స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ రమేష్కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్దాస్ పరస్పర లేఖలు రాసుకున్నారు. ఎన్నికలు నిర్వహణ విషయమై..ఎస్ఈసీతో రాష్ట్రప్రభుత్వం చర్చించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ సహా ఉన్నతాధికారుల బృందం నిమ్మగడ్డ రమేశ్కుమార్తో సమావేశమైన సంగతి తెలిసిందే.
- ఎస్ఈసీ లేఖలోని అంశాలు..
"స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ అభిప్రాయాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి లేఖ ద్వారా ఎన్నికల కమిషన్ కు తెలియ జేసినందుకు ధన్యవాదాలు.. గతంలో ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది... ఈ లేఖ ద్వారా వ్యక్తం చేసిన మరిన్ని అంశాల ను కూడా కమిషన్ నిశితంగా గమనిస్తోంది... హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలోని ఓ సీనియర్ ప్రతినిధి తిరుపతి ఉప ఎన్నికల అనంతరం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని.. ఏప్రిల్, మే మాసాల్లో జరగవచ్చని వ్యాఖ్యలు చేశారు... ఈ తరహా వ్యాఖ్యలు కమిషన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయి... ప్రస్తుత కమిషనర్ పదవి విరమణ అనంతరం (31-3-21 ) ఎన్నికలు జరుగుతాయని కూడా ప్రచారం చేస్తున్నారు... ఈ తరహా సమాధానమే పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి కూడా వ్యక్తం కావడం శోచనీయం... అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ప్రజా ప్రయోజనాల ప్రకారమే వ్యవహరిస్తుంది".... సీఎస్ సహా ఇతర అధికారులతో సమావేశానికంటే ముందు రోజు ఈ లేఖ రాసిన ఎస్ఈసీ
- ఎస్ఈసీ లేఖకు సీఎస్ జవాబు
ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ జవాబిచ్చారు. ఎస్ఈసీతో భేటీ కంటే ముందే సీఎస్ లేఖను ఎన్నికల సంఘానికి పంపించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహణ సాధ్యమని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం టీకా అందించే ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారన్నారు. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తుందన్న ఆరోపణలను సీఎస్ ఖండించారు. కొవిడ్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కావట్లేదని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. అధికారిక సంప్రదింపుల్లో రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నవారిని ప్రస్తావించడం సరికాదని వెల్లడించారు.
ఇదీచదవండి: ఎన్నికల ఏర్పాట్లు చేయాలన్న ఎస్ఈసీ...మరికొన్నాళ్లు వాయిదా వేయాలన్న సీఎస్