ETV Bharat / international

జో బైడెన్​, జిన్​పింగ్ భేటీ.. ఆ అంశాలపై ప్రతిష్టంభన వీడేనా?

author img

By

Published : Nov 14, 2022, 3:59 PM IST

Updated : Nov 14, 2022, 4:56 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధినేత జిన్​పింగ్​ ఇండోనేషియాలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

joe biden meets xi jinping
జిన్​పింగ్​ను కలిసిన జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత జిన్​పింగ్​తో సమావేశం అవ్వడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల అధ్యక్షులు కరచాలనం చేస్తూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సమావేశానికి ఇండోనేషియా.. బాలిలోని ఓ విలాసవంతమైన హోటల్ వేదికైంది. జీ-20 సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బైడెన్, జిన్​పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ భేటీ ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుందామని జిన్​పింగ్​తో అన్నారు. ఇరుదేశాలు కలిసి ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. జిన్​పింగ్​తో నిజాయితీగా తన అభిప్రాయాలను తెలిపేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

joe biden meets xi jinping
జో బైడెన్​తో కరచాలనం చేస్తున్న జిన్​పింగ్

చైనా, అమెరికా అధ్యక్షుల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశంపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటామని తెలిపారు. చైనా-యూఎస్ మధ్య తలెత్తిన విబేధాలను పరిష్కరించుకునే బాధ్యత ఇరుదేశాలపై ఉందని పేర్కొన్నారు. పరస్పర సహకారం కోసం అనువైన మార్గాలను అన్వేషిస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. బైడెన్‌తో అన్నివిషయాలపై లోతుగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాని జిన్​పింగ్ చెప్పారు.

joe biden meets xi jinping
కరచాలనం చేసుకుంటున్న జిన్​పింగ్​, జో బైడెన్​

అంతర్జాతీయంగా సూపర్‌పవర్‌గా ఎదగాలని పోటీపడుతున్న ఇరుదేశాల మధ్య ఆర్థికంగా, భద్రతపరంగా ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. బైడెన్, జిన్‌పింగ్‌ భేటీ కీలకంగా మారింది. జీ-20 సదస్సులో భాగంగా హాజరయ్యేందుకు వచ్చిన ఇరువురు దేశాధినేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించాక చైనాతో సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఆర్థిక, వాణిజ్య, భద్రతా వ్యత్యాసాలు ఇరుదేశాల మధ్య తలెత్తాయి. తైవాన్‌కు అమెరికా మద్దతు తెలపడంపై చైనా గత కొంత కాలంగా భగ్గుమంటోంది. ఈ భేటితో ఇరుదేశాల మధ్య క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని ఇరుదేశాలు ఆశిస్తున్నాయి.

అంతకుముందు.. చైనాతో ఘర్షణ పడాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఆ దేశంతో పోటీ పడాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని, ఉద్రిక్తతలు నివారించటానికి తమవైపు నుంచి సమాచార వ్యవస్థలన్నింటినీ తెరిచే ఉంచుతామని ఆదివారం తూర్పు ఆసియా సదస్సులో మాట్లాడుతూ జో బైడెన్‌ పేర్కొన్నారు.

joe biden meets xi jinping
.

ఇవీ చదవండి: 800 కోట్లకు ప్రపంచ జనాభా.. పుడమికి మరిన్ని కష్టాలు!

'18ఏళ్లు ఎయిర్​పోర్ట్​లోనే బతికాడు.. స్పీల్​బర్గ్ సినిమాకు కథయ్యాడు.. చివరకు విమానాశ్రయంలోనే..'

Last Updated : Nov 14, 2022, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.