ETV Bharat / city

రెండు ఇళ్లున్న వీధిలో సిమెంటు రహదారి...అధికారుల తీరుపై ఆశ్చర్యం

author img

By

Published : Dec 4, 2020, 2:54 PM IST

రోడ్లు లేనిచోట నిర్మిస్తే అక్కడి జనం సంతోషిస్తారు. తమ ప్రాంతంలో మట్టి రోడ్లతో నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎందరో జీవీఎంసీ అధికారులకు విన్నవిస్తున్నారు! వాటిని పరిశీలించి వందల మందికి ఉపయోగపడేలా నిర్మిస్తే వారంతా ఎంతగానో హర్షిస్తారు. అందుకు విరుద్ధంగా...రెండే ఇళ్లున్న వీధిలో రోడ్డు వేస్తుంటే అది అభివృద్ధి అనొచ్చా...కొందరికే మేలనవచ్చా..అనే చర్చ సాగుతోంది.

gvmc-officials-constructing-a-cement-road-on-a-two-house-street-in-visakhapatnam
రెండు ఇళ్లున్న వీధిలో సిమెంటు రహదారి

ఆయనో కీలక రాజకీయ నేత. తనకు సన్నిహితంగా ఉన్న వారి కోసం ఏకంగా ఓ రోడ్డే వేయిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అది కూడా ప్రజాధనంతో. ప్రతిపాదన రాగానే తక్షణం జీవీఎంసీ(విశాఖ నగరపాలక సంస్థ) రోడ్డు మంజూరు చేసింది. పనుల్ని వేగంగా చేస్తోంది. 'నెలల తరబడి కార్యాలయల చుట్టూ తిరిగినా మా వీధికి రోడ్డు, కాలువలు రాలేదు.. ఇళ్లేవీ లేకున్నా ఆ వీధిలో ఇంత హడావుడిగా రోడ్డేస్తున్నారేమిటీ' అని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రోడ్డెక్కడో తెలుసా.. విశాఖలోని సాగర్‌నగర్‌ ఇస్కాన్‌ ఆలయం సమీపంలో..!

తీరానికి అభిముఖంగా, ఇస్కాన్‌ ఆలయ సమీపంలో చాలావరకు ఖాళీ స్థలాలున్నాయి. తాజాగా జీవీఎంసీ వేస్తున్న రోడ్డున్న వీధిలో కేవలం రెండే ఇళ్లున్నాయి. శివారు ప్రాంతాల్లో ఏకంగా కాలనీలు వెలసినచోట కూడా ఇప్పటికీ మౌలిక వసతులు లేవు. కానీ రెండే ఇళ్లున్న ఈ వీధిలో మాత్రం ఏకంగా సీసీ రోడ్డు, కాలువలు వేస్తున్నారు. ఇందుకోసం జీవీఎంసీ రూ.43లక్షలపైనే నిధులు వెచ్చిస్తోంది. నెలరోజులుగా పనులు చురుగ్గా జరుగుతుండటంతో 250మీటర్ల మేర ఈ రోడ్డు పనులు పూర్తయ్యాయి. వీధి మరింత పొడవుగా ఉన్నా.. పూర్తిగా వేయకుండా మధ్యలోనే వదిలేశారు. ఈ రోడ్డుకు అనుబంధంగా బీచ్‌రోడ్డులో తాజాగా కల్వర్టునూ కడుతున్నారు. మరికొన్నాళ్లలో ఈ రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తుంది.

రెండేసి టెండర్లు..

ఆ ప్రజాప్రతినిధి అడగ్గానే జీవీఎంసీ అధికారులు, ఇంజినీర్లు కూడా అనుకూలంగా స్పందించినట్లు స్పష్టమవుతోంది. రోడ్డు, కాలువల పనుల్ని ఒకే టెండరుగా పిలవకుండా రెండు వేర్వేరు టెండర్లుగా పిలిచారు. ఒకటి జూన్‌లో, మరొకటి జులైలో టెండర్లను ఆహ్వానించినట్లు స్పష్టత ఇస్తున్నారు. జీవీఎంసీ ఈ బాటకు రూ.46లక్షలు ప్రతిపాదించగా.. ఓ గుత్తేదారు రూ.43లక్షలకు దక్కించుకున్నారు.

'మాకు తప్పడంలేదు'

సాగర్‌నగర్‌లో వేస్తున్న రోడ్డు విషయమై ఇప్పటికే కొంతమంది జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. తాము ఎన్నోనెలల నుంచి అడిగినా ప్రతిపాదన దగ్గరే ఆగిపోతోందని, నిధులు కేటాయించడం లేదని ఏకంగా జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికీ తీసుకెళ్లారు. ప్రస్తుతం నిధుల్లేవని, గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావట్లేదనే పలు కారణాల్ని అధికారులు వెల్లడించినట్లు బాధితులు తెలిపారు. అయితే ప్రజాప్రతినిధి కోసం వేస్తున్న రోడ్డు విషయమై జీవీఎంసీలో ఓ కీలక అధికారిని సంప్రదించినప్పుడు.. ‘ఇలాంటి వాటితో పాటు...వసతుల్లేని ఇతర ప్రాంతాల మీదా దృష్టి పెడుతున్నామని' తెలిపారు.

ఇదీ చదవండి:

రెండున్నరేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.