ETV Bharat / crime

నాన్నా రండి... నన్ను బయటకు తీయండి...!

author img

By

Published : Mar 28, 2021, 8:21 PM IST

నాన్నా రండి... నన్ను బయటకు తీయండి...!
నాన్నా రండి... నన్ను బయటకు తీయండి...!

‘‘నాన్నా త్వరగా రండి...నన్ను బయటకు తీయండి... నాన్నా’’ అంటూ... ఆ యువతి బస్సు చక్రాల కింద విలపించడం...అక్కడ ఉన్న వారి మనసులను తీవ్రంగా కలిచివేసింది. విశాఖపట్నం ఎన్‌ఏడీ కూడలి దరి కాకాని నగర్‌ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి.

గాజువాక భవానీ నగర్‌ ప్రాంతానికి చెంది సమ్మిడి వెంకట్రావు తన కుమార్తె గీతా కుమారి (21) బీఈడీ చదువుతోంది. ఎంవీపీ కాలనీలోని కళాశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా కాకానినగర్‌ వంతెన ఎక్కే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో.. వెంకట్రావు రోడ్డు అంచు వైపునకు పడగా, గీతాకుమారి బస్సు వెనక చక్రాల కింద పడిపోయింది. బస్సు వేగం నియంత్రణ కాకపోవడంతో ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో నడుం భాగం బాగా దెబ్బతింది.

ఆ సమయంలో తనకు ఏం జరిగిందో తెలియని గీతాకుమారి ‘‘నాన్నా రండి... నన్ను బయటకు తీయండి నాన్నా’’ అంటూ విలపించింది. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను నగరంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్న అక్కడి వైద్యుల సూచనతో కేజీహెచ్‌కు తీసుకువెళ్లగా... చికిత్స అందిస్తున్న సమయంలో మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకట్రావుకు గాయాలయ్యాయి. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: బైక్​ను ఢీకొట్టిన ట్రాలీ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.