ETV Bharat / city

TTD EO: భక్తులకు అనుకూలంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు: జవహర్​రెడ్డి

author img

By

Published : Apr 18, 2022, 5:40 PM IST

Updated : Apr 19, 2022, 6:54 AM IST

Interview with TTD EO: తిరుమలకు వచ్చే భక్తులకు అనుకూలంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేయనున్నట్లు తితిదే ఈవో జవహర్‌ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో రద్దు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్దరిస్తామని ప్రకటించారు. టైం స్లాట్ సర్వదర్శన టోకెన్లు లేకున్నా తిరుమలకు అనుమతిస్తామన్నారు. భక్తుడు తన ఇష్టం మేరకు దర్శన టోకెన్లు తీసుకోవడం లేదా నేరుగా వెళ్లడమన్నది నిర్ణయించుకోవచ్చంటున్న తితిదే ఈవో జవహర్ రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.

Interview with TTD EO
తితిదే ఈవో జవహర్ రెడ్డితో ముఖాముఖి

తితిదే ఈవో జవహర్ రెడ్డితో ముఖాముఖి

టైమ్‌స్లాట్‌ సర్వదర్శనాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని తితిదే ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. టోకెన్లు లేకున్నా నేరుగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తామని, ఏ విధానంలో వెళ్లాలనేది భక్తుల అభీష్టమని సోమవారం ‘ఈటీవీ భారత్​’కి వెల్లడించారు. ‘భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్లాటెడ్‌ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. త్వరగా దర్శనం కావాలనుకుంటే టైమ్‌స్లాట్‌లో టోకెన్‌ తీసుకోవాలి. ఇందుకు అవసరమైన క్యూలైన్లు, షెడ్లతో కూడిన కేంద్రాలను శాశ్వత ప్రాతిపదికన తిరుపతి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌తోపాటు కొండకు వెళ్లే మార్గంలో ఆరు నుంచి ఎనిమిది ప్రదేశాల్లో త్వరలో అందుబాటులోకి తెస్తాం. పాత వాటిని పునరుద్ధరించడంతో పాటు కొత్త వాటిని ఏర్పాటు చేస్తాం. టోకెన్‌ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అసౌకర్యం లేకుండా చూస్తాం. టోకెన్‌ తీసుకోవడం ప్రయాస అనుకుంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్లవచ్చు. దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్థానికుల కోసమే ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ఇప్పటికే సెలవు రోజుల్లో సిఫార్సు లేఖలు అనుమతించడం లేదు. వేసవి సెలవుల నేపథ్యంలో వీఐపీలు లేఖలు ఇవ్వవద్దు. ఇచ్చినా అనుమతించం. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

  • సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీచేసే విధానంపై పరిశీలన చేస్తున్నామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి కూడా తెలిపారు. ఇటీవల ఎస్‌ఎస్‌డీ(స్లాటెడ్‌ సర్వదర్శనం) టోకెన్ల జారీ కేంద్రం వద్ద చోటుచేసుకున్న స్వల్ప తోపులాట నేపథ్యంలో టోకెన్ల జారీని రద్దుచేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నుంచి భక్తులను ధర్మదర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పారు.

వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు: కొవిడ్‌ వ్యాప్తి తగ్గడం, వేసవి నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోందని.. అందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీవారి సర్వదర్శనానికి 7 నుంచి 8గంటల సమయం పడుతోందని చెప్పారు. కరోనా నేపథ్యంలో తిరుమలలో సిబ్బందిని తగ్గించామని, ప్రస్తుతం రద్దీ పెరుగుతున్నందున వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల రద్దుచేసిన వీఐపీ దర్శనాలను సోమవారం నుంచి పునరుద్ధరించామన్నారు. రాంభగీచా బస్టాండ్‌, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లో ఫుడ్‌ కౌంటర్ల ద్వారా భక్తులకు భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు రూ.32,49,38,000 హుండీ ఆదాయం లభించిందని అదనపు ఈవో పేర్కొన్నారు. శ్రీవారిని ఏడు రోజుల్లో 5,29,926 మంది దర్శించుకోగా 24,36,744 లడ్డూలు అందించామని వెల్లడించారు.

తిరుమలలో ఆ దర్శనాల పునరుద్ధరణ : అదనపు ఈవో

Last Updated : Apr 19, 2022, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.