ETV Bharat / city

Southern Zonal Council: నేడు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ.. ఏపీ అజెండా ఏంటంటే!

author img

By

Published : Nov 13, 2021, 6:08 PM IST

Updated : Nov 14, 2021, 4:23 AM IST

ఆదివారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ కానుంది(southern zonal counci meet ) అయితే ఈ సమావేశానికి ఏపీ నుంచి ఓ కీలకమైన ప్రతిపాదన వచ్చినట్టు కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో ముఖ్యంగా.. 3 రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని ఉన్నట్టు స్పష్టం చేసింది. దీంతో పాటు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలతో పాటు నీటి ప్రాజెక్టుల విషయంపై ప్రధానంగా వివరించనుంది. మరోవైపు ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఆ రాష్ట్ర ప్రతినిధిగా హోం మంత్రి మహమూద్ అలీ హాజరు కానున్నారు.

Southern Zonal Council
Southern Zonal Council

తిరుపతిలో ఆదివారం జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి రంగం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. తిరుపతిలోని తాజ్‌హోటల్‌లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది జరుగుతుంది. అనంతరం అతిథుల గౌరవార్థం ఏపీ సీఎం జగన్‌ విందు ఇస్తున్నారు. అమిత్‌షా శనివారం సాయంత్రమే తిరుపతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సమావేశానికి హాజరవడంలేదని.. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వస్తున్నట్టు సమాచారం. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆదివారం సొంత నియోజకవర్గం పర్యటనకు వెళుతున్నందున రావడం లేదని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆదివారం ప్రత్యేక విమానంలో వస్తున్నారని తెలిసింది. కేరళ నుంచి ఆర్థిక మంత్రి, సీఎస్‌ హాజరవుతున్నారు. లక్షద్వీప్‌ పరిపాలనాధికారి, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, సీఎస్‌లు, ముఖ్య అధికారులు శనివారమే తిరుపతికి చేరుకున్నారు. పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగస్వామి హాజరుకానున్నారు. రాష్ట్రాల ప్రతినిధుల ప్రసంగాల తర్వాత కేంద్ర హోం మంత్రి మాట్లాడతారు.

3 రాజధానుల అంశం ప్రస్తావన..!

రాష్ట్రంలో మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఏపీకి కొత్త రాజధాని అభివృద్ధి కోసం రూ.2,500 కోట్ల సాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2014-17 మధ్య రూ.1,500 కోట్లు విడుదల చేసిందని, మిగతా రూ.వెయ్యి కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనుంది. స్టాండింగ్‌ కమిటీ రూపొందించిన సమావేశం అజెండాలో మాత్రం.. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర హోం శాఖ చెప్పినట్టుగా పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేలా చట్టాన్ని సవరించాలని అక్టోబరు 20న రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిపాదనలివీ..

  1. ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడుకు చెందిన ఫిషింగ్‌బోట్లు అక్రమంగా ప్రవేశించడం వల్ల స్థానిక మత్స్యకారులతో ఘర్షణలు జరుగుతున్నాయి.
  2. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాలార్‌ నదిపై చిన్ననీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై తమిళనాడు అభ్యంతరం చెప్పడంపై చర్చ.
  3. తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా చేసినందుకు తమిళనాడు ఇంకా రూ.338 కోట్ల చెల్లించాల్సి ఉండటం.
  4. ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిన రూ.6015 కోట్ల బకాయిలపై.
  5. జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు. ఏపీలో దారిద్య్రరేఖకు దిగువన గ్రామాల్లో 10.96%, పట్టణాల్లో 5.81% ఉన్నారని వెల్లడి.
  6. జాతీయ పోలీస్‌ అకాడమీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో మధ్య, ఉన్నతస్థాయి జైలు సిబ్బందికి శిక్షణ కోసం జాతీయ ప్రిజన్‌ అకాడమీ ఏర్పాటు
  7. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు. రామాయపట్నం ఓడరేవు, కడపలో ఉక్కు కర్మాగారం, కాకినాడలో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాకి ఏడీపీ ఇచ్చే రుణాన్ని గ్రాంట్‌గా మార్చడం వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించనుంది.

ఇతర అంశాలు..

  • శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్స్‌ నుంచి పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టడాన్ని కర్ణాటక ప్రభుత్వం ఎజెండాలో పెట్టింది.
  • తుంగభద్ర నదిపై ఏపీ ప్రతిపాదిత గుండ్రేవుల ప్రాజెక్టు అంశాన్ని, తెలంగాణ చేపట్టనున్న రాజీవ్‌గాంధీ సంగంబండ బ్యారేజీ అంశాన్నీ కర్ణాటక ఎజెండాలో చేర్చింది.
  • ఇంద్రావతి, కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరి నదుల అనుసంధానం అంశాన్ని పుదుచ్చేరి ప్రతిపాదించింది.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సారథ్యంలో జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షదీవుల ముఖ్యమంత్రులు/లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ భేటీకి సుమారు 90 నుంచి 100 మంది హాజరుకానున్నారు.

తిరుపతికి అమిత్ షా.. స్వాగతం పలికిన జగన్

సమావేశం కోసం.. శనివారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రేణిగుంటకు చేరుకున్నారు. ఆయనకు సీఎం జగన్ స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నెల్లూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టుకు వెళ్లనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. మధ్యాహ్నం జరిగే దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ భేటీలో అమిత్ షా పాల్గొంటారు.

తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ!

దక్షిణాది రాష్ట్రాల జోనల్​ కౌన్సిల్​ సమావేశానికి (Southern Zonal Council Meeting) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (State Home Minister Mahmood Ali) హాజరు కానున్నట్లు తెలిసింది. మహమూద్ అలీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (cs somesh kumar), సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) ఈ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం.

తెలంగాణ ప్రభుత్వ అజెండా!

తెలంగాణ నుంచి తమకు 6,015 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు రావాలని కోరుతూ ఏపీ... ఎజెండాలో చేర్చింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అంతకంటే చాలా ఎక్కువ మొత్తం రావాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం... ఇదే విషయాన్ని మరోమారు సమావేశంలో వివరించనుంది. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన అంశం కూడా ఎజెండాలో ఉంది. విభజన చట్టం, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని... అందుకు భిన్నంగా ఆస్తుల పంపిణీకి ఆస్కారం లేదని తెలంగాణ అంటోంది.

నదీ యాజమాన్య బోర్డులపైన చర్చ

పాలమూరు - రంగారెడ్డి (palamuru - rangareddy), డిండి ఎత్తిపోతల (dindi lift irrigation) పథకాలతో పాటు సంగంబండ ఆనకట్ట నిర్మాణాన్ని కర్ణాటక ఎజెండాలో ప్రతిపాదించింది. ఏపీ కూడా వీటిపై ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. దీంతో కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా, కేటాయింపులు తదితర అంశాలను భేటీలో ప్రస్తావించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నదీ యాజమాన్య బోర్డులు (river management boards), నదుల అనుసంధానికి సంబంధించి వాదనను పునరుద్ఘాటించనున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటిని సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.

జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటు.. నేపథ్యం ఇలా

రాష్ట్రాల పునర్​వ్యవస్థీకరణ -1956 చట్టంలోని సెక్షన్ 15 - 22 ప్రకారం.. దేశవ్యాప్తంగా 5 జోనల్ కౌన్సిల్స్​ను ఏర్పాటు చేశారు. ప్రతి జోనల్​ కౌన్సిల్ కు కేంద్ర హోంమంత్రి ఛైర్మన్​గా వ్యవహరిస్తే.. ఆయా రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. దీంతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు.. సభ్యులుగా నియమిస్తారు. కేంద్ర - రాష్ట్ర సంబధాలతో పాటు రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఇందులో ప్రధానంగా.. రాష్ట్రాల సరిహద్దు వివాదాలు, రోడ్లు, రవాణా, పరిశ్రమలు, నీటి వాటాలు, విద్యుత్, అడవులు, పర్యావరణం, విద్య, ఆహార భద్రత, పర్యాటకం, గృహ నిర్మాణం వంటి రంగాలు ఉంటాయి.

ఇదీ చదవండి:

మహారాష్ట్రలో ఎన్​కౌంటర్​- ఐదుగురు నక్సలైట్లు మృతి

Last Updated : Nov 14, 2021, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.