ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై భక్తుల ఇక్కట్లు... ప్రణాళిక లేకుంటే దర్శనానికే బ్రేక్‌

author img

By

Published : Sep 2, 2022, 10:03 AM IST

Indrakiladri temple: దుర్గగుడి దసరా వేడుకల్లో ఈ ఏడాది ఘాట్‌రోడ్డును క్యూలైన్లకే వదిలేసి.. ప్రముఖులను లిఫ్టుల్లో కొండపైకి తరలించాలనే ఆలోచనతో చిక్కులు తప్పేలా లేవు. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇచ్చి.. ప్రముఖులను వేరే మార్గంలో తరలించాలనే ఆలోచన బాగున్నా.. సరైన ఏర్పాట్లు లేకుంటే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దసరా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి లక్షల మంది భక్తులు దుర్గగుడికి తరలివస్తారు. ఏటా  ఘాట్‌రోడ్డు కుడి వైపున ఓ పక్కగా మూడు క్యూలైన్లను కొండపైకి వేసి.. మిగతా మార్గమంతా వాహనాలు తిరిగేందుకు ఉంచేవారు. ప్రస్తుతం ఘాట్‌రోడ్డును క్యూలైన్లకే పరిమితం చేసి.. వీఐపీలకు లిఫ్ట్‌ల ద్వారా బ్రేక్‌ దర్శనాలను కల్పిస్తామని దేవాదాయ శాఖ మంత్రి, దుర్గగుడి అధికారులు ప్రకటించారు. త్వరలో దీనికోసం ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. పక్కాగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే తప్ప.. ఇలా మొత్తం ఘాట్‌రోడ్డును కేవలం క్యూలైన్ల కోసమే వినియోగించడం దసరాలో ఇబ్బందికర పరిణామమే.

Indrakiladri temple
దర్శనానికే బ్రేక్‌

Indrakiladri temple: సరాలో వీఐపీలకు ఒక టైం స్లాట్‌ను కేటాయించి.. ఆ సమయంలోనే బ్రేక్‌ దర్శనాలు కల్పించాలని యోచిస్తున్నారు. ఈ ఆలోచన గతంలోనూ చాలాసార్లు చేశారు. దసరా వేడుకలకు వారం పది రోజుల ముందు అధికారులు విస్తృతంగా ప్రచారం కూడా కల్పించారు. ప్రముఖుల ఫలానా సమయంలోనే రావాలంటూ విజ్ఞప్తులు చేశారు. కానీ.. వాటిని ఏ ప్రముఖుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. వారికి నచ్చిన సమయంలో దర్జాగా కొండపైకి కార్లతో దూసుకొచ్చి దర్శనాలు చేసుకుని వెళ్లారు. వాళ్లను పోలీసులు అడ్డుకుంటే దానిని పెద్ద గొడవగా మార్చిన ఉదంతాలు కోకొల్లలున్నాయి.

దాంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో తమకెందుకు తలనొప్పి అని మొదటి రెండు రోజులు ఉన్న ఉత్సాహం పోలీసుల్లో నీరుగారి ఎవరొచ్చినా.. గేటు తీసి పంపించేశారు. కేవలం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల వరకైతే ఫర్వాలేదు. దుర్గగుడిలో చోటామోటా నాయకులు కూడా వీఐపీలే. ఏటా దసరాలో ఒక్కో ప్రజాప్రతినిధి పేరుతో వేలాది మంది నిత్యం దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. వారి కోసం ప్రత్యేకంగా ఇన్నోవా వాహనాలను సైతం ఏర్పాటు చేసి.. కొండపైకి తిప్పుతూ ఉంటారు. ‘బ్రేక్‌’ ఆలోచనతో ఇలాంటి వారందరి హడావుడి.. లిఫ్టుల వద్ద పెరిగిపోతుంది. అక్కడ నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు.

దర్శనాలకు అడ్డంగా తీసుకెళ్లాలి: పైగా.. క్యూలైన్లలో నుంచి దర్శనాలు చేసుకుని భక్తులు కిందకు దిగే సమయంలో వారికి ఎదురుగా లిఫ్టుల్లో నుంచి వీఐపీలను అడ్డంగా తీసుకెళ్లాలి. ఇప్పటికే దసరాల్లో చాలామంది అనధికారికంగా ఇలా పైకి వస్తూ సాధారణ భక్తులకు ఎదురుగా అడ్డంగా దూరుతూ దర్శనాలు చేసుకోవడం ఏటా వివాదమవుతోంది. అలాంటిది ఇప్పుడు అధికారికంగానే లిఫ్ట్‌ నుంచి ఎదురుగా తీసుకెళ్లాలి. దసరా సమయంలో ఉండే రద్దీకి ఇలా అడ్డంగా దర్శనాలకు తీసుకెళ్లడం తలకుమించిన భారమే అవుతుంది.

భారీగా మోహరించిన పోలీసులు.. ఇలాంటి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉంటారు. కొండపై రద్దీ పెరిగితే.. బారికేడ్లను పెట్టి ఎవరూ రాకుండా మూసేస్తుంటారు. చివరికి ఆలయ సిబ్బందిని, ఈవోలను సైతం అడ్డుకున్న ఉదంతాలున్నాయి. దాంతో వివాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో లిఫ్ట్‌ల్లో నుంచి వచ్చే వారికి అమ్మవారి దర్శనం చేయించే ప్రత్యామ్నాయ మార్గం ఏంటనే దానిపై అధికారులు దృష్టిసారించాలి. అప్పుడే ఘాట్‌రోడ్డును పూర్తిగా కూలైన్లకు కేటాయించాలనే ఆలోచన చేయాలి. లేదంటే.. భక్తులు కిందకు దిగి ప్రసాదాలు కొనుగోలు చేసే కనకదుర్గానగర్‌ వద్ద.. ఎదురుగా వీళ్లంతా లిఫ్ట్‌ వైపు వెళ్తుంటే.. విపరీతమైన రద్దీ పెరిగిపోతుంది. ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టమవుతుంది.

భారమంతా లిఫ్టులపై పడితే: ఏటా దసరాలో క్యూలైన్లలో ఎంతమంది భక్తులు దర్శనాలకు వెళ్తారో.. అంతే స్థాయిలో వీఐపీలు, ప్రత్యేక పూజలు చేసే ఉభయదాతలు, వికలాంగులు, వృద్ధులు వాహనాల్లో ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకుంటారు. ప్రస్తుతం ఎలాంటి వాహనాలు పైకి రాకుండా కిందనే ఆపేయడం వల్ల.. ఘాట్‌రోడ్డుపై రద్దీ తగ్గిపోతుంది. దీంతో సాధారణ భక్తులకు మంచే జరుగుతుంది. కానీ.. భారమంతా కొండ దిగువున కనకదుర్గానగర్‌పై పడుతుంది. లిఫ్ట్‌ల వద్ద విపరీతమైన రద్దీ పెరిగిపోతుంది. గతంలో ఇలాగే ఘాట్‌రోడ్డుతో సంబంధం లేకుండా పవర్‌ లిఫ్టులలో భక్తులను కొండపైకి తరలించేందుకు ప్రయత్నం చేసి.. విఫలమయ్యారు.

సాధారణ రోజుల్లో రద్దీనే తట్టుకోలేక.. పవర్‌ లిఫ్ట్‌లు కూడా మరమ్మతులకు గురయ్యాయి. ఇక దసరా సమయంలో లిఫ్ట్‌లు మరమ్మతులకు గురైతే ప్రత్యామ్నాయం ఏంటనేది ప్రధానంగా ఆలోచించాలి. రూ.4-5 వేల ధర చెల్లించి ప్రత్యేక లక్ష కుంకుమార్చన, చండీహోమం టిక్కెట్లు కొనుక్కునే ఉభయదాతలను ఏటా వాహనాల్లో ఘాట్‌రోడ్డులో తీసుకొస్తుంటారు. ఈసారి లిఫ్టుల్లోనే తరలించాలి. గతంలో వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా బస్సు కొండపైకి ఏర్పాటు చేసేవారు.ఇప్పుడు వీల్‌ఛైర్లలో కూర్చోబెట్టి.. లిఫ్టుల్లో పైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమనేది అధికారులు ఆలోచించాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.