ETV Bharat / city

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం!

author img

By

Published : Oct 12, 2020, 11:46 AM IST

Updated : Oct 12, 2020, 5:14 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఉత్తర కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉనట్లు.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

weather
weather

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా కోస్తాంధ్ర తీరం వైపుకు దూసుకువస్తోంది. గడిచిన ఆరు గంటల్లో ఇది గంటకు 4 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది రేపు ఉదయానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశమున్నట్టు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని విశాఖ, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారటంతో.. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలియచేసింది. అటు విశాఖ, కాకినాడ తదితర ఓడరేవుల్లో ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఉన్న నౌకల్ని అవుటర్ హార్బర్ కు తరలిచాంల్సిందిగా ఏపీ మారిటైమ్ బోర్డు సూచించింది. నౌకల్లోని కార్గో హ్యాండ్లింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కాకినాడ లో 13 విదేశీ నౌకలు ఉన్నట్టు ఏపీ మారిటైమ్ బోర్టు స్పష్టం చేసింది. అటు విశాఖలోనూ పూర్తి అప్రమత్తత ప్రకటించారు. కోస్తా తీరం వెంబడి అన్ని జిల్లాల కలెక్టరేట్లనూ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.

ఇదీ చదవండి: విశాఖలో కొండచరియ విరిగిపడి తల్లీబిడ్డ మృతి

Last Updated : Oct 12, 2020, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.