ETV Bharat / city

ఛిద్రమవుతున్న మత్స్యకారుల బతుకులు.. ఆదుకోవాలని వేడుకోలు

author img

By

Published : Nov 25, 2020, 12:44 PM IST

మత్స్యకారులు నానా కష్టాలు పడుతున్నారు. ఏదో పగ పట్టినట్టుగా ఒకదాని తరవాత ఒకటి ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. ఒక వైపు ప్రకృతి, మరో వైపు కరోనా కలిసి గంగపుత్రుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఐదేళ్ల నుంచి సరైన ఆదాయం లేక సముద్రం కేసి చూస్తూ వెక్కివెక్కి ఏడ్చేలా చేస్తున్నాయి పరిస్థితులు. ఈ సమయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో మత్స్యకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. విశాఖలో గంగపుత్రుల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

fishermen life
ఛిద్రమవుతున్న మత్స్యకారుల బతుకులు.. ఆదుకోవాలని వేడుకోలు

విశాఖ జిల్లాలో అధికారికంగా లక్షా 50 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. విశాఖ, భీమిలి, యారాడ, రేవుపోలవరం, పూడిమడక, రాంబిల్లి ప్రాంతాలలో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విశాఖ తీర ప్రాంతంలో వరుసగా వచ్చిన పరిశ్రమల వల్ల గతంలో కంటే మత్స్య సంపద తగ్గిపోయింది. ఇది వరకు తీరం నుంచి 3 కిలోమీటర్లు ముందుకు వెళితే మంచి చేపలు దొరికేవి. అందుకు తగిన ధర వచ్చి జీవితం ఆనందంగా సాగేది. అయితే ఐదేళ్ల నుంచి చేపల సంపద తగ్గిపోయింది. సముద్రంలో ముందుకు వెళ్లే దూరం పెరుగుతోంది కానీ మంచి చేపలు దొరకడంలేదని మత్స్యకారులు అంటున్నారు.

ఖర్చు ఎక్కువ.. రాబడి తక్కువ

వేటకు వెళ్ళాలంటే 4 వలలు, బోటు ఉంటే సరిపోదు. డీజిల్, పడవలో ఉండే సిబ్బందికి జీతాలు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. డీజిల్ ధర పెరిగింది. ప్రభుత్వం ఇచ్చే రాయితీకి, ఖర్చుకు పొంతన ఉండటంలేదని యజమానులు అంటున్నారు. పోనీ కష్టపడి వేటకు వెళ్లి తెచ్చిన చేపకు సరైన ధర ఉంటుందా అంటే అదీలేదు. ఈ కష్టాలు చాలవనుకంటే కరోనా రూపంలో మరో పెను ముప్పు గంగపుత్రుల జీవితాలను కకావికలం చేసింది. చేపల వేటకు నిషేధం విధించారు. ఇక నిషేధం ఎత్తేసిన తర్వాతా పరిస్థితి మారలేదు. ప్రభుత్వం ఇస్తానన్న రాయితీ సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార యువకులకు తరాలుగా చేపలు పట్టడమే వృత్తిగా వస్తోంది. వారు చదువుపై దృష్టి పెట్టరు. కరోనా కారణంగా పనిలేక ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ పొట్టపోసుకుంటున్నామని వారు వాపోతున్నారు.

అటు ప్రకృతి కోపం.. ఇటు కరోనా శాపం

ఈ సంవత్సరం దాదాపు ప్రతి నెలలోనూ ప్రకృతి విపత్తులు మత్స్యకారులను ఇబ్బంది పెట్టాయి. వాయుగుండాల కారణంగా చేపల వేటపై నిషేదాజ్ఞలు కొనసాగాయి. తుపాను హెచ్చరిక ఇచ్చిన ప్రతిసారి 10 రోజులు పాటు వేటకు వెళ్లకూడదు. ఆ సమయంలో ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా 50 కేజీల బియ్యం ఇస్తుంది. ఈసారి చేపల వేట నిషేధ సమయంలో ఆ బియ్యం సగమే అందాయంటున్నారు మత్స్యకార కుటుంబాలు. జూన్ నెల నుంచి వేటకు వెళ్లడానికి అనుమతి లేక సరైన ఆదాయం రాక ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. అటు ప్రకృతి వైపరీత్యాలు, ఇటు కరోనా పంజా రెండూ కలిసి ఈ ఏడాది మత్స్యకారులను సుడిగుండంలోకి నెట్టేశాయి.

తీరం వద్దే మత్స్యకారుల ఇళ్లు ఉంటాయి. సముద్ర గాలికి ఆ ఇల్లు దెబ్బతింటున్నాయి. ఈ ఏడాది ఆస్తి పన్ను, ఇంటి పన్ను కట్టే పరిస్థితి లేక బాధపడుతున్నారు. పిల్లలకు కనీసం విద్యా రుసుములు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా అందలేదని మత్య్సకారులు అంటున్నారు. మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ఈ అమ్మాయిలను చూస్తే.. కంటే కూతుర్నే కనాలి.. అనిపిస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.