ETV Bharat / city

Eluru Road: వేరే మార్గం కానరాక... చేసేదేమీ లేక.. నరక ప్రయాణం

author img

By

Published : Sep 10, 2022, 6:03 AM IST

Dilapidated road
రహదారి

Worst Road: ఆ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయం. ఆ దారిలో ప్రయాణిస్తే వాహనాలు షె‌డ్డుకెళ్లాల్సిందే. అడుగడుగునా గుంతలతో ఒళ్లు హూనమవడం ఖాయం. దట్టంగా అలుముకున్న దుమ్ము దెబ్బకు ఆరోగ్యం పాడవడం గ్యారంటీ. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. ప్రత్యామ్నాయ మార్గం లేక, గత్యంతరం లేని పరిస్థితిల్లో ప్రజలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పేరుకు జాతీయ రహదారైనా... గ్రామీణ రోడ్ల కంటే అధ్వానంగా తయారైంది. ఇది రోడ్డేనా అనేలా వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది.

వేరే మార్గం కానరాక... చేసేదేమీ లేక.. నరక ప్రయాణం

Eluru Road: ఇక్కడ వాహనాల వెనుక కనిపిస్తున్నది దట్టమైన పొగమంచో.. ఏదైనా తగులబెడితే వచ్చిన పొగో కాదు. రోడ్డు దుస్థితికి నిదర్శనంగా కమ్ముకున్న దుమ్ము. కంకర తేలిన, గుంతలమయమైన రోడ్డుపై.. ధూళి ధాటికి ఎదురుగా వస్తున్న వాహనం కూడా కనిపించదు. వెనుక ఎవరున్నారో అర్థం కాదు. ఇక్కడ ప్రయాణమంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. తరచూ ప్రమాదాలతో ఆందోళన చెందుతున్నారు.

ఇది తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి ఏలూరు జిల్లా మీదుగా విశాఖ వెళ్లే జాతీయ రహదారి. ఈ మార్గంలో నిత్యం కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు సరకు రవాణాతో పాటు.. పరిశ్రమలకు ముడి సరుకులు చేరవేసేందుకు ఇదే ప్రధాన రహదారి. భారీ నుంచి అతిభారీ వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ఏళ్ల తరబడి రహదారుల నిర్వహణ గాలికి వదిలేయడం, రద్దీ పెరగడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణానికి ఏమాత్రం వీలు కాకుండా తయారైంది.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి బయ్యనగూడెం మీదుగా తాడేపల్లిగూడెం, దేవరపల్లి, రాజమహేంద్రవరం వెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై జాలీగా వెళ్దామనుకుంటే.. ఏ గుంతలోనో పడి నడుం విరగక తప్పదు. వంకర గోతులను తప్పించేందుకు వాహనదారులు నానాయాతన పడాల్సిందే. ఇక్కడ ఆటోలను తిప్పితే వచ్చే డబ్బు.. రిపేర్లకే సరిపోవట్లేదన్నది డ్రైవర్లంటున్నారు. ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణించే వారి పరిస్థితి నరకమనే చెప్పాలి. ప్రత్యామ్నాయ మార్గం లేక ఇటువైపే రావాల్సి వస్తోంది. గంటల తరబడి ప్రయాణంతో ప్రజలు విసిగిపోతున్నారు.

రోడ్డుపై లేచే దుమ్ము కారణంగా... పక్కనున్న పొలాలు సైతం దెబ్బతింటున్నాయి. ఆకుపచ్చగా కళకళలాడాల్సిన మొక్కలు బూడిదలా మారిపోయాయి. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు ఇదే దుస్థితి. ప్రయాణికుల అవస్థలు చూసో... లేక ఈ రహదారిపై వస్తున్న వార్తలకు చలించో... ఎట్టకేలకు నిర్మాణ పనులు చేపట్టినా... ఆ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. భారీ వాహనాల కారణంగా పలు చోట్ల భూమి కుంగుతోంది. మట్టి జారిపోయి కొన్నాళ్లకే రోడ్డు మళ్లీ పాడవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

"రోడ్డుపై లేచే దుమ్ముతో పక్కనున్న పొలాలు సైతం దెబ్బతింటున్నాయి. మొక్కలు బూడిదలా మారిపోయాయి. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు ఇదే దుస్థితి. ప్రయాణికుల అవస్థలు చూసైనా, ఈ రహదారిపై వస్తున్న వార్తలకు చలించైనా... ఎట్టకేలకు నిర్మాణ పనులు చేపట్టినా ఆ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. భారీ వాహనాల కారణంగా పలు చోట్ల భూమి కుంగుతోంది. మట్టి జారిపోయి కొన్నాళ్లకే రోడ్డు మళ్లీ పాడవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలి" -వాహనదారులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.