ETV Bharat / crime

Today Crime: గుత్తి మండలంలోని రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి ఆత్మహత్య...

author img

By

Published : Mar 27, 2022, 2:15 PM IST

Updated : Mar 27, 2022, 8:38 PM IST

Today Crime news
గుత్తి మండలంలోని రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి ఆత్మహత్య

Today Crime: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. గుత్తి మండలంలోని రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, కృష్ణాజిల్లా అల్లూరులో మహిళపై హత్యాయత్నం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో బైక్‌పై వెళ్తుండగా కొబ్బరిచెట్టు మీదపడి వ్యక్తి మృతి చెందాడు.

Today Crime: అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామం సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద నాగరాజు అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళపై హత్యాయత్నం: కృష్ణాజిల్లా వీరులపాడు మండలం అల్లూరులో మహిళపై హత్యాయత్నం జరిగింది. అల్లూరు గ్రామానికి చెందిన వివాహితపై యర్రంశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు. వీరులపాడు పోలీస్​స్టేషన్​కు గ్రామస్థులు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో పూరిల్లు దగ్ధం: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. ఇంట్లో ఉన్న ఆస్తి పత్రాలు, నాలుగు సవర్ల బంగారం, రూ. 10 వేల నగదు అగ్నికి ఆహుతైనట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

వలస కూలీల ట్రాక్టర్ బోల్తా...ఇద్దరి పరిస్థితి విషమం: అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పలు గ్రామాలలో సెబ్ ఏఎస్పీ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 2500 లీటర్ల బెల్లంఊట, 60 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశామని సెబ్ ఏఎస్పీ తెలిపారు.

గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం: గుంటూరు జిల్లా బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెం వెళ్లే రోడ్డు మార్గంలోని పొలంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమయింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యా? ఆత్మహత్యా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి: ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి కలవకూరు వెళ్లే రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బల్లికురవ గ్రామానికి చెందిన పావులూరి వీరాంజనేయులు గా పోలీసులు గుర్తించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

దళారి చేతిలో మోసపోయిన రైతు: ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలో రైతును ఓ దళారి మోసం చేశాడు. 3 కోట్ల రూపాయలకు పైగా మిర్చి పంట కొనుగోలు చేసిన అతను రైతుకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. దీనిపై ఆ రైతు పోలీసుల ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల జోక్యంతో దళారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులను మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

విద్యార్థినిపై యువకుడి దౌర్జన్యం.. పోక్సో కేసు నమోదు: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ఒక ఉన్నతపాఠశాలలోకి మెల్లం అజయ్ అనే యువకుడు దౌర్జన్యంగా వచ్చి ఒక విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విద్యార్థిని చేయిపట్టుకుని బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఆ యువకుడిని ఉపాధ్యాయులు, విద్యార్థులు నిలువరించే ప్రయత్నంచేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై పోక్సో చట్టంకింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జి.సురేంద్ర వెల్లడించారు.

సీలేరు నదిలో పడవ బోల్తా ..ఇద్దరు గల్లంతు: విశాఖ- తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దున గల సీలేరు నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయ్నం: గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగ‌ల‌కుదురులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నాగలక్ష్మీ అనే వివాహిత అనారోగ్యం కారణంగా ఇద్దరు పిల్లలకు పురుగుమందు తాగించి తానూ తాగింది. ఇది గమనించిన స్థానికులు ముగ్గురిని తెనాలి ప్రభుత్వాస్పత్రికి త‌ర‌లించారు. కుమారుడు సాయికృష్ణ (9), కుమార్తె ఊహ‌శ్రీ‌ (11) క్షేమంగా ఉన్నారు. తల్లి ఆరోగ్యం విషమించడంతో గుంటూరు ఆస్పత్రికి తరలించారు.

బైక్‌పై వెళ్తుండగా కొబ్బరిచెట్టు మీదపడి వ్యక్తి మృతి: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు వద్ద చెట్టు కూలి ఒకరు మృతి చెందారు. కుమారుడి పెళ్లి శుభలేఖలు పంచేందుకు బైక్‌పై వెళ్తుండగా కొబ్బరిచెట్టు మీదపడి వెంకటేశ్వరరావు (53) మరణించాడు. మృతుడిని కాళ్ల మండలం కొపల్లి వాసి వెంకటేశ్వరరావుగా సమాచారం.

చిత్తూరు జిల్లాలో మరో ప్రమాదం.. నిశ్చితార్థానికి వెళ్తుండగా..: చిత్తూరు జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. నిశ్చితార్థానికి వెళ్తుండగా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ట్రాక్టర్‌ ఢీకొని మినీ వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐతేపల్లికి చెందిన 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి బాధితుల తరలించారు.

బైక్​ను ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి: విశాఖ జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన సేనాపతి రమేష్, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుపూరు గ్రామానికి చెందిన కల్లేపల్లి మహేష్ గా గుర్తించారు.

ఆటో బోల్తా పడి.. వ్యక్తి మృతి: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో ఆటో బోల్తా పడి.. ఓ వ్యక్తి మృతి చెందాడు . భట్టిప్రోలు నుంచి నిడుబ్రోలు వెళ్తున్న ఆటో కనగాల గ్రామం వద్దకు రాగానే మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతులమీదుగా జ్ఞాపిక అందుకున్న చిలకమర్తి

Last Updated :Mar 27, 2022, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.