ETV Bharat / city

మిరప విక్రయాలపై కరోనా ప్రభావం... రైతుల ఆందోళన

author img

By

Published : Apr 16, 2020, 8:24 PM IST

మిరప విక్రయాలపై కరోనా ప్రభావం.. రైతుల ఆందోళన
మిరప విక్రయాలపై కరోనా ప్రభావం.. రైతుల ఆందోళన

ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వాన మిర్చి రైతులకు తీరని నష్టాన్నే మిగిల్చింది. మిగిలిన ఎంతో కొంత పంటను అమ్ముకుందామంటే కరోనా అడ్డుపడుతోంది. లాక్​డౌన్​ కారణంగా మార్కెట్​కు తీసుకొచ్చి అమ్ముకోలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, కూలీ డబ్బులు చెల్లించలేక ఉమ్మడి వరంగల్​కు చెందిన మిరప రైతులు నానా అవస్థులు పడుతున్నారు.

పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది తెలంగాణ మిర్చి రైతుల పరిస్థితి. సాగుకాలంలో తెగుళ్లతో ఇబ్బంది పడ్డారు. చేతికొచ్చి సమయానికి వడగండ్ల వాన దెబ్బతీసింది. తీరా పంట చేతికొచ్చాక... అమ్ముకుందామంటే కరోనా కాటేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో తోయక మిర్చి రైతులు కుమిలి పోతున్నారు. లాక్​డౌన్​ కారణంగా మార్కెట్​ మూతపడి అమ్ముకునేందుకు వీలు లేకుండా పోయింది. పెట్టుబడికి తెచ్చిన అప్పుల వడ్డీలు పెరిగిపోతున్నాయి. కూలీలు కూడా చెల్లించలేని స్థితిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

రైతుబంధుతో ఆసరా

గతేడాది ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకున్న రైతులకు ప్రస్తుత పరిస్థితి కాస్త ఊరట కల్పించినా... కరోనా కట్టడికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​తో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ రంగానికి ఇచ్చిన వెసులుబాటుతో ఊరటనిస్తోంది. పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్న వారికి రైతుబంధు పథకం ద్వారా రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులు శీత గిడ్డంగులకు తరలిస్తున్నారు. కానీ కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ముందుగానే బుక్​ చేసుకోవడం... రైతుల పాలిట శాపంగా మారింది.

శీతల గిడ్డంగుల కొరత

తెలంగాణలోని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​ పరిధిలో 25 శీతల గిడ్డంగులు ఉన్నప్పటికీ... ఇప్పటికే సగానికి పైగా నిండాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిర్చీని మార్కెట్​కు తీసుకువస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. అదునుగా తీసుకున్న యజమానులు కిరాయిని రెట్టింపు చేస్తున్నారు. పెట్టుబడి, కూలీల ఖర్చు, కోల్డ్​ స్టోరేజీ ఖర్చులు కలుపుకుంటే... క్వింటాల్​కు రూ. 20 వేలు వస్తే తప్ప లాభం రాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్​ ప్రారంభమైన తర్వాత ధరలు పడిపోతే నష్టాలు మూటగట్టుకోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక ధరలు తీసుకుంటున్న శీతల గిడ్డంగుల యజమానులపై చర్యలు తీసుకోవాలని, రైతుబంధు పథకం అందరికీ వర్తించేలా అధికారులు చొరవ చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మిరప విక్రయాలపై కరోనా ప్రభావం.. రైతుల ఆందోళన

ఇవీ చూడండి: మిర్చి రైతుకు అకాల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.