ETV Bharat / city

లోక్‌సభ నుంచి తెరాస ఎంపీల వాకౌట్.. ఉపాధి కల్పనపై చర్చ జరపలేదని నిరసన

author img

By

Published : Mar 24, 2022, 6:42 PM IST

TRS MPs Walkout From Lok Sabha: దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యపై పార్లమెంటులో చర్చ జరపాలని కోరితే.. కేంద్రం తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవటం సరైంది కాదని తెరాస ఎంపీలు మండిపడ్డారు. లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేసిన తెరాస సభ్యులు.. కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన భాజపా.. యువతను మోసం చేసిందని విమర్శించారు. కేంద్రం జిమ్మిక్కులతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

లోక్‌సభ నుంచి తెరాస ఎంపీల వాకౌట్
లోక్‌సభ నుంచి తెరాస ఎంపీల వాకౌట్

లోక్‌సభ నుంచి తెరాస ఎంపీల వాకౌట్

TRS MPs Walkout From Lok Sabha : కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెరాస ఎంపీలు అన్నారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఉద్యోగాల భర్తీపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరుద్యోగల ఆత్మహత్యలపై చర్చ చేపట్టాలని లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన తెరాస.. ఉపాధి కల్పనపై ప్రధాని హామీ విషయంపైనా చర్చ జరపాలని కోరారు. చర్చ జరపలేదని లోక్‌సభ నుంచి తెరాస సభ్యులు వాకౌట్ చేశారు.

TRS MPs protest at Parliament : "నిరుద్యోగ సమస్యపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడంతో వాకౌట్ చేసాం. భాజపా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. 2014తో పోలిస్తే దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. ఉద్యోగ కల్పనపై ఇచ్చిన హామీలను భాజపా నెరవేర్చాలి. తెరాస ఎల్లప్పుడు యువతకు అండగా ఉంటుంది."

- నామ నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభాపక్ష నేత

TRS MPs about Unemployed Suicides : నిరుద్యోగం చాలా సీరియస్ అంశమని రాజ్యసభ ఎంపీ కేకే అన్నారు. గ్రామీణ స్థాయిలోను నిరుద్యోగం పెరిగిందని.. ఉపాధి హామీ పథకం కింద ఎన్ రోల్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ కల్పన కోసం నిధులు పెంచాల్సింది పోయి.. తగ్గించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం తన విధానంగా పెట్టుకుందని విమర్శించారు. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు.

TRS MPs comments on Modi Sarkar : "కేంద్రం వద్ద 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రూ.295 కోట్లు గత బడ్జెట్‌లో కేటాయిస్తే.. అవి ఇప్పుడు రూ.70 కోట్లకు చేరాయి. కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు నిధులు తగ్గించడంతో భవిష్యత్ ఉపాధి అవకాశాలపై ప్రభావం పడుతుంది. ప్రజా సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెరాస నిరసన మార్గాన్ని ఎంచుకుంది."

- కె.కేశవరావు, తెరాస రాజ్యసభాపక్ష నేత

TRS MPs about job recruitment : తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదన్న భాజపా అవాస్తవాలు చెబుతూ కాలం వెల్లదీస్తోందని తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఇప్పటికి ఒక్క ఉద్యోగం కల్పించలేకపోయారని మండిపడ్డారు. భాజపా అబద్ధపు పార్టీ అని ప్రజలు గుర్తించారని తెలిపారు. నిరుద్యోగం.. ఉద్యోగ ఖాళీలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ రాములు డిమాండ్ చేశారు.. దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో తెలుస్తుందని వివరించారు. తెరాస సర్కార్ విధానాలు తెరిచిన పుస్తకాలని.. తమ ప్రభుత్వం ఏం చేసిందో అది కళ్లముందే స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.