ETV Bharat / international

'తాలిబన్​ సర్కారు ఏర్పాటులో చైనాదే ప్రధాన పాత్ర'

author img

By

Published : Aug 21, 2021, 5:10 AM IST

అఫ్గాన్ ప్రజల మనోభావాలను అంతర్జాతీయ సమాజం గౌరవించి, తాలిబన్ ఏర్పాటుచేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని ఆ సంస్థ ప్రతినిధి సుహైల్ షహీన్ కోరాడు. అఫ్గాన్ పునర్నిర్మాణంలో చైనా ప్రధాన పాత్ర పోషించగలదని చెప్పాడు. మరోవైపు.. అఫ్గానిస్థాన్ మరోసారి ఉగ్రవాదులకు కేంద్రంగా మారకూడదని తాలిబన్లకు చైనా విస్పష్టం చేసింది.

taliban leader suhail shaheen
సుహైల్ షహీన్​, తాలిబన్​ ప్రతినిధి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ పాలనపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్న తరుణంలో ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ చైనా మీడియాతో మాట్లాడాడు. అఫ్గాన్ ప్రజల మనోభావాలను అంతర్జాతీయ సమాజం గౌరవించి, తాలిబన్ ఏర్పాటుచేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరాడు.

"చైనా భారీ ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశం అఫ్గాన్ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించగలదు. కొన్నేళ్లుగా చైనా, రష్యాలతో మాకు సంబంధాలున్నాయి. అఫ్గాన్​ నుంచి వారికి హాని ఉండదు. మా పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఎవరూ అఫ్గాన్​ భూభాగాన్ని ఉపయోగించుకోనివ్వం. ఇది మా ప్రయోజనాలకు ఎంతో కీలకమైన అంశం."

-సుహైల్ షహీన్, తాలిబన్​ సంస్థ ప్రతినిధి.

"అఫ్గాన్​ పునర్నిర్మాణ క్రతువులో అమెరికా సహా పొరుగు, ప్రాంతీయ, ప్రపంచ దేశాల సాయం మాకు అవసరం. కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ సంస్థలు నిధులను విడుదల చేయాలి. విమానం ఎక్కితే బ్రిటన్, అమెరికాల్లో స్థిరపడవచ్చన్న తప్పుడు ప్రచారం జరుగుతోంది. అందుకే కొందరు అఫ్గాన్​ను విడిచి వెళ్లేందుకు కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్నారు. తాలిబన్ విజయం... బలవంతపు పాలనపై జరిగిన ప్రజా తిరుగుబాటు ఫలితం. ఇది ఎన్నికల ద్వారా సిద్ధించింది కాకపోవచ్చు. కానీ, ప్రజలమద్దతుతోనే జరిగింది" అని షహీన్ పేర్కొన్నాడు.

మరోసారి ఉగ్రవాద కేంద్రం కాకూడదు..

మరోవైపు.. అఫ్గానిస్థాన్ మరోసారి ఉగ్రవాదులకు కేంద్రంగా మారకూడదని, విస్తృత ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లకు చైనా విస్పష్టం చేసింది. ఉగ్రవాద పంథాను విడనాడి, అన్ని జాతులతో కూడిన సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చుయింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాలిబన్ల తిరుగుబాటు క్రమంలో అఫ్గానిస్థాన్​లో 'ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్​ మెంట్​'కు చెందిన వందల మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా మారుతున్నట్టు ఐరాస ఇటీవల ఓ నివేదికలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాలిబన్ల రాజకీయ ప్రతినిధి బృందం చైనాలో పర్యటించి, తమ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రవాదుల బెడద ఉండబోదని ఆ దేశ విదేశాంగమంత్రి వాంగ్ యాకి హామీ ఇచ్చింది. అనంతరం వాంగ్ యీ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షాన్ మహమూద్ ఖురేషీకి ఫోన్ చేసి.. అఫ్గాన్​లోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: అఫ్గాన్​ ఖనిజాలపై కన్నేసిన చైనా!

ఇదీ చూడండి: ఐరాస వేదికగా పాక్- చైనాకు జైశంకర్ చురకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.