ETV Bharat / city

వైకాపా అక్రమాలపై ప్రచారం: చంద్రబాబు

author img

By

Published : Feb 27, 2021, 3:00 PM IST

Updated : Feb 28, 2021, 5:16 AM IST

పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పరిణామాల్లో తెదేపా సానుభూతిపరులపై ఓ వర్గం పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్​కు లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో తెదేపా కార్యకర్తలు క్రియాశీలంగా వ్యవహరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తెదేపా సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: చంద్రబాబు
తెదేపా సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: చంద్రబాబు

సామాజిక మాధ్యమాల్లో తెదేపా కార్యకర్తలు క్రియాశీలంగా వ్యవహరించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 'ఐ టీడీపీ' కార్యకర్తలతో చంద్రబాబు శనివారం సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల అక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లామని, భవిష్యత్తులోనూ ఇలాగే స్పందించాలని సూచించారు. ఎన్నికలప్పుడు బయటి ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేయడానికి వస్తే ఫొటోలు తీయాలన్నారు. కార్యకర్తలను వేధించే పోలీసులు, అధికారుల తీరును ఎండగట్టాలని సూచించారు. అధికార పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా చేసే అసత్యాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు కలసి పనిచేస్తే పురపాలక ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. పరిషత్‌ ఎన్నికల సమయంలో కార్యకర్తలకు అండగా ఉండటానికి కుప్పం నియోజకవర్గానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వస్తారని తెలిపారు. నెలకోసారి కుప్పం నియోజకవర్గానికి పార్టీ ముఖ్య నేత ఒకరు వస్తారని వెల్లడించారు.

పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాలి: డీజీపీకి చంద్రబాబు లేఖ

పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత మీదేనని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాల్లో తెదేపా సానుభూతిపరులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీ సర్పంచిగా గెలిచిన వైకాపా మద్దతుదారు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తెదేపా మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయటంతోపాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారంటూ డీజీపీకి శనివారం ఆయన లేఖ రాశారు. 'సిపాప భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చొద్దని తెదేపా కార్యకర్త రాఘవ కోరినందుకు వైకాపా నేతలు ఆయనపై, ఆయన కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారు. నిందితులపై కాకుండా గాయపడిన బాధితులపై అక్రమంగా కేసులు బనాయించారు. ఈ కేసు ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు, వైకాపా నేతలు బాధితుల్ని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నా' అని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పీఎస్​ఎల్వీ-సీ 51కు కౌంట్​డౌన్ ప్రారంభం

Last Updated : Feb 28, 2021, 5:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.