ETV Bharat / city

TS Rain News: ప్రాజెక్టుల్లోకి పోటెత్తిన వరద.. నిండుకుండల్లా జలాశయాలు

author img

By

Published : Jul 10, 2022, 8:32 PM IST

Water Levels in Projects: ఎడతెరిపిలేని వానలతో తెలంగాణలోని ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. గోదావరి జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహం పరుగులు తీస్తోంది. శ్రీరాంసాగర్‌కు భారీగా వరద కొనసాగుతోంది. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో... గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. రానున్న ఐదారురోజులు గోదావరికి భారీగా వరద రానుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రాజెక్టుల్లోకి పోటెత్తిన వరద
ప్రాజెక్టుల్లోకి పోటెత్తిన వరద

ప్రాజెక్టుల్లోకి పోటెత్తిన వరద

Water Levels in Projects: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని గోదావరికి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. జోరు వానలకు నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. సాయంత్రం వరకు 4 లక్షల 92 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 72.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులకుగాను.. ప్రస్తుతం 1086.7 అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో అధికారులు 9 గేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 20 గేట్లు ఎత్తి లక్షకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. కడెం నారాయణ రెడ్డి జలాశయం నిండుకుండలా మారింది. భారీగా వరద ప్రవాహంతో 9 గేట్లు ఎత్తారు. కడెం పూర్తిస్థాయి నీటిమట్టం 7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీలకు పైగా నిల్వ ఉంది.

గోదావరితో పాటు ప్రాణహిత ప్రవాహ ఉద్ధృతితో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు వరద పోటెత్తుతోంది. లక్ష్మీ-మేడిగడ్డ బ్యారేజీకి దాదాపుగా 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 57 గేట్లు ఎత్తి 4 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. పార్వతి, సరస్వతి బ్యారేజీలకు కూడా ఎగువ నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. రానున్న అయిదారు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అన్ని జలాశయాల్లో కళకళ: చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 10 వేల 300 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. మూడు గేట్లు ఎత్తి 13 వేల 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవటంతో రెండు గేట్లు ఎత్తి వెయ్యి 96 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 458 మీటర్లకుగాను.. ప్రస్తుతం 457.60 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 13 వందల 92 అడుగులు, నిల్వ సామర్థ్యం 5.474 టీఎంసీలుగా ఉంది. నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు అలుగు పారుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6వేల 690క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. అంతే మొత్తంలో దిగువకు వెళ్లిపోతోంది. 14వందల 64 అడుగుల పూర్తి నీటి మట్టంతో 1.8 టీఎంసీల పూర్తి నీటి నిల్వతో ప్రాజెక్టు ఉంది.

ఉగ్రరూపం దాల్చిన గోదావరి: భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వరద పోటెత్తుతోంది. 16 గేట్లను ఎత్తి దిగువకు 17 వేల 460 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఫలితంగా సీతమ్మసాగర్‌ నిర్మాణ ప్రదేశం నీటి మునిగింది. దీంతో భారీ యంత్రాలు, ఇతర సామగ్రని అధికారులు ఒడ్డుకు చేర్చారు. భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 25 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 36.5 అడుగులకు చేరింది. రాత్రి కల్లా 43 అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం పోటెత్తుతుంది. లక్ష్మీ బ్యారేజీకి 6 లక్షల 29 వేల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తుంది. 65 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతీ బ్యారెజీ ఇన్ ఫ్లో 2 లక్షల 3 వేల 500 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 2 లక్షల 25 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తోక్కుతున్నాయి. ఉభయ నదులు ఉద్ధృతంగా ఉప్పొంగుతున్నాయి.

జంట జ‌లాశయాల నుంచి నీటి విడుదల: భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో హైదరాబాద్​ న‌గ‌రంలోని జంట జ‌లాశయాలైన ఉస్మాన్‌సాగ‌ర్‌(గండిపేట‌), హిమాయ‌త్ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ల‌కు వ‌ర‌ద నీరు ఇన్‌ఫ్లో క్ర‌మంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌ల‌మండ‌లి సాయంత్రం 6 గంట‌ల‌కు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్‌సాగ‌ర్ రెండుగేట్ల‌ను ఒక ఫీటు పైకి ఎత్తి నీటిని దిగువ‌న మూసీ నదిలోకి వదిలింది. హిమాయత్‌సాగ‌ర్ రెండు గేట్ల ద్వారా 686 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగ‌ర్ రెండు గేట్ల ద్వారా 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు.

ఉస్మాన్ సాగ‌ర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,785.80 అడుగులు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1,760.30 అడుగుల వద్దకు వరదనీరు చేరింది. జలాశయాల‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందున.. అధికారులు, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలని జ‌ల‌మండ‌లి ఎండీ దాన కిషోర్ ఆదేశించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.