ETV Bharat / city

జీవీఎంసీకి ఆర్థిక కష్టాలు.. ఆదాయ వనరులపై నిర్లక్ష్యమే కారణమా..?

author img

By

Published : May 4, 2021, 7:09 PM IST

మహా విశాఖ నగరపాలక సంస్థ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రతి నెల సాధారణ ఖర్చులకే నిధుల్లేక అధికారులు సతమతమవ్వాల్సి వస్తోంది. తెదేపా హయాంలో 010 పద్దు కింద జీవీఎంసీ ఉద్యోగులకు వేతనాలిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కాస్త ఊరట లభించింది. లేకపోతే జీవీఎంసీ రెండు, మూడు నెలలకోసారి వేతనాలివ్వాల్సి వచ్చేది. ఆదాయ వనరులపై నిర్లక్ష్యమే ఆర్థిక ఇబ్బందులకు కారణమని విమర్శలు వస్తున్నాయి.

జీవీఎంసీ
జీవీఎంసీకి ఆర్థిక కష్టాలు

జీవీఎంసీకి ఆస్తి పన్ను రూపంలో రూ.320 కోట్లు ఆదాయం సమకూరుతోంది. నీటి సరఫరా ద్వారా మరో రూ.180 కోట్లు వస్తున్నా.. రూ.160 కోట్ల మేర వ్యయం చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రణాళిక నుంచి రూ.80 కోట్లు వస్తోంది. మొత్తం రూ.420 కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులోనే సాధారణ ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సి ఉంది. ఏటా 10 శాతం రాబడి పెరుగుతుందని అధికారుల అంచనా. అయినా ఈ నిధులతో నెట్టుకురావడం అధికారులకు కత్తిమీద సాముగా మారింది.

ఇదీ ప్రస్తుత పరిస్థితికి కారణం..

* గత రెండేళ్లుగా జీవీఎంసీ ఆర్థిక విభాగం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెబుతున్నారు. అమృత్‌ సంయుక్త సంచాలకునిగా విధులు నిర్వహించే అధికారికి ఆర్నెళ్లపాటు ఆర్థిక విభాగాన్ని అప్పగించారు. తరువాత ఐఏఎస్‌ అధికారి అదనపు కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా ఆ బాధ్యతలు నిర్వహించారు. కొద్ది రోజుల్లోనే ఆమె సెలవుపై వెళ్లిపోయారు. అనంతరం అదనపు కమిషనర్‌ ఆశాజ్యోతి వచ్చారు. ఆమె బాధ్యతలు తీసుకున్న తరువాత ఎన్నికలు రావడం, కొవిడ్‌ ఇబ్బందులు వెంటాడటంతో ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.

* గతంలో ఆర్థిక విభాగ బాధ్యులు నిత్యం కమిషనర్‌తో మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు వివరించేవారు. ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 010 పద్దుతో సమయానికి వేతనాలు వస్తుండటంతో జీవీఎంసీ ఆదాయం పెంచుకోవడంపై ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

వీటిపై దృష్టి పెట్టాలి..

* కోర్టులో కేసు ఉండటంతో స్టీల్‌ప్లాంట్‌ 50 శాతం మాత్రమే జీవీఎంసీకి పన్ను చెల్లిస్తోంది. ఆస్తిపన్ను కేసులపై జీవీఎంసీ అధికారులు సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

* డీఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్సుల ద్వారా రూ. 15 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. దీనిపై మరింత దృష్టి పెడితే రూ.45 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి.

* జీవీఎంసీకి చెందిన వాణిజ్య సముదాయాలు, కల్యాణ మండపాల నుంచి రావాల్సిన రూ.30 కోట్లపైగా బకాయిలను తక్షణం రాబట్టుకోవాలి.

* ప్రస్తుతం ఖాళీ స్థలాల నుంచి వస్తున్న పన్ను ఆదాయం రూ. 35 కోట్లు. రూ.75 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నా పట్టించుకోవడం లేదు.

* విలీనమైన పది పంచాయతీలలో ఖాళీ స్థలాల పన్ను విధిస్తే మరో రూ. 60 కోట్ల వరకు రాబడి వచ్చే అవకాశాలున్నాయి.

* అమృత్‌ ద్వారా 80 వేల కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి జీవీఎంసీ సిద్ధమైంది. ఇప్పటికి 50 వేల కనెక్షన్లు ఇచ్చినా.. పైసా కూడా ఆదాయం ఎందుకు పెరగడం లేదో గుర్తించాలి.. 77 సెమీబల్క్‌ కనెక్షన్ల నీటి వినియోగాన్ని గణించే ఏజెన్సీ ఇస్తున్న లెక్కలపై తరచూ తనిఖీ చేయాలి.

* కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఆస్తి పన్ను చెల్లించకపోయినా, సర్వీసు రుసుములు చెల్లించాలని కోర్టు తీర్చు ఇచ్చింది. దీన్ని పక్కాగా అమలు చేస్తే.. మరికొన్ని నిధులు సమకూరే అవకాశం ఉంది.

* నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలపై పన్ను విధించకుండా కొత్తగా ఆస్తిపన్ను అసెస్‌మెంట్లు ఎలా ఇస్తున్నారనే అంశంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌కే అధికభాగం..


జీవీఎంసీకి చెందిన టీఎస్సార్‌ వాణిజ్య సముదాయం

* మహా విశాఖ నగరపాలక సంస్థపై స్వచ్ఛ సర్వేక్షణ్‌ భారం ఎక్కువైంది. ఇళ్ల నుంచి చెత్త సేకరించడానికి వాహనాలు, తడి-పొడి చెత్తను వేరు చేయడానికి ప్రత్యేకంగా కార్మికులు, ఏటా కరపత్రాలు, హోర్డింగ్‌లతో ప్రచారాలు.. ఇలా గత ఐదేళ్ల కాలంలో రూ.1000 కోట్లు ఖర్చు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.

* నగరాల మధ్య స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. పైసా కూడా విదల్చకపోయినా అధికారులు వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్నారు.

* మరోపక్క 5230 మంది కార్మికుల వేతనాలు పెంచడం, 400 వాహనాల్లో చెత్త సేకరణకు మరో 900 మంది కార్మికులను నియమించడంతో డబ్బులన్నీ సర్వేక్షణ్‌కే వెచ్చించాల్సి వస్తోంది.

ఇవీ చదవండి:

కరోనా పంజా: తాత్కాలిక శ్మశానాలు ఏర్పాటు చేస్తారా?

జీవీఎంసీ కమిషనర్​ నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.