ETV Bharat / city

కందనవోలు గజ గజ

author img

By

Published : Apr 29, 2020, 9:17 AM IST

కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొత్తం కోరనా కేసుల 332కి చేరింది. పది రోజుల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంలోనే కేసుల సంఖ్య 190కి చేరింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

corona cases increasing in karnool
ర్నూలులో పెరుగుతున్న కరోనా బాధితులు

కరోనాతో కందనవోలు గజగజలాడుతోంది. పాజిటివ్‌ కేసులకు అంతే లేకుండా పోతోంది. ఈ నెల 18వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 132 ఉన్న కేసులు పది రోజుల్లోనే 200 పెరిగి మొత్తం కేసుల సంఖ్య 332కు చేరాయి. మంగళవారం కొత్తగా 40 కేసులు వెలుగుచూశాయి. వీటిలో కర్నూలులోనే 31 కేసులున్నాయి. గణేశ్‌ నగర్‌ రెండు, బాలాజీ నగర్‌, సంతోష్‌ నగర్‌, లక్ష్మీ నగర్‌ ప్రాంతాల్లో ఒక్కోటి ఉన్నాయి. సర్వజన వైద్యశాలలో గైనిక్‌ విభాగంలో పనిచేస్తున్న సీనియర్‌ రెసిిడెన్సీ వైద్యురాలు ఒకరు వైరస్‌ బారిన పడ్డారు. కోడుమూరులో మూడు, కోవెలకుంట్ల, పాణ్యం, నంద్యాలలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కోవెలకుంట్లలో ఓ బాలింత వైరస్‌ బారిన పడ్డారు. కర్నూలులో సమీక్ష సమావేశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలుజరగకపోవడం వల్ల ఇన్ని కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. కర్నూలులో కేసుల సంఖ్య 190కి చేరింది.

రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో పరీక్షలు ఏవీ?

జిల్లాలో రెడ్‌ జోన్‌ ప్రాంతాలు 35 వరకు ఉన్నాయి. సింహభాగం కర్నూలు, నంద్యాలలో ఉండగా నందికొట్కూరు, ఆత్మకూరు, పాణ్యం, కోడుమూరు ప్రాంతాల్లోని రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో ఇంటింటా అనుమానితులకు పరీక్షలు చేయాలనే నిబంధన ఉంది. కర్నూలు పాత నగరంలో కొవిడ్‌ పరీక్షలు సక్రమంగా జరగడం లేదు. స్వచ్ఛందంగా చేయించుకునేవారు తప్ప, ఇళ్లకు వెళ్లి అందరికీ చేసే పరిస్థితి తక్కువగా ఉంది. ఫలితంగా చాలామంది తమకు వైరస్‌ ఉన్నా గుర్తించలేక, సాధారణంగా బయట తిరుగుతుండటంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఇళ్లకు పంపాక కేసుల గుర్తింపు..

దిల్లీకి వెళ్లివచ్చిన వారిలో అనుమానితులను, కె.ఎం. ఆసుపత్రి నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపారు. వారిలో పాజిటివ్‌ కేసులను గుర్తించి ఐసోలేషన్‌ వార్డుల్లో చేర్చడం ఆలస్యమవుతోంది. కోడుమూరులో 60 ఏళ్ల వృద్ధునికి వైరస్‌ లేదని క్వారంటైన్‌ నుంచి ఇంటికి పంపాక, మళ్లీ పాజిటివ్‌ వచ్చిందని ఆసుపత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి సైతం క్వారంటైన్‌ నుంచి వచ్చాక పాజిటివ్‌గా వచ్చింది. ఈలోగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం వల్ల భార్య, కుమారుడు వైరస్‌ బారిన పడ్డారు.

జొహరాపురంలో ఇద్దరు చిన్నారులకు..

ఆస్పరి మండలం జొహరాపురంలో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారు ఇళ్లలో ప్రత్యేక గదిలోనే చికిత్స తీసుకుంటామని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి గత నెల దిల్లీ వెళ్లిరాగా... ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. చికిత్సలు నిర్వహించిన అధికారులు ఎక్కడెక్కడ తిరిగారనే వివరాలు సేకరించగా... దిల్లీ నుంచి వచ్చిన తరువాత నేరుగా ఆయన అత్తమామల గ్రామమైన జొహరాపురం వెళ్లినట్లు చెప్పారు. దీంతో అధికారులు జొహరాపురానికి చెందిన పది మందిని కర్నూలు క్వారంటైన్‌కు పంపారు. 19 రోజుల పాటు అక్కడే నిర్బంధ పరిశీలనలో ఉన్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం అందరికీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ రావడంతో అధికారులు వారందరినీ స్వగ్రామానికి పంపారు. 27వ తేదీ మధ్యాహ్నం కర్నూలు నుంచి వైద్యులు వెళ్లి 11 నెలల చిన్నారికి, పదేళ్ల అబ్బాయికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, కర్నూలు రావాలని వారికి సూచించారు. కాగా, ఆ కుటుంబ సభ్యులు కర్నూలు వెళ్లేందుకు తిరస్కరించారు. ‘‘మీరే అన్ని పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని ఇంటికి పంపించి... మళ్లీ ఇప్పుడు పాజిటివ్‌ వచ్చిందని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దాంతో అధికారులు హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించి వెనుదిరిగారు. మంగళవారం ఆదోని డీఎస్పీ రామకృష్ణ, ఆలూరు సీఐ భాస్కర్‌ గ్రామాన్ని సందర్శించారు. మొలగవల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి మారుతీకుమార్‌తో మాట్లాడారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆయనతో చర్చించారు. డీఎస్పీ మాట్లాడుతూ గ్రామస్థులు ఎవరూ బయటకు రావద్దని... ఇంట్లోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.