ETV Bharat / city

High court: పూనం మాలకొండయ్యకు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌

author img

By

Published : Sep 15, 2021, 1:04 PM IST

Updated : Sep 16, 2021, 4:58 AM IST

high court sentences two IAS officers to jail for contempt
ఇద్దరు ఐఏఎస్‌లకు శిక్ష ఖరారు చేయనున్న హైకోర్టు

13:00 September 15

ఈ నెల 29న శిక్ష ఖరారు చేయనున్నట్లు వెల్లడి

    కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరయినందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ప్రాథమికంగా నిర్ధారించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై తుది తీర్పు ఇవ్వడానికి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. చాలా ఏళ్లుగా పట్టుపరిశ్రమ శాఖలో సేవలందించినందుకు తమ ఉద్యోగాలను 1993 నవంబర్‌ నుంచి క్రమబద్ధీకరించాలని, దాని ఆధారంగా పెన్షనరీ ప్రయోజనాలను లెక్కించి ఇవ్వాలని 2020 ఫిబ్రవరి 28న హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ 17 మంది విశ్రాంత ఫుల్‌ టైమ్‌ కాంటిజెంట్‌ ఉద్యోగులు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. 

   ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పట్టుపరిశ్రమ కమిషనర్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి చిరంజీవి చౌదరిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. గత ఆదేశాల మేరకు ఆ ముగ్గురు అధికారులు హైకోర్టులో బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఎస్‌ఎస్‌ రావత్‌, చిరంజీవిచౌదరి మాత్రమే విచారణకు వచ్చారు. పూనం మాలకొండయ్య హాజరు కాలేదు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. ఆ పిటిషన్‌ కోర్టు ముందున్న రికార్డుల్లో లేదని స్పష్టం చేసిన న్యాయమూర్తి..  గైర్హాజరయినందుకు పూనం మాలకొండయ్యపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు.
 

ఇదీ చదవండి: 

జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరణ

Last Updated :Sep 16, 2021, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.