వారసత్వ పు ఆస్తి పంపకాల్లో వారసులకు జారీ చేసే డీడ్ల రిజిస్ట్రేషన్లలో ఆదాయం కోల్పోతున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు డీడ్ల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వసూళ్లకు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఖజానాకు నష్టం వాటిల్లకుండా.. ఇక నుంచి కొత్త నిబంధనలను అనుసరించాలని రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల డీడ్ల రిజిస్ట్రేషన్లలో కోల్పోతున్న ఆదాయంపై స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ దృష్టి సారించింది. వాటాల విలువను తగ్గించి చూపుతున్న కారణంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం కోల్పోతున్న లావాదేవీల్లో నిబంధనలు సవరిస్తూ అంతర్గత మెమో జారీ చేసింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల వాటాల పంపకాల్లో సరైన స్టాంపు డ్యూటీ చెల్లించక పోవడంతో ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం గుర్తించింది. హిందూ వారసత్వ చట్టం, భారత వారసత్వ చట్టాలను అనుసరించకుండా తగ్గించిన విలువతో స్టాంపు డ్యూటీ వసూలు చేస్తున్నట్టు రిజిస్ట్రేషన్ల శాఖ తేల్చింది. దీంతో ఇక నుంచి వారసత్వంగా వచ్చిన అస్తిని వారసులు సమాన వాటాలుగా పంపకాలు చేయాలని భావిస్తే 4 వాటాల్లో ఒక దాన్ని మినహాయించి మిగతా మూడు డీడ్లకు ఒక శాతం చొప్పున స్టాంపు డ్యూటీ వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
వారసత్వపు అస్తిని కుటుంబ సభ్యులు సమాన వాటాలు గా పంచుకోక పోతే గరిష్ఠ వాటాకు 1 శాతం స్టాంపు డ్యూటీ మినహాయించి లెక్కించాలని అలాగే అన్ని వాటాల డీడ్లకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి