ETV Bharat / city

కరోనా మహమ్మారికి పడిపోతున్న పండ్ల ధరలు

author img

By

Published : Mar 22, 2020, 12:23 PM IST

పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం... కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. విదేశాలకు కార్గో సర్వీసుల నిలిపివేయటం... దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన మార్కెట్ల మూసివేయటం వల్ల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా మామిడి, అరటి పండ్లు రోజు రోజకు ధరలు పడిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మద్దతు ధరను కల్పించాలని రైతులు కోరుతున్నారు.

కరోనా మహమ్మారికి పడిపోతున్న పండ్ల ధరలు
కరోనా మహమ్మారికి పడిపోతున్న పండ్ల ధరలు

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌... కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. విదేశాలకు కార్గో సర్వీసుల నిలిపివేత, దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన మార్కెట్ల మూసివేత కారణంగా రాష్ట్ర రైతాంగం కుదేలవుతోంది. 3రోజుల నుంచి మామిడి టన్నుకు... రోజుకు రూ.10వేల చొప్పున ధర తగ్గుతోంది. వారం నుంచి అరటి రోజుకు రూ.వెయ్యి చొప్పున పడిపోతోంది. బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పుచ్చ తదితర అన్ని రకాల పండ్ల ధరలూ 30 నుంచి 50శాతంపైనే తగ్గాయి. పక్వానికి వచ్చే కాయను కోయలేక, అలాగని చెట్టుకే మగ్గబెట్టలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభావం క్రమేణా కూరగాయల రైతులపైనా పడుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మద్దతు ధరను కల్పించాలని, ఎగుమతి సంస్థలతో మాట్లాడి కొనుగోలు నిలిపేయకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

మామిడి రూ.50వేలకు..

కృష్ణా జిల్లాలో ఈ ఏడాది మామిడి ముందుగానే రావటంతో ఎగుమతులు మొదలయ్యాయి. 'బంగినపల్లి మామిడి మూడు రోజుల కిందటి వరకు టన్నుకు రూ.80వేల వరకు పలకగా ఇప్పుడు రూ.50 వేలకు పడిపోయింది. రూ.18వేల చొప్పున కొన్న తోతాపురి రకం క్రయవిక్రయాలను కూడా నిలిపేశారు. వారం నుంచి ఎయిర్‌ కార్గో ఆగిపోవటంతో గల్ఫ్‌తో పాటు ఐరోపా దేశాలకు మామిడి ఎగుమతులు నిలిపేశామని' నూజివీడు వ్యాపారి సందీప్‌ వివరించారు.

ఆశలు గల్లంతు

ఈ ఏడాది మామిడి పూత రాక కాపు తగ్గింది. దిగుబడులు తగ్గడంతో పెట్టుబడులపైనే ఆశలు చెదురుతున్నాయి. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టినప్పటికీ పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోవడం రైతులను కలవరపరుస్తోంది.

అరటి రూ.4వేలకు

అనంతపురం, కడప జిల్లాల్లో ఎగుమతికి వీలైన అరటి రకాలను పండిస్తుంటారు. గతేడాది 18,500 టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేశారు. విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో నెల కిందట టన్ను రూ.15వేల చొప్పున కొన్న అరటి ఇప్పుడు రూ.4వేలకు తగ్గింది. 3రోజుల పాటు కొనుగోలు నిలిపేస్తున్నట్లు వ్యాపార సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.70వేల వరకు పెట్టుబడి పెట్టామని, అది కూడా చేతికొచ్చేట్లు లేదని రైతులు కలవరపడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో తగ్గిన అరటి రేట్లు

జిల్లాలోని రావులపాలెం మార్కెట్‌లో 10 రోజుల కిందట కర్పూర రకానికి లోడు (6 గెలలు)కు రూ.1,600 నుంచి రూ.1,800 లభించింది. అంటే గెల గరిష్ఠంగా రూ.300 వరకు పలికింది. మూడు రోజులుగా లోడును రూ.వెయ్యి నుంచి రూ.1200 మించి కొనడం లేదు. గెలకు రూ.200 మించి రావడం లేదు. ఒడిశాలో మార్కెట్లు మూసేయటంతో ఆ ప్రభావం రాష్ట్రంలో పడింది.

రైతుల ఆవేదన

సన్నకాయ గెలల్ని తీసుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘'ఎనిమిదెకరాల్లో అరటి వేశా. ఫిబ్రవరి 15న టన్ను రూ.14,500 చొప్పున 70 టన్నులు అమ్మా. వారం కిందట 55 టన్నులు రూ.7వేలకు కొన్నారు. ఈ పొద్దు టన్నుకు రూ.4వేలే వచ్చింది. రోజుకు రూ.వెయ్యి చొప్పున పడిపోతోంది. మరో వారంలో 60 టన్నులు కొట్టాలి. అప్పుడు ఎంత వస్తుందో ఏమో'’ అని అనంతపురం జిల్లా పుట్లూరుకు చెందిన రైతు నాగేశ్వరరెడ్డి ఆవేదన చెందారు.

వాడుతున్న పూలు

బెంగళూరు, చెన్నైలోని ప్రధాన పూల మార్కెట్లూ మూతపడ్డాయి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌ను ఆదివారం మూసేయటంతో పాటు గురువారం నుంచి ఉదయం 5-11 గంటల మధ్య పనిచేస్తుందని పూలవర్తక సంఘం ప్రకటించింది. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు నిలిచిపోవటంతో పూల కొనుగోలు పడిపోయింది. పక్షం కిందటితో పోలిస్తే పూల ధరలు 30శాతం తగ్గాయి. చిన్న పట్టణాల్లో కొనుగోళ్లపై ఆధారపడే మార్కెట్‌ నడుస్తోంది. కట్‌ఫ్లవర్స్‌ బంచ్‌ ఫిబ్రవరిలో రూ.150 వరకుండేది. ఇప్పుడు రూ.30కి పడిపోయింది. ఉద్యాన పంట కోతల విషయంలో ధర వచ్చినప్పుడు అమ్ముదామనే పరిస్థితి ఉండదు. ఏ మాత్రం ఆలస్యమైనా పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే.

సూక్ష్మసేద్యం, షెడ్‌నెట్‌, పాలీహౌజ్‌ తదితర ఆధునిక విధానాలను అందిపుచ్చుకుని మన రైతులు కొన్నేళ్లుగా ఉద్యాన సాగులో ఉత్తమ దిగుబడులను సాధిస్తున్నారు. దేశంలో ఉత్పత్తయ్యే పండ్లలో 15.6% మన రాష్ట్రం వాటానే ఉంటోంది. కూరగాయల ఎగుమతుల్లోనూ మనవాటా 7.8% ఉంది. బంగినపల్లి మామిడి మూడు రోజుల కిందటి వరకు టన్నుకు రూ.80వేల వరకు పలకగా ఇప్పుడు రూ.50 వేలకు పడిపోయింది. నెల కిందట టన్ను రూ.15వేల చొప్పున కొన్న అరటి ఇప్పుడు రూ.4వేలకు తగ్గింది.

అన్నింటికీ దెబ్బే

దిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల ఎగుమతులపై ఆధారపడిన ఉద్యాన పంటల అమ్మకాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. బొప్పాయికి ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎగుమతి రకం ధర టన్నుకు ఫిబ్రవరి మొదటివారంలో రూ.20వేలుంటే 4రోజుల కిందట రూ.10 వేలకు, ఇప్పుడు రూ.6వేలకు పడిపోయింది. నిమ్మ టన్ను ధర 20 రోజుల కిందట రూ.34వేలుంటే, ఇప్పుడు రూ.24వేలకు దిగజారింది. బత్తాయి ధరలూ టన్నుకు రూ.15వేలు లభిస్తున్నాయి. పుచ్చకాయ ధరలూ టన్నుకు రూ.10వేల వరకు తగ్గాయి. టన్నుకు రూ.5వేలు కూడా దక్కని పరిస్థితి కడప జిల్లాలో ఉంది. జామ, సపోటా తదితర పండ్ల రకాల ధరలూ పూర్తిగా తగ్గాయి. తమలపాకు బుట్ట నెల కిందట రూ.1100 ఉంటే ఇప్పుడు రూ.400కు తగ్గింది. ‘కీర దోస గత వారం కిలో రూ.16 నుంచి రూ.17 వరకు పలకగా, శుక్రవారం రూ.11కి చేరింది’ అని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు వాసి గడ్డం సందీప్‌ తెలిపారు. ఆర్టీసీ బస్సులు నిలిపేయటంతో దూర ప్రాంతాలకు రవాణా నిలిచిపోతోందని ప్రకాశం జిల్లా ముండ్లమూరు రైతు వేణు వివరించారు.

ఇదీ చూడండి: అకాల వర్షం... అరటి రైతులకు అపార నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.