ETV Bharat / city

murder in vijayawada : విజయవాడలో వ్యాపారవేత్త హత్య

author img

By

Published : Aug 20, 2021, 5:26 AM IST

విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం గురువారం కలకలం రేపింది. దర్యాప్తులో హతుడు పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ (29) అని తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటుచేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడలో వ్యాపారవేత్త హత్య
విజయవాడలో వ్యాపారవేత్త హత్య

కెనడాలో చదివిన కరణం రాహుల్‌ స్వదేశానికి వచ్చి నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో హుటాహుటిన మాచవరం ఇన్‌ఛార్జి సీఐ సత్యనారాయణ, సెంట్రల్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా అక్కడకు వెళ్లారు. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, భోరున విలపించారు.

పోలీసులు కారు వెనుక అద్దాలు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. వాహనంలో తాడు, దిండు ఉండటంతో రాహుల్‌ది హత్యేనని నిర్ధారణకు వచ్చారు. పరిచయస్తులే హత్యచేసి ఉంటారని తేల్చారు. మృతుని కుటుంబసభ్యులను విచారించగా.. పలు విషయాలు వెల్లడించారు. సిలిండర్ల తయారీ కంపెనీలోని ముగ్గురు భాగస్వాముల్లో ఇద్దరు స్థానికంగా ఉండట్లేదు. ఒకరి ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో అనుమానం నిజమైంది. మృతుడి కుటుంబసభ్యులు కూడా ఆ వ్యక్తి పేరు చెప్పడంతో మిస్టరీ వీడింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కోరాడ విజయ కుమార్‌, అతడి భార్య పద్మజ, మరో మహిళ గాయత్రి, రౌడీషీటర్‌ కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు తెలిసి, వారి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు.

సూత్రధారి సత్యమేనా?

రాహుల్‌ హత్యకు ప్రధాన సూత్రధారి రౌడీషీటర్‌ కోగంటి సత్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితుల కాల్‌డేటా విశ్లేషణ, బాధిత కుటుంబసభ్యులను విచారించగా తెలిసిన అంశాలతో ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేసుకున్నారు. మరోవైపు హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై మాత్రం ఇంకా విచారణ కొనసాగుతోంది.

ఎన్నికలలో ఓడిపోయిన విజయ కుమార్‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. తన వాటా తీసుకుని డబ్బులు ఇవ్వాలని కొంతకాలంగా రాహుల్‌ను అడుగుతున్నాడు. తనవద్ద అంత డబ్బు లేదని రాహుల్‌ చెప్పగా మొత్తం తానే తీసుకుంటానని కోగంటి సత్యం ముందుకొచ్చాడు. అందుకు రాహుల్‌ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చర్చించుకుందాం రమ్మని రాహుల్‌కు ఫోన్‌ రావడంతో కారులో బయటకు వెళ్లారు. వాహనంలో రాహుల్‌ కాకుండా మరికొందరు ఎక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్‌ డ్రైవింగ్‌ సీట్లో ఉన్నారు. అతడి చేతులను వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు వెనక్కి లాగి విరిచి పట్టుకోగా, పక్కన కూర్చున్న వ్యక్తి దిండుతో ముఖంపై నొక్కడంతో చనిపోయి ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు.

ఇవీచదవండి.

CHEATING : శారీరకంగా దగ్గరయ్యాడు... పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు

DEATH: బీటెక్ విద్యార్థి మృతి.. ఫీజు వేధింపులే కారణమా..?

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. తల్లి, కుమారుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.