ETV Bharat / city

అన్నదాతలు అప్​డేటయ్యారు.. మిర్చి పంటను కాపాడుకునేందుకు...ఆ ఏర్పాట్లు..

author img

By

Published : Feb 8, 2022, 11:44 AM IST

ఎంతో కష్టపడి పండించిన పంట దొంగలపాలు కాకుండా కాపాడుకునేందుకు గుంటూరు జిల్లాలో అన్నదాతలు వినూత్నంగా ఆలోచించారు. కొంత మంది కలిసి నిఘా ఏర్పాట్లు చేసుకున్నారు. మిర్చి కల్లాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. పంట దొంగలపాలు కాకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.
CCTV cameras at Mirchi Kallalu
CCTV cameras at Mirchi Kallalu

మిర్చి పంటపై కన్నేసిన దొంగలు .. కాపాడుకోవటానికి రైతుల వినూత్న ఆలోచన

గుంటూరు జిల్లాలో మిర్చి అధికంగా పండిస్తారు. పంట కోశాక కల్లాలకు తరలించి ఎండబెడతారు. ఇళ్లలో తగినంత స్థలం ఉండకపోవడంతో పొలాల్లోనే ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ ఏడాది తామర పురుగు చీడతో జిల్లాలో మిర్చి పంట చాలా చోట్ల బాగా దెబ్బతింది. దీనివల్ల దిగుబడి తగ్గి.. పంటకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కల్లాల్లో ఆరబోసిన మిర్చిని రాత్రికిరాత్రే దొంగలు ఎత్తుకెళుతున్నారు. నుదురుపాడు, తిమ్మాపురం, నాదెండ్ల మండలాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు.. యడ్లపాడుకు చెందిన రైతులు కొందరు వినూత్నంగా ఆలోచించారు. మిర్చి ఆరబోసిన కల్లాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పొలంలో కర్రలు పాతి.. వాటి సాయంతో లైట్లు, సీసీటీవీ కెమెరాలు అమర్చారు.

కల్లాల్లో డేగ కన్ను..

రాత్రి సమయంలో కల్లాల్లో ఉన్న పంటను సీసీటీవీ కెమెరాల సాయంతో సెల్‌ఫోన్లో గమనిస్తూ.. దొంగల పాలు కాకుండా చూసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. సీసీటీవీ కెమెరాల నిర్వహణ ఖర్చు ఎక్కువగానే ఉంటోంది. దీనివల్ల విడివిడిగా కాకుండా.. కొందరు రైతులు కలిసి ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. కెమెరాలు అమర్చిన తర్వాత దొంగతనాలు తగ్గాయని అంటున్నారు. ఆరుగాలం పడ్డ కష్టం దొంగలపాలు కాకుండా ఉండేందుకు రైతులు చేసిన వినూత్న ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తోంది.

ఇదీ చదవండి: అనిశా అధికారులకు చిక్కిన.. ఫిరంగిపురం పోలీసులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.