ETV Bharat / state

హైవే పై 1.75 ఎకరాల భూమి.. 33 ఏళ్ల లీజు.. ఏడాదికి అద్దె రూ.1750 మాత్రమే

author img

By

Published : Dec 22, 2022, 10:13 AM IST

Anakapalli Lands: ప్రభుత్వ స్థాలాలపై అధికార వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని అంటున్నారు అనకాపల్లి జిల్లా వాసులు. కొద్దిరోజులు క్రితం ఆర్టీసీ స్థలాన్ని బాపట్లలో వైసీపీ కార్యాలయానికి కట్టబెట్టారు. తాజాగా అనకాపల్లిలో ఏడాదికి 1750 రూపాయలకే 15కోట్ల విలువైన స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

anakapalli lands
అనకాపల్లి భూములు

Anakapalli Lands: బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కట్టబెట్టిన వ్యవహారం మరవకముందే.. అనకాపల్లిలోనూ అదే తంతు సాగుతోంది. జాతీయ రహదారి దగ్గర్లో ఉన్న 15 కోట్ల విలువైన స్థలాన్ని.. ఏడాదికి 17వందల 50 నామమాత్రపు లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైపోయారు. విశాఖ నగర పరిధిలోకి వచ్చే స్థలానికి సర్పంచి నుంచి తీర్మానం తీసుకున్నామంటూ.. అధికార పార్టీకి అప్పనంగా అప్పగించేందుకు అడ్డుగోలుగా ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రజావసరాలకు ఉపయోగించే స్థలాన్ని పార్టీలకు ఇచ్చేస్తుంటే సహించేది లేదని స్థానికులు తేల్చిచెబుతున్నారు.

ఏడాదికి 1750 రూపాయలు మాత్రమే: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌ కోసం మారుమూల గ్రామంలో ఓ ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు సుమారు 2 లక్షల పైనే అద్దె చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ భవనం, చుట్టూ ఖాళీ స్థలం కలిపి సుమారు ఎకరా విస్తీర్ణం ఉంటుంది. అదే జిల్లాలో జాతీయ రహదారికి 300 మీటర్ల దూరంలో 1.75 ఎకరాల స్థలాన్ని అధికార పార్టీ కార్యాలయానికి కేటాయిస్తున్నారు. అది కూడా ఏడాదికి కేవలం 17వందల 50 రూపాయల చొప్పున 33 ఏళ్లకు లీజుకు అప్పగించేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి భారీగా అద్దెలు చెల్లించడానికి సిద్ధమవగా.. వైసీపీ కార్యాలయం కోసం మాత్రం కారుచౌకగా స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నారు. అలాగే నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకంలో కొండలు, గుట్టలపై పేదలకు స్థలాలిచ్చారు. అలాంటి భూముల్నే కొన్నిచోట్ల ఎకరా 70 లక్షలు పెట్టి మరీ కొన్నారు. కానీ జాతీయ రహదారికి దగ్గర్లో ఉన్న స్థలాన్ని.. ఏడాదికి వెయ్యి రూపాయల అద్దెతో వైసీపీ కార్యాలయానికి ఇచ్చేందుకు సిద్ధమైపోయారు.

పార్టీ కార్యాలయం కోసం: ప్రజావసరాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న ధోరణిలో వైసీపీ నేతలు ఉన్నారు. గ్రామావసరాల కోసం ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్న స్థలాన్ని అధికార పార్టీ కార్యాలయం కోసం గద్దలా తన్నుకుపోతున్నారు. అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేటలో సుమారు 15 కోట్లు విలువ చేసే 1.75 ఎకరాల స్థలాన్ని... వైసీపీకు అప్పగించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఏడాదికి ఎకరం వెయ్యి చొప్పున 33 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు నేడో రేపో ఆమోదముద్ర వేసి, ఉత్తర్వులు జారీ చేస్తారని చర్చ నడుస్తోంది.

కోరుకున్న దగ్గర స్థలం: వైసీపీ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని.. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఈ ఏడాది మే నెలలో అనకాపల్లి కలెక్టర్‌ను కోరారు. ముందుగా శంకరం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్‌ 28లో ఎకరా స్థలం గుర్తించి, అధికార పార్టీకి కేటాయించడానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఆ స్థలం తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సరిపోదని... ఇంకో చోట తాము చూసిన స్థలాన్ని కేటాయిస్తే అన్నివిధాలా బాగుంటుందని వైసీపీ నేతలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కోరిందే తడవుగా తహసీల్దార్‌ నుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు.. వారు అడిగిన కొత్తూరు నర్సింగరావుపేట స్థలాన్ని పరిశీలించడం, అప్పగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం చకచకా జరిగిపోయాయి. పార్టీ కార్యాలయానికి ఇస్తున్న 1.75 ఎకరాల స్థలం విలువ 5.25 కోట్లు ఉంటుందని చెబుతూనే... ఏడాదికి 17వందల 50 చొప్పున లీజుకు ఇవ్వడానికి అధికారులు ప్రతిపాదించడం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో అక్కడ గజం 15 వేలు నుంచి 17 వేలు పలుకుతోంది. ఆ లెక్కన వీరికిచ్చే భూమి విలువ దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

గుట్టుగా అప్పగింత ప్రక్రియ: అధికార పార్టీ నేతల ఒత్తిడో, భయమో కానీ.. వారి కన్నుపడిన స్థలాన్ని కట్టబెట్టడానికి అధికారులు అడ్డుగోలుగా వ్యవహరించారు. ప్రతిపాదిత స్థలం ప్రస్తుతం జీవీఎమ్​సీ పరిధిలోని గ్రామంలో ఉంది. దీనికి సర్పంచి ఉండరు. వార్డు కార్పొరేటర్‌ మాత్రమే ఉంటారు. కానీ ఈ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి ఇవ్వడానికి రాజుపాలెం పంచాయతీ సర్పంచి నుంచి తీర్మానం తీసుకున్నట్లు ప్రతిపాదనల్లో చూపారు. గ్రామంలో దండోరా వేశామని, గ్రామ సచివాలయంతో పాటు ముఖ్యమైన కూడళ్లలో A-1 నోటీసు ప్రదర్శించామని, ఆ తర్వాత 15 రోజుల్లోగా ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. వాస్తవానికి అవేవీ చేయకుండానే భూముల అప్పగింత ప్రక్రియను గుట్టుగా జరిపించారు. స్థానికులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా విలువైన భూమిని నేతల చేతిలో పెట్టేస్తున్నారు.

"గ్రామ అవసరాలు, మౌలిక వసతుల కోసం వినియోగించుకుంటున్న స్థలాన్ని.. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు కాజేయాలని చూస్తున్నారు. దీనిని గ్రామం మొత్తం వ్యతిరేకిస్తుంది". -కసిరెడ్డి సత్యనారాయణ, మాజీ సర్పంచి

జిల్లా పార్టీ కార్యాలయానికి స్థలం కావాలని వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకోగా.. స్థానిక రెవెన్యూ అధికారులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు డీఆర్​వో పి.వెంకటరమణ తెలిపారు. నిబంధనల మేరకే ప్రతిపాదనల్లో అంశాలను ప్రస్తావించామని, లీజుకు ఇస్తారా లేక మార్కెట్‌ విలువకు అప్పగిస్తారా అనేది జీవో వచ్చే వరకు తెలియదన్నారు.

వైసీపీ కార్యాలయానికి నామమాత్రపు లీజుకే 15 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.