ETV Bharat / city

AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం

author img

By

Published : Aug 21, 2021, 10:10 AM IST

Updated : Aug 21, 2021, 12:24 PM IST

మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతోంది. ఉపరితల ద్రోణి కారణంగా వారం రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

heavy-rains
heavy-rains

AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉండగా ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రహదార్లు జలమయమయ్యాయి. ఈపురుపాలెం, వేటపాలెం ప్రాంతాల్లో కూడా భారీ వర్ధం నమోదైంది.

విజయవాడ నగరం తడిసిముద్దవుతోంది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాలలో భారీగా వానపడుతోంది. మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలువల నీరు, చెత్తాచెదారాలు రహదారులపైకి వస్తుండడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మహాత్మాగాంధీ రోడ్డు, బెంజిసర్కిల్‌, పటమట, ఆటోనగర్‌, కానూరు ప్రాంతాల్లో కాలువల నుంచి నీరు బయటకొచ్చి రోడ్లపై పారుతుండడంతో.. తీవ్ర దుర్గందం వెదజల్లుతోంది. మొగల్రాజపురం, చుట్టు గుంట, భవానీపురం తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించేందుకు జనం అవస్థలు పడుతున్నారు. వన్‌టౌన్‌ సహా ఇతర లోతట్టు ప్రాంతాలు, కాలనీల చుట్టూ వాన నీరు నిలిచింది. విజయవాడ చుట్టుపక్కల కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు, గన్నవరం తదితర మండలాల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది.

కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా చెన్నై-కోల్‌కతా రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కేసరపల్లి, గౌడపేట, సావరగూడెంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గన్నవరం-ఆగిరిపల్లి ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. గొల్లనపల్లి వద్ద పోలవరం కాల్వపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. జిల్లాలో 5.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో రోడ్లపైకి వర్షపు నీరు చేరి.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట, బాపట్ల, కర్లపాలెం, పెదనందిపాడు, అమరావతి, గురజాల, పిడుగురాళ్ల మండలాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీలో తాటిచెట్టుపై పిడుగు పడి.. పూర్తిగా దగ్ధమైంది. పిడుగుపడే సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా చీరాలలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఈపురుపాలెం, వేటపాలెం ప్రాంతాల్లోనూ విస్తారంగా వాన కురుస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో వ్యవసాయానికి వర్షాలు ఊతమిస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల పాటు అధిక వర్షాలు...

మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ.. 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉన్నట్లు.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో.. ఒకటీ రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో.. రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చేవారం రోజుల పాటు.. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.

ఇదీ చదవండి: weather update: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు

Last Updated : Aug 21, 2021, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.