బస్తాల దిగుబడి రావడం కూడా కష్టమే. ఈమె ఎకరాకు రూ.30వేలకు పెట్టుబడి పెట్టారు. తనకు రెండు ఎకరాల పొలం ఉండగా, మరో రెండు ఎకరాలు కౌలుకుతీసుకుని సాగు చేశారు. పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి. కనీసం రూ.5వేలకు క్వింటా ప్రకారం కూడా వాటిని కొనేవారు లేరని ఆమె వాపోతున్నారు.

అప్పు చేసి కౌలు చెల్లించాలి

నేను నాలుగు ఎకరాల పొలాన్ని రూ.60వేలకు కౌలుకు తీసుకుని పంట సాగు చేశా. పెట్టుబడి రూ.1.20లక్షల పెట్టుబడి అయింది. 10 క్వింటాళ్ల దిగుబడి రాగా క్వింటా రూ.5వేల ప్రకారం విక్రయించా. దాని ద్వారా రూ.50వేలు వచ్చింది. కౌలు, పెట్టుబడి కలిసి రూ.1.30 నష్టం వచ్చింది. చివరకు కౌలును కూడా అప్పు చేసి చెల్లించాల్సి వస్తోంది. కనీసం గిట్టుబాటు ధర ఉంటే నష్టం కాస్త తగ్గేది. - ఆంజనేయులు, రైతు

ఇదీ చదవండీ...

కొత్త ఇసుక విధానం.. కేంద్ర సంస్థలకు రాష్ట్ర గనులశాఖ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.