ETV Bharat / city

స్విమ్స్​లో.. ఆక్సిజన్ సరఫరాకు మూడంచెల వ్యవస్థ

author img

By

Published : May 22, 2021, 10:28 AM IST

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా రోగులు అత్యంత బాధాకర రీతిలో చనిపోయారు. అలాంటి దారుణాలు మరోసారి జరగకుండా మిగిలిన ఆసుపత్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సరఫరాలో ఏ పరిస్థితిలోనూ ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు.. స్విమ్స్‌ ఆసుపత్రి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది.

మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న స్విమ్స్
మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న స్విమ్స్

మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న స్విమ్స్

కరోనా రోగుల్లో అధిక శాతం మందికి శ్వాస సమస్య ఎదురవుతోంది. అలాంటి స్థితిలోనే ఆక్సిజన్‌ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఏ రకమైన సమస్యలు తలెత్తకుండా స్విమ్స్‌ ఆసుపత్రి.. మ్యానిఫోల్డ్ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేసుకుంది. శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల ఆసుపత్రిలో 145 ఐసీయూ, 328 ఆక్సిజన్ పడకలుండగా.. అందులో 40 వెంటిలేటర్ల పడకలు ఉన్నాయి.

కరోనా రోగుల అవసరాల నిమిత్తం 22 వేల లీటర్ల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వ ఉంచేలా.. 11 కేఎల్‌ సామర్థ్యంతో రెండు స్టోరేజ్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారు. కొవిడ్ ఆసుపత్రి కోసం ప్రత్యేకంగా ఒక 11కేఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌ కేటాయించగా.. ప్రత్యామ్నాయంగా మ్యానిఫోల్డ్‌ వ్యవస్థనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. గతం నుంచే మ్యానిఫోల్డ్‌ ద్వారా బల్క్‌ సిలిండర్ల నుంచి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నా.. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా మ్యానిఫోల్డ్ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేశారు.

మూడంచెల వ్యవస్థలో ప్రథమ ప్రాధాన్యంగా ట్యాంకులో సరిపడినంత ఆక్సిజన్‌ ఉంచుకుంటారు. నిల్వలు తగ్గుతున్నప్పుడే సరఫరాదారుకు సమాచారమిచ్చి.. నిల్వలు తగ్గకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. ఏదైనా సమస్యతో ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోతే.. రెండో అంచెలో మ్యానిఫోల్డ్ రూంలో 40 సిలిండర్ల ఆక్సిజన్‌ సిద్ధంగా ఉంచారు. అందులో సరికొత్త ప్రెజర్‌ గేజ్‌లు ఏర్పాటు చేయడంతో.. పై అంతుస్తుల్లో ఉన్న రోగులకూ ఆక్సిజన్‌ అందేలా ఏర్పాటు చేశారు.

ఒకవేళ రెండో అంచెలో కూడా ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బంది తలెత్తితే.. మూడో అంచెలో 8 బల్క్‌ సిలిండర్లు ద్వారా రోగులకు ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా ఆక్సిజన్ నిల్వలు తగ్గినా, ట్యాంకర్‌ వచ్చేందుకు ఆలస్యమైనా.. సుమారు ఐదు గంటల పాటు బ్యాకప్‌ వచ్చేలా సాంకేతికతను అప్‌గ్రేడ్‌ చేశామని ఆసుపత్రి నిర్వాహకులు చెప్తున్నారు. ఆక్సిజన్‌ సరఫరా కోసం మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ఆనందయ్య మందు కోసం పోటెత్తిన జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.