ETV Bharat / city

Cm Jagan on Skill Development: ప్రతి నియోజకవర్గానికో ఐటీఐ: సీఎం జగన్

author img

By

Published : Sep 13, 2021, 4:25 PM IST

Updated : Sep 14, 2021, 4:15 AM IST

ప్రతి లోక్‌సభ స్థానంలో నైపుణ్యాభివృద్ధి కళాశాల
ప్రతి లోక్‌సభ స్థానంలో నైపుణ్యాభివృద్ధి కళాశాల

పదో తరగతి మానేసిన యువకుల నైపుణ్యాల పెంపుపై దృష్టిసారించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి శాసనసభ స్థానంలో ఒక నైపుణ్యాభివృద్ధి కళాశాల(ITI) ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. క్యాంపు కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై సమీక్ష నిర్వహించారు.

ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఐటీఐ(ITI) ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన బోధన సిబ్బందిని నియమించాలని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం నైపుణ్యాభివృద్ధి కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై సమీక్ష నిర్వహించారు.

ప్రతి ఐటీఐలోనూ జాతీయ నిర్మాణ అకాడమీలాంటి సంస్థలను భాగస్వామ్యం చేయాలి. పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్‌ చేయాలి. అన్ని ఐటీఐల్లో కనీస సదుపాయాలపైనా దృష్టి పెట్టాలి. ప్రమాణాలపై సర్టిఫికేషన్‌ చేయించాలి. ప్రతి నెలలో మూడు రోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యేలా ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో శిక్షణ పొందిన వారికి అప్రెంటిస్‌షిప్‌ వచ్చేలా కలెక్టర్లు చొరవ చూపాలి. నిపుణులతో తరగతులు నిర్వహించేటప్పుడు వాటిని డిజిటల్‌ పద్ధతిలో పొందుపర్చాలి. మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆ వీడియోలను వినియోగించుకోవచ్చు - జగన్, ముఖ్యమంత్రి

విశాఖలో నైపుణ్య వర్సిటీ పనులు

‘‘విశాఖపట్నంలో హైఎండ్‌ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం పనులను వెంటనే మొదలు పెట్టాలి. లోక్‌సభ నియోజకవర్గంలో నైపుణ్య కళాశాలతోపాటు విశాఖపట్నంలో హైఎండ్‌ నైపుణ్య విశ్వవిద్యాలయం, తిరుపతిలో నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేయనున్నాం. కోడింగ్‌, లాంగ్వేజెస్‌, రోబోటిక్స్‌, ఐవోటీలాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా కళాశాలల్లో బోధన, శిక్షణ ఉండాలి. గ్రామాల్లో అంతర్జాల సదుపాయం కల్పించడం ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేస్తున్నాం. ప్రభుత్వ ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో బోధన సిబ్బందిపై పరిశీలన చేయాలి’’ అని సీఎం ఆదేశించారు. ‘పదో తరగతిలోపు మధ్యలో బడిమానేస్తున్న యువకుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించాలి. కొత్తగా వచ్చే పరిశ్రమలకు నైపుణ్య శిక్షణ పొందిన వారి వివరాలను అందించాలి. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. తాగునీటి ప్లాంట్లు, సౌర విద్యుత్తు యూనిట్లు, విద్యుత్తు మోటార్లు ఇలా రోజువారీగా మనం చూస్తున్న చాలావరకు అంశాల్లో నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యాలు మెరుగుపరచాల్సిన అవసరముంది. నైపుణ్యంలేని మానవ వనరుల కారణంగా కొన్నిచోట్ల మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు కూడా సరిగా నడవడం లేదు. కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణకు నైపుణ్యమున్న మానవ వనరులను అందించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి’’ అని సూచించారు.

ఇదీ చదవండి

CM JAGAN: రాష్ట్ర కార్మికులను భారత్‌కు తీసుకురావాలి.. కేంద్ర మంత్రి జైశంకర్‌కు జగన్ లేఖ

Last Updated :Sep 14, 2021, 4:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.