ETV Bharat / jagte-raho

ఆర్థిక ఇబ్బందులతో తల్లీ, ఇద్దరు కుమార్తెలు బలవన్మరణం

author img

By

Published : Dec 10, 2020, 7:05 AM IST

suicide
suicide

త్వరలోనే పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం కమ్ముకుంది. ఆర్థిక ఇబ్బందులే ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. పెళ్లి నిశ్చయమై ఆనందంగా ఉంటుందనుకున్న సమయంలో విధి వారి జీవితాల్లో తీరని వేదన మిగిల్చింది. బంగారం మెరుగుపరిచే రసాయనం తాగి తల్లీ సహా ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని ఖమ్మంలో జరిగింది.

ఆర్థిక ఇబ్బందులతో తల్లీ, ఇద్దరు కుమార్తెలు బలవన్మరణం

ఇంటికి పెద్ద కుమార్తె వివాహం నిశ్చయించుకుని ఏర్పాట్లకు సిద్ధమైన ఆ కుటుంబం అర్ధాంతరంగా తనువు చాలించింది. వివాహానికి కావాల్సిన సొమ్ములేక వారు ఆత్మహత్యలే శరణ్యమని భావించారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్‌లో నివాసముండే గోపాలపురం ప్రకాష్ - గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రాధిక, చిన్న కుమార్తె రమ్య. ప్రకాష్ బంగారం మెరుగుపెట్టే పనిచేస్తున్నాడు. వచ్చే నెల 11న వారి పెద్ద కుమార్తె రాధిక వివాహం జరిపేందుకు ఇటీవల నిశ్చయించారు.

పని నిమిత్తం బుధవారం ఉదయం మహబూబాబాద్‌కు వెళ్లిన ప్రకాష్‌ రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చాడు. ఇంటి తలుపు గడిపెట్టి ఉండటంతో భార్యా కుమార్తెలను పిలిచాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో ఇంటి పక్కన ఉన్నవారికి తెలిపాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు మృతి చెంది ఉన్నారు. పెళ్లి ఖర్చులకు డబ్బులేదని... ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు భావిస్తున్నారు.

బంగారం మెరుగుపరిచే రసాయనం తాగి చనిపోయినట్లు బంధువులు, పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి : ఏలూరును వీడని కలవరం...585కు చేరిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.