ETV Bharat / city

ఉద్యోగుల డీఏ బిల్లులు వెనక్కి

author img

By

Published : Apr 28, 2022, 5:36 AM IST

ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరవు భత్యం బకాయిల బిల్లులను ప్రభుత్వం వెనక్కు పంపేసింది.అయితే...ఈ డీఏ బకాయిల బిల్లులన్నీ దాదాపు 25 రోజుల నుంచి ఖజానా అధికారుల వద్దే ఉన్నాయి. వాటిని సీఎఫ్‌ఎంఎస్‌లో సమర్పించేందుకు అవకాశం లేకుండా సైట్‌లో లాక్‌ చేశారని చెబుతున్నారు. ఈ బిల్లుల మొత్తం కలిపి రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

money
money

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరవు భత్యం బకాయిల బిల్లులను ప్రభుత్వం వెనక్కు పంపేసింది. ఆ బిల్లులను తిరిగి సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌కు సమర్పించాల్సి ఉన్నా అందుకు అవకాశం లేకుండా ఫ్రీజ్‌ చేసినట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన 5 డీఏలను ప్రకటించింది. వాటి బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. పాత పెన్షన్‌ విధానంలో ఉన్న ఉద్యోగులకు బకాయిలు వారి జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామని, అదే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంలో ఉన్న ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లిస్తామని పేర్కొంది. దాంతో ఎప్పటికప్పుడు ఉద్యోగులు బిల్లులు సమర్పిస్తూ వచ్చారు. ఇలా... ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న డీఏ బకాయిల బిల్లులను ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ చెల్లించలేదు.

కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో ఆర్థిక శాఖ అధికారులు ఆ బిల్లులను తిరిగి డీడీవోలకు పంపగా... వారు పరిశీలించి ఖజానా అధికారులకు పంపించారు. అక్కడి నుంచి మళ్లీ సీఎఫ్‌ఎంఎస్‌కు అవి చేరాల్సి ఉంది. అలా చేరిన తర్వాతే నిధుల లభ్యతను బట్టి బిల్లుల చెల్లింపులు ఉంటాయి. అయితే...ఈ డీఏ బకాయిల బిల్లులన్నీ దాదాపు 25 రోజుల నుంచి ఖజానా అధికారుల వద్దే ఉన్నాయి. వాటిని సీఎఫ్‌ఎంఎస్‌లో సమర్పించేందుకు అవకాశం లేకుండా సైట్‌లో లాక్‌ చేశారని చెబుతున్నారు. ఈ బిల్లుల మొత్తం కలిపి రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఏప్రిల్‌ నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించిన బిల్లులను మాత్రమే సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేయడం సాధ్యమవుతోందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: అప్పులపై రాష్ట్రం పంపిన నివేదికను.. వెనక్కి పంపిన కేంద్రం.. ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.