ETV Bharat / city

తెలంగాణ కన్నా.. ఏపీ ద్రవ్యలోటే తక్కువ: ఆర్థిక మంత్రి బుగ్గన

author img

By

Published : Jul 26, 2022, 2:30 PM IST

Updated : Jul 27, 2022, 7:20 AM IST

MINISTER BUGGANA: ఏపీ మాత్రమే అప్పులు చేసినట్లు చిత్రీకరిస్తున్నారని.. ద్రవ్యలోటు కూడా ఎక్కువుగా ఉందని ఆరోపిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన విమర్శించారు. తెలంగాణతో పోల్చుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు తక్కువగా ఉందని పేర్కొన్నారు.

MINISTER BUGGANA
MINISTER BUGGANA

తెలంగాణ కన్నా.. ఏపీ ద్రవ్యలోటే తక్కువ

MINISTER BUGGANA: ‘మత్తు పానీయాలపై వచ్చే పన్నులు, ఆదాయం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌పై (ఏపీఎస్‌డీసీ) రుణం తీసుకువచ్చాం. దానిపై చట్టం చేశాం. అందులో దాపరికం ఏం లేదు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతు భరోసా, ఆసరా, చేయూత, అమ్మఒడి పథకాలకు వాడతామని చెప్పాం. అలానే వాడుతున్నాం...’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ ఏపీ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పొరుగున ఉన్న తెలంగాణతో సహా ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్‌ అప్పులు తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ‘విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 2014లో రూ.1.35 లక్షల కోట్ల అప్పు ఉంటే... 2019, మే నాటికి అది ఏకంగా రూ.3.27 లక్షల కోట్లకు పెరిగింది. 2022 నాటికి మూడేళ్ల తర్వాత రూ.4.98 లక్షల కోట్లకు చేరుకుంది. 2014-15లో 3.95% ద్రవ్యలోటు ఉంటే... 2021-22 నాటికి దానిని తాము 3 శాతానికి తగ్గించాం. 2014-15లో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.13,776 కోట్లుగా ఉంటే... మా ప్రభుత్వం దానిని రూ.8,500 కోట్లకు తగ్గించింది...’ అని మంత్రి బుగ్గన తెలిపారు. తెలంగాణ రెవెన్యూ మిగులు నుంచి రూ.4,400 కోట్ల రెవెన్యూ లోటుకు వెళ్లిందన్నారు. ‘చంద్రబాబు నాయుడు హయాంలో స్థూల ఉత్పత్తిలో పెరుగుదల 11 శాతంగా ఉంటే... మా ప్రభుత్వ హయాంలో అది 18 శాతంగా ఉంది.

చంద్రబాబు ప్రభుత్వం 8 శాతం వడ్డీ రేటుకు అప్పులు చేస్తే... మా ప్రభుత్వం ఏడు శాతం రేటుకే రుణాలు తెచ్చింది...’ అని వివరించారు. కొత్త జిల్లాలు ఏర్పడి డీడీఓ కోడ్‌ల మారడంతో కాగ్‌ రిపోర్ట్‌ ప్రచురించకపోతే దానిపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అప్పులు అంటూ తెదేపా అనుకూల మీడియా ప్రజలను భయపెట్టేలా అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రూ.12 వేల కోట్లు పెట్టుబడులు వస్తే... మా హయాంలో ఇప్పటికే రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నాడు 268 స్టార్టప్స్‌ ఏర్పాటైతే... మా ప్రభుత్వంలో 869 స్టార్టప్‌లు వచ్చాయి...’ అని వివరించారు. ‘కేంద్రం అవసరమైతే నగదు ముద్రిస్తుంది. రాష్ట్రాలకు ఆ అవకాశం ఉండదు. కేంద్రానికి అప్పులపై పరిమితి లేదు. రాష్ట్రాలకు ఉంటుంది. అదనపు పన్నులపై మాత్రమే మేం అప్పు చేశాం. అది సరికాదని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఆ పన్ను లేకపోతే ఆదాయమే ఉండదు కాబట్టి మాకు వెసులుబాటు కల్పించాలని కోరాం...’ అని ఆయన వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 27, 2022, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.