ETV Bharat / state

అధిక వర్షాలతో కుదేలైన అనంత రైతులు

author img

By

Published : Oct 30, 2020, 8:09 AM IST

అనంతపురం జిల్లాలో పంట నష్టానికి, అధికారుల అంచనాలకు పొంతనలేకుండా పోతోంది. జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా కురిసిన కుండపోత వర్షాలు ఖరీఫ్ పంటలను తుడిచిపెట్టేశాయి. కొన్ని చోట్ల పంటలు ఇంకా నీటి మునక నుంచి బయటపడకపోగా.. మరికొన్ని చోట్ల తడిసిన పంట పశుగ్రాసానికి కూడా పనికి రాకుండా బూజు వచ్చింది. వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోగా, పత్తి పొలాల్లో పూతకాయలు అట్టేరాలిపోయి అన్నివిధాలా నష్టపోయారు.

farmers-crop
farmers-crop

ఏటా వర్షాభావంతో నష్టపోయే అనంత రైతులు.. ఈసారి అధిక వర్షాలతో అప్పులపాలయ్యారు. దశాబ్దకాలంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి రికార్డుస్థాయిలో వర్షాలు నమోదయ్యాయి. మూడు విడతలుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ పంట కుళ్లిపోయింది. ఈసారి ఖరీఫ్​లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 6.41 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుచేశారు. దీనిలో ఐదు లక్షల హెక్టార్లలో వేరుశనగను సాగుచేశారు. జూన్, జూలై, ఆగస్టు వరకు రైతులు వాతావరణ అనుకూలతను బట్టి విత్తనం వేశారు. కొన్నిచోట్ల సకాలంలో వర్షాలు కురవగా.. మరికొన్నిచోట్ల రైతులు విత్తనం వేయటానికి అవకాశం లేకుండా రోజూ జల్లులు పడుతూనే ఉన్న భిన్నమైన పరిస్థితి రైతులు ఎదుర్కొన్నారు.

దీంతో ఏటా ఒక్కసారిగా విత్తనం పడే పరిస్థితి ఈసారి లేకుండా పోయింది. వాతావరణం ఈసారి అన్నదాతను తీవ్రంగా నష్టపరిచింది. అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ వేసిన పంట నష్టం అంచనాలు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేనివిధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 శాతం కంటే ఎక్కువగా పంట నష్టం జరిగిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇన్​పుట్ రాయితీ కోసం నివేదికలు సిద్ధం చేశారు. వేరుశనగ పంటకు 7వేల 425 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగినట్లు గణాంకాలు చూపుతున్నారు. ఈ పంట వేసిన రైతులు కేవలం 6వేల 600 మంది నష్టపోయినట్లు ప్రభుత్వానికి నివేదించారు. అన్నిచోట్లా వేరుశనగ రైతులు పలు దశల్లో పంటను నష్టపోయారు.

అయితే అధికారులు మాత్రం పీకటానికి సిద్ధంగా ఉన్న పంటను, కీలక దశలో ఉన్న పంటలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. కుప్పవేసిన పంటను పరిహారం జాబితాలో చూపలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పవేసిన పంట ఎక్కడిక్కడ నల్లగా మారిపోయి, వేరుశనక్కాయలు తడిసి మొలకెత్తగా.. పశుగ్రాసం బూజు పట్టింది. ఇంతటి నష్టం జరిగినా పరిహారం నివేదికలో నమోదు చేయలేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయశాఖ 12 రకాల పంటలకు మాత్రమే భారీ వర్షాలతో నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదించింది. జిల్లాలో ఏడు లక్షల 25 వేల మంది రైతులుండగా, కేవలం 14 వేల 747 మంది రైతులే నష్టపోయారని లెక్కతేల్చింది.

ఉద్యానశాఖకు సంబంధించి ఇంకా అంచనాలే పూర్తికాలేదు. జిల్లాలోని విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లో అత్యధికంగా మిరపను సాగుచేశారు. అక్కడి రైతులు అధిక వర్షాలతో పంటకు విల్ట్ తెగులు సోకింది. అన్నిచోట్లా పంటను తొలగించారు. అయితే ఉద్యానశాఖ అధికారులు అక్కడ ఈ-కర్షక్ లో పంట నమోదే చేయలేదు. దీంతో పంటను తొలగించిన రైతులకు పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో 4 వేల 600 హెక్టార్లలో మిరప సాగు చేస్తుండగా, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లోనే అత్యధికంగా సాగవుతోంది. అయితే ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పంట నమోదు చేయకుండా ఉద్యానశాఖ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం ఈ-కర్షక్ నమోదుకు అవకాశం లేకుండా గడువు పూర్తైంది.

వ్యవసాయ పంటలకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లగా కేవలం 36 కోట్లే పెట్టుబడి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికీ ఏ గ్రామానికి వెళ్లినా పంట నష్టం చూడటానికి అధికారులే రాలేదని రైతులు ఆవేదనగా వ్యక్తం చేస్తు్న్నారు. అనంతపురం జిల్లాలో పంట నష్టంపై రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. రైతులు సర్వస్వం కోల్పోయినప్పటికీ కేవలం 36 కోట్ల అంచనాలతో అన్నదాతకు అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పంట నష్టంపై అధికార పక్షంలోని ప్రజాప్రతినిధులు నోరు మెదపలేక.. కినుకు వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 2,905కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.