ETV Bharat / city

ఆధ్యాత్మిక నగరిలో పెరిగిపోతున్న నేరాలు

author img

By

Published : Sep 30, 2020, 2:56 PM IST

కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి పాదాల చెంతనున్న నగరం.. నిత్యం హరినామ సంకీర్తనలతో మారుమోగే పుణ్య ధామం తిరుపతి. అలౌకికమైన ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రతిబింబించాల్సిన తిరునగరిలో... ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. శాంతిభద్రతల పరంగా దేశంలోనే రెండోస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించిన ఖ్యాతి మెల్లగా మసకబారుతోంది. కొవిడ్ మహమ్మారి వ్యవస్థలను అచేతనం చేస్తే.... వరుసగా జరుగుతున్న నేరాలు... పోలీసులుకు సవాల్​గా పరిణమిస్తున్నాయి.

Crime Rate Hike in tirupathi
ఆధ్యాత్మిక నగరిలో పెరిగిపోతున్న నేరాలు

కొవిడ్ విలయ తాండవమే లేకుంటే... రోజుకు లక్షమంది రాకపోకలు సాగించే నగరమిది. ఆపదమొక్కుల వాడిగా... కోనేటి రాయుడిగా భక్తుల కోరికలు తీర్చే తిరుమల శ్రీవేంకటేశ్వరున్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, వారి శరణు ఘోష మాత్రమే ప్రతిబింబించాల్సిన పట్టణమది. అలాంటిది పగ.. ప్రతీకారేచ్ఛ, నేర ప్రవృత్తి పెరిగిపోయిన కొంత మంది కారణంగా ఆధ్యాత్మిక నగరి కీర్తి కరిగిపోతోంది. ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాల్సిన తిరుపతిని.... ఎక్కడో సమస్యలు వెంటాడుతూ...వెనక్కి లాగేస్తున్నాయి. ప్రజలు జీవించేందుకు కావాల్సిన మౌలిక వసతులు, శాంతి భద్రతల కోణంలో జాతీయ స్థాయి జాబితాలో గతంలో రెండో స్థానంలో గెలిచిన తిరుపతి... నేడు ప్రమాణాల పరంగా ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది.

ముఠా కక్షలు..

ముఖ్యంగా ఇటీవలి కాలంలో లేనట్లుగా కొన్ని ముఠాలు పగప్రతీకారాలతో హత్యలకు పాల్పడటం నగరవాసుల్లో ఆందోళనను పెంచుతోంది. 2017లో జరిగిన సాకేత్ భార్గవ్​ హత్యకి సమాధానంగా 2019లో రౌడ్ షీటర్ బెల్ట్ మురళీని ....భార్గవ్ మనుషులు హత్యచేశారు. ఆ తర్వాత 2019లో రౌడీషీటర్ బెల్ట్ మురళిని హత్య చేసిన వారిలో దినేష్ అనే యువకుడు ఉన్నాడు. కొన్ని రోజులు కిందట మురళీ ముఠా.....దినేష్​ను అత్యంత పాశవికంగా హతమార్చారు. ఇది అన్ని చోట్ల ఉండేదే అయినా లింక్ హత్యలు జరగటం, ఆ పథకాలను పోలీసులు గుర్తించలేకపోవటం నేరాల పెరుగుదలకు కారణమవుతోంది.

హ్యాకింగ్ గురైన పోలీసుల ఖాతాలు...

ఇంతే కాకుండా తిరుపతి అర్బన్ పోలీసుల పరిధిలోని శ్రీకాళహస్తి ఆలయంలో...అనధికార విగ్రహాల ఏర్పాటు విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. నిఘా వైఫల్యం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు పోలీసులు కేసు చేధనలో తెలిపారు. మనకు అనుక్షణం భద్రత ఇచ్చే పోలీసుల సామాజిక మాధ్యమాలే హ్యాకింగ్ గురైనట్లు వెలువడిన ప్రకటన....నగరంలో సైబర్ ఆటగాళ్ల మాఫియాను పరిచయం చేసింది. జరిగిన ఘటనపై కేసులు నమోదుకాగా....వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతున్నారు. పోలీస్ ఆఫీసర్ల పేరిట నకిలీ సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరిచి....ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి రావటం మరింత ఆందోళను పెంచుతోంది.

నత్తనడకన అభివృద్ధి పనులు..

తిరుపతిలో నిఘా వ్యవస్థ ఆందోళనకర రీతిలో ఉండటానికి గల కారణాల్లో.....నగరంలో నత్తనడకన సాగుతున్న అభివృద్ధి పనుల పాత్ర కూడా ఉంది. తితిదే, నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గరుడ వారధి పనుల కారణంగా....పద్మావతి పురం నుంచి కపిల తీర్థం వరకూ నగరమంతా ఇరుకుగా తయారైపోయింది. సీసీ కెమెరాలున్నా ఆ వారధి నిర్మాణ పనులు కారణంగా....ఎన్నో స్తంభాలను తొలగించాల్సి వచ్చింది.

వీటి కారణంగా ఎన్నో కేసుల్లో వాస్తవాలను తెలుకోవటంలో, కేసు విచారణలో పోలీసులకు అనుకోని జాప్యం ఎదురువుతోంది. తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో ఇప్పటివరకూ 382 దేవాలయాలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తించటంలో దేవస్థానాల భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రమేష్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలను జారీచేశారు..

నేర ప్రవృత్తి... హత్య కేసుల వరకూ వెళ్లటాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతి పశ్చిమ పోలీసులు 40మంది రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్ చేశారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో 1000 సీసీ కెమెరాలను అమర్చాలనే ప్రణాళికలను అనుసరిస్తున్నారు. ఫలితంగా ఆధ్యాత్మిక నగరిలో నేరాల శాతాన్ని తగ్గించి శాంతి భద్రతలను నెలకొల్పుతామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

లాటరీ ఆశ చూపి.. రూ. 21 లక్షలు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.