ETV Bharat / city

రాష్ట్రమంతటా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Oct 22, 2020, 9:13 AM IST

dussehra celebrations in various districts
వివిధ ప్రాంతాల్లో అమ్మవారి అలంకారాలు

రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని దేవాలయాలు.. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తూ.. భక్తలను అనుగ్రహిస్తున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అమ్మవారిని సేవిస్తున్నారు.

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రమంతటా ప్రజలు పాల్గొంటున్నారు. కరోనా ధాటికి ఇళ్లు కదలని జనం.. దేవాలయాలకు వెళ్లి భక్తితో అమ్మవారిని కొలుస్తున్నారు. రోజుకో రూపంలో అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించి తరిస్తున్నారు. కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రార్థిస్తున్నారు.

కర్నూలులో..

కర్నూలు జిల్లా నంద్యాలలోని కాళికాంబిక ఆలయంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. బ్రహ్మానందీశ్వర ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహానంది ఆలయంలోని శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు.. శ్రీ స్కంద మాత దుర్గ అలంకారంలో కనువిందు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వాసవి కన్యకపరమేశ్వరి ఆలయంలో వేంకటేశ్వరస్వామిగా.. సుశీలాంబ ఆలయంలో బాల త్రిపురసుందరదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. చిన్న అమ్మవారిశాలలో సరస్వతీ దేవి అలంకరణలో కొలువుతీరారు.

కడపలో..

కడపజిల్లా అమ్మవారిశాలలో వాసవి కన్యకా మాత.. భక్తులకు ఈరోజు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భౌతిక దూరం పాటించేలా సూచిస్తూ.. ఆలయ నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు అమలుచేస్తున్నారు. విజయదుర్గా దేవి ఆలయాన్ని విద్యుత్​ దీపాలతో అలంకరించారు.

కృష్ణాలో..

శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం, మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళా పీఠం ఆధ్వర్యంలో.. కృష్ణాజిల్లాలో సరస్వతిదేవి వేషధారణ పోటీలు నిర్వహించారు. సుమారు 50 మంది చిన్నారులు, మహిళలు అమ్మవారి అలంకరణతో ఆకట్టుకున్నారు. కరోనా వల్ల ఈ ఏడాది పూర్తిస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించలేక పోతున్నామని నిర్వాహకులు వాపోయారు.

ప్రకాశంలో..

ప్రకాశం జిల్లా చీరాలలో శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ బతుకమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో.. తిరుమల - తిరుపతి దేవస్థాన అర్చకులు వేద మంత్రోచ్ఛరణ గావించారు. పదేళ్ల నుంచి క్రమం తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

అనంతపురంలో..

అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి.. శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. కుమ్మరవాండ్లపల్లి మల్లాలమ్మ గుడిలో మీనాక్షి అలంకారంలో, మరకత మహాలక్ష్మిత్రిపుర బాలసుందరిగా, చౌడేశ్వరి ఆలయంలో లలితాదేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.

ఇదీ చదవండి:

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు..శ్రీవారికి గజవాహన సేవ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.