ETV Bharat / city

Gadari Kishor: భయంతోనే.. ఆర్​ఎస్ ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు!

author img

By

Published : Aug 9, 2021, 9:08 PM IST

Gadari Kishor
Gadari Kishor

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​పై తెలంగాణలోని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శలు చేశారు. అధికారిగా ఉన్నప్పుడు పొందిన ఆదరణ చూసి రాజకీయాల్లో ప్రజలు ఓట్లు వేస్తారనుకోవద్దని హితవు పలికారు.

భయంతోనే.. ఆర్​ఎస్ ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు

ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ఆర్​ఎస్ ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్​లోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెరాసపై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఎందుకు ప్రశ్నించరని అన్నారు.

కమ్యూనిస్ట్, ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి నువ్వు చేసిన కుట్రలు నీకు తెలియవా? నాకు తెలియవా? ఉద్యమాలను అణచివేసిన నువ్వు ఇవాళ రాజ్యాధికారం కోసం ఉద్యమాలు చేస్తానంటే నవ్వుపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకో తీరులా కనిపిస్తలేదు. ప్రభుత్వంలో ఏ కార్యక్రమం జరిగినా... దానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారు. నీలెక్క సొంత డబ్బా కొట్టుకోలే, నీలెక్క స్కూళ్లల్ల ఫొటోలు పెట్టుకోలే. పోరగాళ్లతోటి పాలాభిషేకాలు చేయించుకోలే. ఈ డ్రామాలు మా ముఖ్యమంత్రి ఎప్పుడు చేయలే. అయినా సహించినం. మన జాతికి మంచి జరిగితే చాలని. ఇక్కడ ఒకటే ఒక్క అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా... వేరే రాష్ట్రాలతో పోల్చిచూసినపుడు పూర్తి స్థాయిలో కాకపోయినా దళితజాతిని బయటకు తీసుకురావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాలుపంచుకున్నాడు. దళితుల కోసం పనిచేయకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉన్నాడు. మోదీ వంచిస్తే కనీసం ఒక్కమాట కూడా అనలేదు. ఏందీ కారణం. ఐపీఎస్ ఆఫీసర్​గా ఉండి... ఇష్టమొచ్చినట్లు ప్రమాణాలు చేయిస్తే కేసు పెడతారని భయంతో ఉద్యోగం ఉంటదో ఊడిపోతదో అని భయాందోళనకు గురై జాతి కోసం బయటకొస్తున్న అని కలరింగ్ ఇచ్చాడు. నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం బయటపడి... బహుజన సమాజ్ వాది పార్టీలో చేరినవ్. బీజేపీ తల్లి పార్టీలా ఉంటే... బీఎస్పీ దాని పిల్లపార్టీ.

"ప్రతి పదేళ్లకొకసారి ఇలాంటి వాళ్లు బయలుదేరతారు. దళిత జాతి బాగుపడుతుంటే వాళ్లను ఆగమాగం చేసి, గందరగోళం చేయాలని చూస్తారు. దళితులకు ప్రమోషన్స్‌, ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో చేస్తున్నారు. ఎప్పటికైనా విజయం సాధించేది ప్రజలేనని కేసీఆర్‌ అంటారు. సందర్భాన్ని బట్టి, ఎవరిని నమ్మాలి.. ఎవరికి చురకలు పెట్టాలో ప్రజలకు బాగా తెలుసు. గతంలో చాలా మంది అధికారులు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. మీరు భాజపా ప్రయోగిస్తున్న కుట్రలో భాగంగా వస్తున్నారు. వాళ్లు మిమ్మల్ని పావుగా వాడుతున్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను విచ్ఛినం చేసే దిశగా భాజపా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌కుమార్‌ గ్రహించాలి. దళిత బంధులాంటి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు. త్వరలోనే మీకు కనువిప్పు కలుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చి కారు విజయం తథ్యం." అని కిషోర్‌ అన్నారు.

ఇదీ చదవండి:

RRR on RSP: 'పోలీసుగా ఉండి రాజకీయాలు మాట్లాడవద్దని మాత్రమే అన్నా..!'

వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డులకు నిధుల మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.