ETV Bharat / city

నిధుల సేకరణలో దుర్గ గుడి పాలకమండలి విఫలం.. ప్రణాళికలకే పరిమితమైన అభివృద్ధి పనులు !

author img

By

Published : Feb 19, 2022, 5:01 PM IST

విజయవాడ దుర్గగుడి పాలకమండలి కాలపరిమితి మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. రెండేళ్ల సమయంలో ఆలయ అభివృద్ధి నామామాత్రంగానే జరిగింది. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపైనే ప్రధానంగా దృష్టిసారిస్తామంటూ ప్రకటించిన పాలకమండలి.. ఆ దిశగా చేపట్టిన చర్యలు పెద్దగా లేవు. రెండేళ్ల కిందట ఆలయంలో భక్తుల కోసం ఏ సౌకర్యాలున్నాయో.. ఇప్పుడూ దాదాపు అవే ఉన్నాయి. ఒక్కటి కూడా మారింది లేదు.

నిధుల సేకరణలో దుర్గ గుడి పాలకమండలి విఫలం
నిధుల సేకరణలో దుర్గ గుడి పాలకమండలి విఫలం

నిధుల సేకరణలో దుర్గ గుడి పాలకమండలి విఫలం

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఆలయాల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. గత పాలకమండళ్ల మాదిరిగానే ఈ పాలకమండలి కాలపరిమితి కూడా వివాదాలతోనే ప్రయాణం ముగుస్తోంది. ఆలయంలో వెండి సింహాల చోరీ, టెండర్ల విషయంలో అధిక జోక్యం, తమ వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు, సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు, అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణలో వైఫల్యాలు.. ఇవే ఈ రెండేళ్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతిసారి పాలకమండలి సమావేశంలో అనేక విషయాలపై నిర్ణయాలు చేస్తున్నా.. వాటిలో అమలు జరుగుతున్నవి అంతంత మాత్రమే ఉన్నాయి. చివరికి ప్రభుత్వం ప్రకటించిన 70 కోట్ల రూపాయల నిధులను కూడా త్వరితగతిన సాధించడంలో విఫలమయ్యారు.

పైలా సోమినాయుడు ఛైర్మన్‌గా 2020 ఫిబ్రవరి 21న.. 16 మందితో దుర్గగుడి పాలకమండలి కొలువు దీరింది. ఆలయానికి అవసరమైన నిధులను దాతల సహకారంతో తీసుకురావడం, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం.. ఈ రెండు ప్రధానంగా ధర్మకర్తల మండలి చేయాలి. ఈ రెండు అంశాల్లోనూ పాలకమండలి ముద్ర వేయలేకపోయింది. 2020 దసరా సమయంలో కొండ రాళ్లు జారి పడి పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ సందర్శించి.. రూ.70 కోట్లను ఆలయ అభివృద్ధి కోసం ప్రకటించారు. 2021 దసరాలోపు ఈ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు పూర్తిచేస్తామని పాలకమండలి ప్రకటించింది. చేపట్టోబయే పనుల నమూనాలు కూడా ఘనంగా ప్రదర్శించారు. కానీ.. 2021 దసరాలోపు ప్రభుత్వం ప్రకటించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ దిశగా పాలకమండలి సభ్యులు చొరవచూపించలేదన్న విమర్శలున్నాయి.

రాళ్లు జారిపడకుండా ఉండేందుకు రాక్‌ మిటిగేషన్‌ పనులు మాత్రమే ఇప్పటివకు చేపట్టగలిగారు. అవి కూడా దసరా ఉత్సవాలకు ముందు హడావుడిగా ఆరంభించారు. కొండ పైభాగంలో వర్షం నీరు వెళ్లేందుకు కాలువ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అది ఇంకా పూర్తవ్వలేదు. ప్రసాదం పోటు, అన్నదాన భవనాలు ఇంకా పునాదులు కూడా దాటలేదు. కేశఖండనశాల నిర్మాణం పూర్తిగా ఆపేశారు. రూ.6 కోట్లతో కల్యాణమండపాలు కడతామంటూ ప్రకటించారు. స్థలం విషయంలో వివాదం ఏర్పడడంతో ఆపేశారు. గతంలో ఉన్న చాలామంది పాలకమండలి సభ్యులు ఆలయానికి దాతల నుంచి విరాళాలు సేకరించడంపై దృష్టిపెట్టారు. ఈసారి ఆ విషయంలోనూ పాలకమండలి దృష్టిసారించలేదు. తమ వాళ్లకు అమ్మవారి దర్శనాలను చేయించుకునేందుకు మాత్రమే ఎక్కువ మంది సభ్యులు పరిమితమయ్యారనే విమర్శలున్నాయి.

ఇదీ చదవండి
డ్రైవింగ్​ మాత్రమే కాదు 'ఓటు' వేయడం కూడా డ్యూటీనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.