ETV Bharat / city

అప్పుల మేళం.. ఎప్పటికి పడేనో తాళం..!!

author img

By

Published : May 31, 2022, 5:41 AM IST

అప్పుల మేళం.. ఎప్పటికి పడేనో తాళం..!!
అప్పుల మేళం.. ఎప్పటికి పడేనో తాళం..!!

రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేట ప్రక్రియలో మరింత వేగం పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ ద్వారా రూ.28 వేల కోట్ల మేర మాత్రమే రుణ సేకరణకు అనుమతి ఉండగా.. ఈ నెలలో ఇప్పటికే రూ.7 వేల కోట్లు అప్పు తెచ్చింది. ఇవాళ ఆర్బీఐ నిర్వహించే వేలంలో మరో రూ.2,500 కోట్ల రుణ సేకరణకు ప్రయత్నిస్తున్న సర్కార్‌.. ఆ మొత్తం తీసుకుంటే.. ఒక్క మే నెలలోనే రూ.9,500 కోట్లు అప్పు తెచ్చినట్లవుతుంది.

అప్పులతో దినదిన గండంగా రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న వైకాపా ప్రభుత్వం.. రుణాల సేకరణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ రుణం రూ.28 వేల కోట్లు తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతిచ్చింది. సగటున నెలకు రూ.2,500 కోట్ల చొప్పున ఆ అప్పు సమీకరిస్తే ఏడాది మొత్తానికి సమంగా వాడుకున్నట్లవుతుంది. దీనికి భిన్నంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే నెలలో స్థాయికి మించి రుణాన్ని రాష్ట్రం తీసుకుంది. ఈ నెలలో రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో.. ఇప్పటికే రూ.7 వేల కోట్లు అప్పు తెచ్చింది. ఇవాళ ఆర్బీఐ నిర్వహించే వేలంలో మరో రూ.2,500 కోట్ల రుణ సేకరణకు ప్రయత్నిస్తుంది. ఆ మొత్తం తీసుకుంటే.. ఒక్క మే నెలలోనే రూ.9,500 కోట్లు అప్పు తెచ్చినట్లవుతుంది. అంటే.. కేంద్రం అనుమతించిన దాంట్లో మూడో వంతు మే నెలలోనే పూర్తైనట్లే.

మే 10న.. 10 ఏళ్ల కాలానికి 7.76 శాతం వడ్డీ రేటుతో వెయ్యి కోట్లు తెచ్చిన ప్రభుత్వం...ఇదే రోజున 19 ఏళ్ల కాలానికి 7.78 శాతం వడ్డీతో మరో వెయ్యి కోట్లు.....20 ఏళ్ల కాలానికి 7.78 శాతం వడ్డీకే ఇంకో వెయ్యి కోట్లు సేకరించింది. మే 17న 5 ఏళ్ల కాలానికి 7.46 శాతం వడ్డీకి వెయ్యి కోట్లతో పాటు 8 ఏళ్ల కాలానికి 7.63 వడ్డీ రేటుకు మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మే 24 న 9 ఏళ్ల కాలానికి 7.71 శాతం వడ్డీకి ఇంకో వెయ్యి కోట్లతో పాటు 10 ఏళ్ల కాలానికి 7.67 శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లు తెచ్చింది. ఈ రోజు రిజర్వుబ్యాంకు వేలం ద్వారా మరో 2వేల 5వందల కోట్ల అప్పు సేకరణకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం....అందులో వెయ్యి కోట్లు 9 సంవత్సరాలకి, మరో వెయ్యి కోట్లు 12 సంవత్సరాల కాలానికి, ఇంకో 5వందల కోట్లు 11 ఏళ్లకి రుణం తేవడానికి యత్నిస్తోంది. ఎంత వడ్డీ ధరకు రుణం సమీకరించేది ఇవాళ తేలుతుంది.

ఆదాయం కన్నా.. రుణం ఎక్కువ..: ఒక నెలలో రాష్ట్రం సొంత పన్నుల, పన్నేతర ఆదాయం కన్నా తీసుకుంటున్న రుణం ఎక్కువ. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల ప్రకారం...రాష్ట్ర పన్నుల రాబడి 73వేల689.77 కోట్లు. పన్నేతర రాబడి 5వేల451.20 కోట్లు. ఈ రెండు కలిపి చూసి నెలకు వచ్చే రాబడిని లెక్కిస్తే కేవలం 6వేల595 కోట్లుగా తేలుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ లెక్కల్లో పన్ను, పన్నేతర రాబడిని లక్ష 2వేల 142 కోట్లుగా లెక్కించింది. ఆ రూపేణా చూసినా రాష్ట్రానికి నెలకు సొంతంగా వచ్చే పన్నులు, పన్నేతర రాబడి 8వేల511 కోట్లే.

28వేల కోట్లకే అనుమతి..: గతంలో అత్యధికంగా నెలకు 5వేల కోట్లను ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు సమీకరించిన ఉదంతాలున్నాయి. రాష్ట్ర జీఎస్‌డీపీలో 4శాతం బహిరంగ మార్కెట్‌ రుణపరిమితికి అనుమతినివ్వాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంటోంది. అన్ని రుణాలు కలిపినా ఈ స్థాయి మించకూడదనే నిబంధన విధించింది. రాష్ట్రాల అర్హత, పరిమితికి మించి రుణభారంలో కూరుకుపోతున్నాయనే పరిస్థితుల మధ్య కేంద్ర వ్యయ విభాగం రుణాలకు పరిమితినిచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. తనకున్న అవకాశాల మేరకు 61వేల కోట్ల వరకు అప్పులు తీసుకునే వెసులుబాటు ఉందని కేంద్రం ముందు ఏపీ వాదించింది. ఈ వాదనతో కేంద్రం ఏకీభవించకుండా కేవలం 28వేల కోట్లకే అనుమతిచ్చింది.

ఇదీ చూడండి..

అధికార పార్టీ నాయకుడి ఇంట్లో.. నకిలీ విత్తనాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.