ETV Bharat / city

నేరస్తుల చేతిలోకి ప్రశాంత విశాఖ నగరం: చంద్రబాబు

author img

By

Published : Mar 7, 2021, 5:40 AM IST

Updated : Mar 7, 2021, 7:27 AM IST

babu
babu

ముఖ్యమంత్రి జగన్.. ప్రశాంత విశాఖను నేరస్తుల నగరంగా మారుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్‌ కోసం జరిగిన త్యాగాలకు గౌరవం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. చంద్రబాబు రోడ్ షో

‘నేర చరిత్ర ఉన్న వారినే జగన్‌ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. బిడ్డింగ్‌ పెట్టి మరీ సీట్లు అమ్ముకున్నారు. వారితో భయపెట్టిస్తున్నారు. ప్రశాంత విశాఖను నేరస్తుల నగరంగా మారుస్తున్నారు. ఓటు వేయకపోతే రేషన్‌, పింఛను ఇవ్వబోమని ప్రజల్ని భయపెడుతున్నారు. ఇలా చేస్తే కోర్టుకెళ్లయినా ప్రజలకు రేషన్‌, పింఛను ఇప్పించే బాధ్యత నాది. ఒక వేళ కోర్టులో తీర్పు ఆలస్యమైతే.... రెండేళ్లలో తెదేపా ప్రభుత్వం వస్తుంది. అన్నీ వడ్డీతో సహా ఇప్పిస్తాం. అంతేగానీ వీరికి భయపడొద్దు. వైకాపాకు ఓటేస్తే రౌడీయిజానికి లైసెన్స్‌ ఇచ్చినట్లే...’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా కొత్త రాజకీయాలకు తెరతీసిందని చెబుతూ.. ‘పోలింగ్‌ బూత్‌లలోకి ఫోన్‌ ఇచ్చి పంపిస్తారట. ఓటేశాక బ్యాలెట్‌ పేపర్‌ ఫొటో తీసి చూపిస్తే రూ.5 వేలు, రూ.10వేలు ఇస్తారంట. ఇలాంటి వాటికి లొంగిపోవడం కన్నా.. వీరోచితంగా పోరాడటం గొప్ప’ అని వ్యాఖ్యానించారు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.

గాజువాక, విశాఖ పశ్చిమ, విశాఖ దక్షిణ, విశాఖ ఉత్తర, తూర్పు, భీమిలి నియోజకవర్గాల పరిధిలో రోడ్డుషోలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఏ 2కి విశాఖలో ఏం పని? ఎందుకిక్కడ కాపురం పెట్టావు? ఒక ఎంపీవి... నువ్వు ఎయిర్‌పోర్టుకొస్తే.. అధికారులంతా వెళ్లి చేతులు కట్టుకొని నిలబడాలా..?’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎప్పుడూ విశాఖలో పెత్తనం చేయలేదని, ఏ2ను జనాలు వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. పులివెందుల పంచాయతీ, రాజారెడ్డి రాజ్యాంగాన్ని విశాఖలో తేవాలనుకుంటున్నారని, ప్రజలు రోషం తెచ్చుకుని తిరస్కరించాలని కోరారు. విశాఖ మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించాక ఆయనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కోర్టుల సెలవు దినాల్ని చూసుకుని శని, ఆదివారాల్లో యంత్రాలతో తెదేపా నేతల కట్టడాల్ని కూలుస్తున్నారని, ఇది రాజకీయమా అని చంద్రబాబు ప్రశ్నించారు. పురపాలిక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే మళ్లీ ‘అన్న క్యాంటీన్లు’ తెరుచుకుంటాయని ప్రకటించారు. తెదేపా మేయర్‌ పీఠాన్ని అధిష్ఠించగానే ‘తొలి తీర్మానంగా ఇంటి పన్ను, చెత్త పన్ను.. ఇలా అన్నీ తగ్గిస్తాం. ప్రజలపై భారం పడకుండా చేస్తా. స్వయంగా నేనే పర్యవేక్షిస్తా’ అని వెల్లడించారు.

ఏ1, ఏ2 కలిసి ‘ఏబీసీడీ పాలసీ’ తెచ్చారు

ప్రస్తుత ప్రభుత్వంలో నేరచరిత ఉన్న వ్యక్తుల నేరాలు ఘోరాలు చూస్తుంటే... రాత్రిళ్లు నిద్ర రావడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఇది మంచి పద్ధతా? అవుతుందా అసలు..? ప్రాంతాల మధ్య విద్వేషాల్ని రెచ్చగొడుతున్న ముఖ్యమంత్రిని ఛీ కొట్టాలి. ఇప్పుడు ఏ1, ఏ2 కలిసి ‘ఏబీసీడీ పాలసీ’ తెచ్చారు. ఎటాక్‌ (దాడులు), బర్డెన్‌ (బాదుడు), కరప్షన్‌ (అవినీతి), డిస్ట్రక్షన్‌ (విధ్వంసం) పనిగా పెట్టుకున్నారు’ అని ధ్వజమెత్తారు.

జగన్‌ దొంగ పాదయాత్ర చేసి.. భూములెక్కడున్నాయ్‌, పరిశ్రమలెక్కడున్నాయ్‌, డబ్బులెక్కడొస్తాయ్‌... అని సర్వే చేశారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో ప్రధాని వాజ్‌పేయీతో మాట్లాడి తాను స్టీల్‌ప్లాంట్‌కు నిధులిప్పించి లాభాల్లోకి తెచ్చానని, ఇప్పుడు జగన్‌ వచ్చి 7వేల ఎకరాల్ని అమ్మేస్తామంటున్నారని మండిపడ్డారు. ‘ఆస్తులమ్మితే అడుక్కుతినాలా? విశాఖ వచ్చినప్పుడు స్టీల్‌ప్లాంటుకు రాకుండా దొంగస్వామి దగ్గరికెళ్లారు. రామతీర్థంలో రాముడి తలతీసేస్తే ఆ దొంగస్వామికి కనపడలేదా? స్టీల్‌ప్లాంట్‌ విషయంలో జగన్‌ నాటకాలాడుతున్నారు’ అని విమర్శించారు.

ఏప్రిల్‌ ఒకటి నుంచి ఫూల్స్‌ చేయబోతున్నారు

‘ఖాళీ స్థలాలు, తాగునీరు, మార్కెట్‌ విలువ ప్రకారం ఇంటి పన్నులు పెంచి రాష్ట్రంలో ప్రజలందర్నీ ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రభుత్వం ఫూల్స్‌ చేయనుంది. ప్రజలందరి మీద మరింత భారం మోపనుంది. ఈ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే ప్రజల మీద అదనపు పన్నులు వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మీద రూ.2.50 లక్షల అప్పు ఉంది. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల అప్పు ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఒక్క ఏపీలోనే ఉంటాయి. ప్రెసిడెంట్‌, బూబ్‌బూమ్‌, స్పెషల్‌ స్టేటస్‌ పేర్లతో నాణ్యత తక్కువ, ధర ఎక్కువ ఉండే మద్యంతో ప్రజల ఆరోగ్యం పాడవుతోంది. ఈ మద్యం తయారీదారు, పంపిణీదారు జగనే. వీటి మీద వచ్చే ఆదాయం ‘జే ట్యాక్స్‌’ రూపంలో ముఖ్యమంత్రికే వెళ్తుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మూడు రాజధానులు ఆమోదమేనా?

అమరావతిని రాజధానిగా ఉంచడం మీకు ఇష్టమే కదా’ అని ఇష్టమైన వారు చేతులు పైకెత్తాలని చంద్రబాబు చెప్పడంతో అందరూ చేతులు పైకెత్తి మద్దతు తెలిపారు. రోడ్‌షోలో భాగంగా పలు ప్రాంతాల్లో ఇలా ప్రజల స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. విశాఖ ప్రజలకు మూడు రాజధానుల ముచ్చట ఆమోదమేనా.. అని ప్రశ్నించడంతో... కాదంటూ పలువురు నినాదాలు చేశారు. గాజువాకలో 72వ వార్డులో సీపీఐకి, 78వ వార్డులో సీపీఎంకు మద్దతిస్తున్నామని ప్రకటించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, గంటా శ్రీనివాసరావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ ఎన్నికలు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలవాలి: చంద్రబాబు

Last Updated :Mar 7, 2021, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.