ETV Bharat / crime

AP Crime News: అనంతపురం జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

author img

By

Published : Mar 16, 2022, 3:47 PM IST

Updated : Mar 17, 2022, 2:11 AM IST

andhra pradesh crime news
కడప జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

Crime In Andhra Pradesh: రాష్ట్రం వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతిచెందారు. విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న లారీని బైకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. అనంతపురం జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. కడపలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Crime New of AP: రాష్ట్రంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో 11 మంది చనిపోయారు. అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమిదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పాఠశాల ముగిసిన అనంతరం ఈతకు వెళ్లిన ఆ పిల్లలు.. ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. నాయనిపల్లి వద్ద హెచ్‌ఎల్సీ కాల్వలోపడి మరో చిన్నారి (10) మృతిచెందాడు.

పాఠశాల బస్సు కింద పడి బాలిక మృతి

విజయనగరం జిల్లా కనిమెరకలో ప్రైవేట్​ పాఠశాల బస్సు కిందపడి ఓ బాలిక మృతిచెందింది. విద్యార్థిని మౌనిక.. జిల్లాలోని బొండపల్లి మండలంలోని కనిమెరక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది. అయితే ప్రైవేటు పాఠశాల బస్సు నుంచి తన చెల్లెలను దింపుతుండగా.. ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రం కిందపడి మౌనిక దుర్మరణం చెందింది.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైకు.. ఇద్దరు మృతి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అడ్డూరువానిపాలెంలో ప్రమాదం జరిగింది. విశాఖజిల్లా దేవరాపల్లి మండలం వంతివానిపాలెం, చింతలపూడి గ్రామాలకు చెందిన చిన్నదేముడు(40), అచ్చయ్య(35) అనే రైతులు ఆనందపురం మండలం జోడువానిపాలెంలో మంగళవారం జరిగిన గ్రామ దేవత జాతరకు బంధువుల ఇంటికెళ్లారు. రాత్రి బంధువుల ఇంటిలో ఉండి, తెల్లవారుజామున సొంతూరికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పొలం పనులకు వెళ్లాలనే తొందరలో రాంగ్​రూట్​లో వెళ్లారు. విశాఖ - అరకు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లాలో వ్యక్తి దారుణ హత్య...

కడప జిల్లా ఖలీల్​నగర్​లో రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు పేర్కొన్నారు. కడప జిల్లా ఖలీల్​నగర్​కు చెందిన శివకు అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ షేర్ ఖాన్​కు పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శివ, షేర్ ఖాన్​లు ఇద్దరు రాత్రి గొడవ పడ్డారు. షేర్​ఖాన్ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని శివపై విచక్షణా రహితంగా దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు. ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. షేర్​ఖాన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పలాస వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా పలాసలోని మొగిలిపాడు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కొంచాడ వెంకట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతిచెందాడు. లక్ష్మీనారాయణ స్కూటీ పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాటర్​ ట్యాంకర్​ను ఢీకొన్న లారీ... క్యాబిన్​లో చిక్కుకున్న డ్రైవర్​

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ సిబ్బంది రహదారి మధ్యలోని మొక్కలకు నీళ్లు పోస్తుండగా తాడేపల్లిగూడెం నుంచి రావులపాలెం వెళ్తున్న లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో సుమారు గంటకు పైగా ప్రయత్నించి డ్రైవర్ను బయటకు తీశారు. క్యాబిన్​లో ఇరుక్కుపోవడం వల్ల కాళ్లకు తీవ్రగాయాలైన అతన్ని చికిత్స నిమిత్తం తణుకులోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

మినుము పంట నూర్పిడి యంత్రం తిరగబడి..

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెం పంచాయతీ పరిధిలో కాలువ గట్టుపై మినుము పంట నూర్పిడి యంత్రం తిరగబడి డొక్కు నాగలక్ష్మి అనే కూలి మృతిచెందింది. ఈ ఘటనలో మట్టా లక్ష్మి, వల్లోల వెంకటేశ్వరమ్మ అనే ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. అవనిగడ్డ పోలీసులు గాయపడినవారిని చల్లపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని గారమ్మ కాలనీలో బుధవారం మౌనిక (24)అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రావణి, సిఐ శంకర్ రావు, ఎస్సై ప్రసాద్​లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీస్తున్నారు. మృతురాలికి నాలుగేళ్ల కిందట జిల్లాలోని టెక్కలికి చెందిన కిరణ్​ అనే వ్యక్తితో వివాహమైంది. మృతురాలికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఇటీవలే మరో పాపను ప్రసవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గంటలమ్మ గుడిలో హుండీ చోరీ
కృష్ణాజిల్లా నందిగామ శివారు అనాసాగరం శనగపాడు రోడ్డులోని గంటలమ్మ గుడిలో హుండీ చోరీకి గురైంది. దేవాలయం గేటు తాళం పగులగొట్టిన దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. ఈ దేవాలయం ఎదురుగా కల్లుపాక ఉండటం, నిత్యం 24 గంటలు కల్లు విక్రయాలు సాగుతున్నాయి. అక్కడ కల్లు తాగేందుకు వచ్చిన వారిలో ఎవరైనా ఈ చోరీకి పాల్పడి ఉంటారని దేవాలయ ధర్మకర్త కొమ్మినేని సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్లుపాక కారణంగా మహిళా భక్తులు ఆలయానికి రావడానికి కూడా భయపడుతున్నారని ఆయన తెలిపారు. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్​
చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను బుధవారం కడప జిల్లా బద్వేలు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 9 లక్షల 40 వేల రూపాయల విలువ గల గల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి, త్వరగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో వీరు దొంగతనాలు చేస్తున్నట్లు మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్ తెలిపారు. కడప జిల్లా బద్వేలు, నెల్లూరు ,తిరుపతి నగరాల్లో వీరు ఇటీవల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. పట్టుబడిన దొంగలు నెల్లూరు పట్టణానికి చెందిన సునీల్, కావలి మండలం అడవి రాజు పల్లి కి చెందిన చెందిన అజయ్ కుమార్, కావలి పట్టణానికి చెందిన పవన్ కల్యాణ్ అని మైదుకూరు డీఎస్పీ తెలిపారు.

పసికందు అదృశ్యం

విశాఖ కేజీహెచ్‌లో పసికందు అపహరణ ఘటన కలకలం రేపుతోంది. విశాఖ జిల్లా పద్మనాభ మండలం రౌతులపాలెంకు చెందిన శంకర్రావు, అప్పయ్యమ్మ దంపతులు ఈనెల 13వ తేదీన ఆడబిడ్డ పుట్టింది. బుధవారం రాత్రి ఏడున్నర సమయంలో ఆస్పత్రి సిబ్బంది పాప కోసం తల్లిని అడగ్గా..... కనిపించడంలేదని సమాధానం చెప్పడంతో కంగారపడి.... ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. ఓ మహిళ పసికందును ఆస్పత్రి నుంచి బయటకు తీసుకువెళ్తుండగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ మైథిలి స్పందించేందుకు నిరాకరించారు. పసికందును తీసుకుని వెళ్లిన మహిళ ఆటోలో నగరంలోని గురుద్వార కూడలికి తీసుకువెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అసలు పసికందును తీసుకువెళ్లిన వారు ఎవరు.. కావాలనే పసికందును ఇచ్చేశారా... అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిరుతపులి మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతి చెందింది. అమరావతి-అనంతపురం ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. దిగువమెట్ట చెక్‌ పోస్ట్‌ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు.

హిజ్రాలపై ఫిర్యాదు

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రహదారిపై డబ్బులు అడిగి ఇప్పించుకునే ఇద్దరు హిజ్రాలపై గిరిజన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే ఇవ్వనందుకు తమపై దాడి చేశారని పాణ్యం సమీపంలోని తండాకు చెందిన బాలు నాయక్, హామీబాయ్ లు పోలీసులకు తెలిపారు. అనంతరం మెడలో రెండు తులాల బంగారు గొలుసు లాక్కున్నారని... ఆశ, హనీ అనే హిజ్రాలపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికిలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకట్రావు అనే రైతు కర్నూలు జిల్లా హోసూరులో 50 ఎకరాల్లో మిర్చి,10 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. వ్యవసాయంలో నష్టాలు వచ్చి కోటి రూపాయల వరకు అప్పులపాలయ్యాడు. అవి తీర్చే మార్గం లేక స్వగ్రామం వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుడి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రొంపిచర్ల మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌ చల్లా లక్ష్మీ భర్త చల్లా శ్రీనాథరెడ్డి వేధిస్తున్నాడని..తిరుపతిలో డ్రైవర్​గా పనిచేస్తున్న మధు ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామ వాలంటీర్, పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.అస్వస్థతకు గురైన మధును పీలేరు ఆస్పత్రికి తరలించారు.

వ్యాపారి దారుణ హత్య

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆర్య వైశ్య వర్గానికి చెందిన ఆదినారాయణ అనే వ్యాపారిని గోశాలకు సమీపం లో గుర్తు తెలియని వ్యక్తులు కారం చల్లి.. దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యలు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పట్టణంలోని ప్రధాన రహదారి మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. హత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: నాటుసారా మరణాలపై నిలదీస్తే.. సభ నుంచి సస్పెండ్ చేశారు -తెదేపా

Last Updated :Mar 17, 2022, 2:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.